అందం, ప్రతిభతో పాన్ ఇండియా తారగా ఎదిగింది రష్మిక మందన్న. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సీతా రామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి స్పందన తెచ్చుకుంటున్నది. ఈ సందర్భంగా సినిమా విజయంపై తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది రష్మిక మందన్న.
‘సీతా రామం’ మంచి విజయం సాధించడం సంతోషాన్నిస్తున్నది. ఈ కథలో నేను చేసిన ఆఫ్రీన్ పాత్రను బాగా డిజైన్ చేశారు. కథకు హృదయం లాంటి పాత్ర నాది. మాకు ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అరుదు. ప్రేక్షకులు ఈ పాత్రను ఎలా స్వీకరిస్తారో అని ముందు సందేహించాను. కానీ దర్శకుడు బాగుంటుందని చెప్పారు. ఇవాళ థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ చిత్ర విజయం మిగతా అందరికంటే దర్శకుడు హను రాఘవపూడికి దక్కాలి. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.
నటిగా టైప్ కాస్ట్ అవడం నాకిష్టం లేదు. ఒకే తరహా సినిమాల్లో నటించడం ఇష్టముండదు. కేవలం నాయికగానే చేస్తాననే హద్దులు పెట్టుకోలేదు. నటిగా ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. కొత్త తరహా చిత్రాల్లో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు ఒప్పుకుంటున్నా. ఇందులోనూ అలాగే నటించా. ఇప్పుడు చేస్తు న్న సినిమాల్లో డాక్టర్గా, భార్యగా, కూతురిగా వివిధ రకాల క్యారెక్టర్లలో నటిస్తున్నా. ఇలాగే వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నా. హీరో సరసన ఆడిపాడే చిత్రాలు సౌకర్యంగా ఉంటాయి కానీ నటిగా సంతృప్తి పంచలేవు. నేను మరో దారిని ఎంచుకున్నాను. ఆ దారిలో అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను.
నా కెరీర్కు కష్టంతో పాటు అదృష్టం తోడైంది. అందుకే నేను కన్నడలో నటిస్తున్నప్పుడే తెలుగులో గీత గోవిందం, దేవదాస్ వంటి వరుస అవకాశాలు వచ్చాయి. ఒక కథలో నటిగా మెప్పించగలదు అని దర్శకులు నమ్మినప్పుడు మన దగ్గరకు స్క్రిప్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు హిందీలోనూ అలాగే సినిమాలు దక్కుతున్నాయి. అమితాబ్ గారితో కలిసి నటించిన ‘గుడ్ బై’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ‘మిషన్ మజ్ను’ చిత్రీకరణ పూర్తి కాగా, రణబీర్ కపూర్తో కలిసి నటిస్తున్న ‘యానిమల్’ షూటింగ్లో ఉంది. ‘పుష్ప – 2’ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. ఆ చిత్ర వివరాలు తర్వాత వెల్లడిస్తా.