Chandramohan | హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా.. ఇలా విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు చంద్రమోహన్. 1966లో రంగులరాట్నం సినిమాతో సినీ కెరీర్ను మొదలుపెట్టిన చంద్రమోహన్.. తొమ్మిది వందలకు పైగా చిత్రాల్లో నటించాడు. 175 చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు లక్కీ హీరోగా కూడా అప్పట్లో పేరు తెచ్చుకున్నాడు. చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ సినిమాతో జయప్రద, పదహరేళ్ల వయసు సినిమాతో శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తిరుగులేని కథానాయికలుగా ఎదిగారు. 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇంటిపట్టునే ఉంటూ కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితం గడిపేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య, ప్రముఖ రచయిత్రి జలంధరతో కలిసి చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
చంద్రమోహన్ను చాలామంది లక్కీగా భావిస్తారని.. ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందని నమ్ముతారని జలంధర ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పటికీ జనవరి ఒకటో తేదీన ఎంతోమంది వచ్చి.. ఆయన చేత్తో డబ్బులు తీసుకొని వెళ్తారని చెప్పుకొచ్చింది. భార్య మాటలు వినగానే చంద్రమోహన్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. శోభన్బాబు ఎంత చెప్పినా వినకుండా వంద కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని ఎమోషన్ అయ్యాడు.
అప్పట్లో కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట తీసుకున్నారని.. ఆయన సలహాతో తాను కూడా 35 ఎకరాలు కొన్నానని చెప్పుకొచ్చాడు. కానీ దాన్ని మేనేజ్ చేయలేక అమ్మేశానని తెలిపాడు. శోభన్ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులోని 15 ఎకరాలను అమ్మేశానని చెప్పాడు. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లు అయ్యిందని చెప్పుకుంటూ బాధపడ్డాడు. అలాగే శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్డుకు 6 ఎకరాలు కొని.. అదీ అమ్మేశానని చెప్పాడు. ఇప్పుడు అక్కడ మంచి మంచి రిసార్టులు పెట్టారని గుర్తు చేసుకున్నాడు. ఇలా దాదాపు రూ.100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని తెలిపాడు. సంపాదించిన వాటికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ ఉందని చెప్పాడు. జయసుధది కూడా తనలాంటి పరిస్థితేనని చెప్పుకొచ్చాడు.
Jabardasth Comedia Hyper Adi | హైపర్ ఆదికి పెళ్లయ్యిందా? సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో