వరంగల్ : కరోనా మహమ్మారి విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. కానీ ఆందోళన కలిగించే అంశాలు ప్రసారం చేసి ప్రజల బతుకులతో ఆటలాడుకోవద్దు అని సీఎం సూచించారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడారు. తనకు కరోనా వచ్చినప్పుడు రెండు ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకున్నాను. పారాసిటమాల్తో పాటు ఒక యాంటిబయోటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నా. డీ విటమిన్ వేసుకోమని చెప్పారు. కానీ అది తాను వేసుకోలేదు. అంతలోనే కరోనా తగ్గిపోయింది. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చు అని సీఎం అన్నారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించి, అనవసరంగా లేని ఉత్పాతాన్ని సృష్టించవద్దు అని సీఎం సూచించారు.