Prakash Raj | సినీ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేస్తుంటారు. సినిమాలతోనే కాకుండా రాజకీయ అంశాలపై సైతం స్పందిస్తూ వార్తల్లోనూ నిలుస్తుంటారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తనను అభ్యర్థిగా నిలబెట్టేందుకు మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయ పార్టీలు తన సిద్ధాంతాలతో తన వెనుకపడడం లేదని.. తాను ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం వెంటపడుతున్నాయన్న ఆయన.. తాను ఆ ఉచ్చులో పడకూడదని అనుకుంటున్నానన్నారు.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (KLF)లో ప్రకాశ్రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. మూడు పార్టీలు నా వెంటపడుతున్నాయి. ఆ ట్రాప్లో పడకూడదని ఫోన్ స్విచ్ఛాప్ చేశాను. ఆ పార్టీలు ప్రజల కోసమే.. నా భావజాలం కోసమే రావడం లేదు. నేడు రాజకీయ పార్టీలు తమ గొంతును కోల్పోయాయి. అందుకే అభ్యర్థులు దొరక్క చాలా ఇబ్బందులుపడుతున్నాయి’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘నేను ప్రధాని నరేంద్ర మోదీని ద్వేషించను. ఆయన నాకేమైనా మామనా.. లేదంటే ఏమైనా ఆస్తి సమస్య ఉందా? నేను పన్ను చెల్లింపుదారుడిని.
ఆయన పని చేస్తున్నందుకు వేతనం ఇస్తున్నాం. ప్రస్తుతం పని సక్రమంగా చేయడం లేదు. నేను సరిగా పని చేయమని చెబుతున్నాను’ అని స్పష్టం చేశారు. ట్విట్టర్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన పోస్టులపై ఆయన స్పందిస్తూ.. ‘నేను అందరి మనుసులో ఉన్న విషయంపైనే మాట్లాడున్నాను. నా వాయిస్ కాదు.. ప్రజల వాయిస్. ఇది నా ‘మన్ కీ బాత్’ కాదు.. మా ‘మన్ కీ బాత్’ అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
తాను ఆయనకు ఓటు వేయకున్నా.. ఇప్పటికీ తనకు మోదీయే ప్రధాని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని.. ఓటు వేయలేదని వారు చెప్పలేరన్నారు. తర్వాత ప్రధానిగా ఎవరు వచ్చినా తాను ఆయనను సైతం ప్రశ్నిస్తానన్నారు. తన ట్వీట్లలో మార్పులు చూస్తారన్నారు. ‘ప్రధాని మోదీ వెళ్లిపోతే ఆయన గురించి నేనుందుకు మాట్లాడుతాను’ అన్నారు.