bahubali singer satya yamini | సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి. నయనతార, మంజిమా మోహన్, అదితి ప్రభుదేవా, హన్సిక ఇలా సెలబ్రెటీలు పెండ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బుల్లితెర కమెడియన్ యాదమ్మ రాజు సైతం తన ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు వీరి బాటలోనే ప్రముఖ సింగర్ సత్య యామిని కూడా పెండ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.
తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సింగర్ సత్యయామిని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టింది. కాబోయేవాడితో దిగిన ఫొటోను షేర్ చేయడంతో పాటు జీవితకాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉందంటూ రాసుకొచ్చింది. అయితే అతని వివరాలను మాత్రం యామిని వెల్లడించలేదు. మొత్తానికి పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన సత్య యామినికి తోటి సింగర్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. సింగర్స్ గీతామాధురి, అనుదీప్, మనీషాతో పాటు పలువురు సింగర్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెట్టారు.
ఇక యామిని విషయానికొస్తే పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి మ్యూజిక్ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి సినిమాలో ఆమె పాడిన మమతల తల్లి సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధురమైన గాత్రంతో యామిని ఆలపించిన ఆ పాట సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ సాంగ్తో టాలీవుడ్లో వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంది. బాహుబలి తర్వాత శైలజారెడ్డి అల్లుడు, అల వైకుంఠపురములో.., కొండపొలం, అఖండ, వకీల్సాబ్, రాధేశ్యామ్, బింబిసార, అహింస సినిమాల్లో క్రేజీ సాంగ్స్ పాడింది. అఖండ సినిమాలో జై బాలయ్య అంటూ ఆమె పాడిన పాట నందమూరి అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమా పాటలతో పాటు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు కవర్ సాంగ్స్ కూడా చేసింది.