కరోనా మహమ్మారి మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఈ వైరస్ వలన సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ పరిశ్రమకు తాళం పడింది. కరోనా వలన రిలీజ్ కావలసిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో చిన్న హీరోల చిత్రాల నుండి పెద్ద హీరోల చిత్రాల వరకు ఉన్నాయి.
శేఖర్ కమ్మల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రాన్ని ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరెక్కించిన టక్ జగదీష్, రానా-సాయి పల్లవి కాంబినేషన్లో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం , చిరంజీవి- కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల తెరకెక్కించిన ఆచార్య, వెంకటేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందిన నారప్ప, మాస్ మహారాజా రవితేజ – ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో వస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ”ఖిలాడి, గోపీచంద్- తమన్నా నటించిన సీటీమార్, విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన పాగల్, యువ హీరో తేజా సజ్జా – ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన ఇష్క్ చిత్రాలు తాత్కాలిక వాయిదా పడ్డాయి.