Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు కోర్టులో నిరాశ ఎదురైంది. అతడి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. దీంతో అతడు మరికొంత కాలం జైలులోనే ఉండక తప్పదు. రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. ముందుగా చెప్పిన సమయానికి డబ్బులు చెల్లించలేని కారణంగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అతడు జైలులో లొంగిపోయాడు.
దీంతో అతడి తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం విచారణ జరిగింది. జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. అయితే, ప్రతివాదులు అందుబాటులో లేని కారణంగా రాజ్పాల్ యాదవ్కు బెయిల్పై విచారణ వాయిదా వేసింది. అయినప్పటికీ వచ్చే సోమవారం.. అంటే ఫిబ్రవరి 16న బెయిల్పై తదుపరి విచారణ చేపడతామని హామీ ఇచ్చింది. దీంతో సోమవారం వరకు రాజ్పాల్ యాదవ్ జైలులో ఉండాల్సిందే. బెయిల్పై విచారణ జరుపుతున్న సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు కోర్టు ఆదేశాల ప్రకారం జైలుకు వెళ్లలేదని, కోర్టుకు తను ఇచ్చిన హామీని నెరవేర్చని కారణంగా జైలుకు వెళ్లాడని చెప్పింది.
మీరు కోర్టు చెప్పినందుకు డబ్బులు ఇవ్వడం లేదని, సెటిల్మెంట్కు ఒప్పుకొన్న కారణంగా డబ్బులు ఇస్తున్నారని రాజ్పాల్ యాదవ్కు గుర్తు చేసింది. డబ్బుల్ని నేరుగా సంబంధిత వ్యక్తులకు చెల్లించాలని ఆదేశించింది. కాగా.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్పాల్ యాదవ్కు సాయం అందించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్ వంటి పలువురు ప్రముఖులు అతడికి సాయం అందిస్తామని ప్రకటించారు.