బాలీవుడ్ (Bollywood) నుంచి త్వరలో రాబోతున్ప మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో ఒకటి బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee ) డైరెక్షన్లో మల్టీస్టారర్గా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు రణ్ బీర్ కపూర్, అలియాభట్ (Alia bhatt), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , మౌనీరాయ్, టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్గా విడుదలకు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది టీం. ప్రమోషన్స్ కోసం రణ్ బీర్ అండ్ టీం ఇవాళ విశాఖపట్నంలో ల్యాండ్ అయింది. ఎయిర్ పోర్టు నుంచే రణ్ బీర్కు ఘనస్వాగతం పలికారు. సిటీలోకి ఎంటరైన తర్వాత అభిమానులు, ఫాలోవర్లు, సినీ లవర్స్ భారీ గజమాలను క్రేన్ సాయంతో ఓపెన్ టాప్ వెహికల్ లో ఉన్న రణ్ బీర్కు వేశారు. రణ్బీర్కపూర్ ని అక్కడున్న వారంతా తమ కెమెరాల్లో బంధించారు.
బ్రహ్మాస్త్ర ప్రాజెక్టు హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు.