బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగింది ప్రియాంకచోప్రా. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సొగసరి మహేష్బాబు-రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నాయికగా ఇండియన్ ఫిల్మ్స్లోకి కమ్బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు ‘క్రిష్-4’లో కూడా ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తున్నది. ఇదిలావుండగా పర్పుల్ పెబెల్ పిక్చర్స్ పేరుతో భర్త నిక్జోనస్తో కలిసి నిర్మాణ సంస్థను కొనసాగిస్తున్నది ప్రియాంక చోప్రా. ఇప్పటికే ఈ బ్యానర్పై పలు చిత్రాలను తెరకెక్కెంచింది.
తాజా ఇంటర్వ్యూలో తాను నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరించింది ప్రియాంకచోప్రా. బాలీవుడ్లో అడుగుపెట్టిన రెండేళ్లలోనే అక్కడి పరిస్థితులు మొత్తం తనకు అర్థమయ్యాయని, సినీ నేపథ్యం లేకుంటే ఎంత చులకనగా చూస్తారో తెలిసిందని చెప్పింది. ‘బాలీవుడ్లో వారసులదే హవా. బయటి వారు సక్సెస్ కావడం అంత సులభం కాదు. నేను ఎన్నో కష్టాలకోర్చుకొని అవకాశాలు సంపాదించా. నా ప్రయత్నాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చింది. నాలా కొత్తవారెవరూ కష్టపడొద్దనే ఉద్దేశ్యంలో నిర్మాణ సంస్థను స్థాపించాను. అందులో న్యూటాలెంట్ను ప్రోత్సహిస్తున్నా’ అని ప్రియాంకచోప్రా పేర్కొంది.