సామాన్యుడి సొమ్ముతో సర్కారు సంస్థలు ఆటలాడితే… చట్టం ఊరుకోదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 స్పష్టం చేసింది. లే అవుట్ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పేరుతో ఫీజులు వసూలు చేసి, దరఖాస్తును తిరస్కరించిన తర్వాత కట్టిన ఫీజులు తిరిగి ఇవ్వకుండా తిప్పలు పెట్టిన హెచ్ఎండీఏపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. బాధితురాలు 13ఏళ్లుగా జరిపిన న్యాయ పోరాటాన్ని గుర్తించి, ఆమెకు న్యాయం చేయాలని తీర్పునిచ్చింది.
-సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ)
మల్కాజిగిరికి చెందిన ఎం మేఘన అనే మహిళకు కీసర మండలం నాగారం గ్రామంలో రెండు ప్లాట్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు 2013లో రూ. 79వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో మరోసారి నిబంధనల ప్రకారం రూ. 20, 500 చెల్లించారు. ఈ మొత్తం కలిపి రూ. 99,500లను ప్రభుత్వ ఖజానాకు కట్టారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం సదరు భూమి పారిశ్రామిక జోన్లో ఉందనే కారణంతో అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు.
డబ్బులడిగితే తప్పించుకున్నారు…
దరఖాస్తు తిరస్కరించినప్పుడు, తాను కట్టిన ఫీజును తిరిగి ఇవ్వాలని మేఘన హెచ్ఎండీఏ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫీజు వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదనీ అధికారులు మొండిగా వ్యవహరించారు. ఆమె చేసేదేం లేక 2021లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత, సేవలో లోపం ఉన్నట్లుగా గుర్తించిన కమిషన్ బాధితురాలికి న్యాయం జరిగేలా తీర్పునిచ్చింది.
వేలాది మందికి మార్గదర్శనం…
తాజా తీర్పుతో బాధితురాలు హెచ్ఎండీఏకు చెల్లించిన రూ 95 వేలతోపాటు, 13ఏళ్లుగా ఆమెను వేధించిన తీరుపై జరిమానాగా రూ. 10వేల అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ సాధ్యం కానప్పుడు, దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన ఫీజులను ప్రభుత్వ ఖజానాలో ఉండాల్సిన అవసరమే లేదని పేర్కొంది. వాటిని దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. జోనింగ్ సమస్యలు, మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల వలన వేలాది మంది దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఫీజులు చెల్లించినా ప్రోసీడింగ్స్ రావడం లేదు. రీఫండ్ చేయకుండా వేధించే అధికారుల ధోరణికి ఈ తీర్పు ద్వారా అడ్డుకట్ట పడుతుందనీ, న్యాయం ఆలస్యమైనా, సామాన్య వినియోగదారులు పడిన మానసిక వేదనకు ఈ తీర్పు పరిష్కారం అవుతుందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.