పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడం ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన వైద్య సదుపాయాలు లేక ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. వైద్యం కోసం ప్రజలు భూములు, ఇల్లు, వాకిలి అమ్ముకుని మరింత నిరుపేదలుగా మారేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కెసిఆర్ ప్రజారోగ్యం మీద దృష్టి సారించి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించేందుకు పూనుకున్నారు. ఇదివరకే ఉన్న పథకాలను పటిష్టం చేస్తూనే కొత్త పథకాలను కూడా రూపొందించారు. దీంతో ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అని వలస పాలనలో పాడుకున్న పాటను.. తెలంగాణ స్వయంపాలనలో పోదాం పావె బిడ్డా.. సర్కారు దవాఖానకు అని జనం మార్చి పాడుకుంటున్నారు. మొన్నటిదాకా తొండలు గుడ్లు పెట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలన్నీ నేడు పురుడు పోసుకున్న తల్లుల నవ్వులతో, పసిపిల్లల కేరింతలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ వైద్యానికి జనాదరణ పెరుగుతుందనడానికి.. కార్పొరేట్ దవాఖానాల్లో గిరాకీ తగ్గి వెలవెలబోవడమే సాక్ష్యం.
ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో అగ్రస్థానం
తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలకు జాతీయ గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో ఆయా రాష్ర్టాల్లో వైద్య ఆరోగ్యసేవలు అందించడంలో నీతి ఆయోగ్ -2019 జనవరిలో రూపొందించిన నివేదికలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. వైద్య ఆరోగ్యరంగంలో వివిధ అంశాల ఆధారంగా 65 కి పైగా పాయింట్లు సాధించిన రాష్ర్టాలను అత్యుత్తమ సేవలందిస్తున్నవిగా గుర్తించారు. 92 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో, 77 పాయింట్లతో తమిళనాడు రెండోస్థానంలో ఉండగా.. 73 పాయింట్లతో తెలంగాణ మూడోస్థానంలో నిలిచాయి.
బడ్జెట్ లో అధికంగా నిధుల కేటాయింపు
ప్రజారోగ్య పరిరక్షణ కోసం పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం వైద్య & ఆరోగ్యశాఖకు 2020-21 బడ్జెట్లో రూ.6186 కోట్లను కేటాయించింది. 2014-15 లో 4062, 2015-16 లో 5024, 2016-17 లో 5992, 2017-18లో 5,976 కోట్లు, 2018-19 బడ్జెట్లో రూ.7,375.20 కోట్లు, 2019-20 (ఓట్ ఆన్ ఎకౌంట్) బడ్జెట్లో రూ.5,536 కోట్ల రూపాయలను కేటాయించారు.
మౌలిక వసతుల పెంపు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు వసతులు పెంచారు. వ్యాధి నిర్ధారణ పరీక్షా పరికరాలు , ఆపరేషన్ థియేటర్లన్నిటిని ఆధునీకరించారు. ఆసుపత్రుల రూపు రేఖలు మార్చడానికి కొత్త రంగులు వేసి, బెడ్స్, పరుపులు, బెడ్ షీట్స్, వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ వచ్చే నాటికీ రాష్ట్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రులలో 17,000 బెడ్స్ ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో 5,000 పడకలను, వసతులను పెంచింది. పాత ఆస్పత్రి భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు.
ఐసీయూ : క్లిష్టమైన పరిస్తితుల్లో ఉన్న రోగులకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం పది పడకలు కలిగిన 20 ఐసీయూలను ఏర్పాటు చేసింది. 25 జిల్లా, ఏరియా ఆసుపత్రులల్లో ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు అత్యవసర సేవలందిస్తున్నారు. ఒక్కో ఐసీయూను రూ. 1 కోటి 32 లక్షలతో ఏర్పాటు చేశారు.
ఎస్.ఎన్.సి.యూ (సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్) : పూర్వం ఉన్న 18 నుండి 42 వరకు పెంచి మరింత మెరుగైన సేవలను నవజాత శిశువులకు అందిస్తున్నారు. నాణ్యమైన సేవలందించడంలో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉన్నది.
మాటర్నల్ ఐసీయూ : మొట్ట మొదటిసారిగా గర్భిణీలకు ప్రత్యేకమైన ఐసీయూలను 5 చోట్ల ఏర్పాటు చేశారు.
మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు : మహిళలు ఎదుర్కొనే వ్యాధులపై వారికి అవగాహన కల్పించడంతోపాటు, నివారణ మార్గాలు సూచించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో తరచూ మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాధులపై వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించి, వ్యాధి ఉన్న వారికి వైద్యసేవలందిస్తున్నారు. మహిళలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్న కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాధుల బారినపడే వారి సంఖ్య తగ్గుతున్నది.
స్పెషాలిటీ ఐసీయూ : అన్ని వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో స్పెషాలిటీ ఐసీయూ – గుండె , మూత్రపిండాల , కాలేయ , మెదడు, అవయవ మార్పిడి ICU లను ఏర్పాటు చేశారు.
ట్రామా కేర్ యూనిట్లు : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రామా కేర్ ను అభివృద్ధి చేస్తున్నారు.
డయాలసిస్ సెంటర్లు : కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం పెద్దఎత్తున ఉపశమన చర్యలు తీసుకున్నది. 43 డయాలసిస్ కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా 10వేల మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. స్టాప్ కిడ్నీ అటాక్.. నినాదంతో జిల్లాస్థాయి, ఏరియా దవాఖానలతోపాటు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిల్లోనూ పేద రోగులకు కిడ్నీ డయాలసిస్ విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలన్న సంకల్పంతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయిల్లోనే సెమీ ఆటో అనలైజర్, ఆల్ట్రాసౌండ్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. పీహెచ్సీల పరిధిలోని సబ్సెంటర్లలో బీపీ, షుగర్, యూరిన్ పరీక్షలు చేసేందుకు పరికరాలను ఏర్పాటుచేశారు. నిత్యం 5,000 మందికి సింగిల్ యూజ్డ్ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లలో 2వేల మందిపైగా డయాలసిస్ చేయించుకొంటుండగా ప్రభుత్వం డబ్బులు చెలిస్తున్నది. ఒక్కో డయాలసిస్ కేంద్రంలో 5 యూనిట్లు ప్రస్తుతం ఉండగా.. పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టకొని అదనంగా యూనిట్లు ఏర్పాటుచేస్తూ డయాలసిస్ సేవలను విస్తృతం చేస్తున్నారు. తరచూ డయాలిసిస్ కోసం వస్తున్న వ్యాధిగ్రస్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. డయాలసిస్ సేవలు పొందేవారితో పాటు వారి సహాయకుడికి కూడా భోజన వసతి కల్పిస్తున్నారు.
బ్లడ్ బ్యాంకులు : రాష్ట్రవ్యాప్తంగా 19 పాత బ్లడ్ బ్యాంకులుండగా, కొత్తగా మరో 13 ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది గర్భిణులు, క్షతగాత్రుల ప్రాణాలు కాపాడే అవకాశం ఏర్పడింది.
రోగ నిర్ధారణ కేంద్రాలు ( డయాగ్నోస్టిక్ హబ్) : వివిధ వ్యాధుల నిర్ధారణకు రూ.వేలల్లో ఖర్చుపెట్టలేని పేదల కోసం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వ్యాధినిర్ధారణ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకొంటున్నది. నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో మోడల్ హబ్ను ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ హబ్లో రక్త, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరు పరీక్షలు, కొలెస్ట్రాల్, షుగర్ వంటివాటితోపాటు మొత్తం 58 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. అధునాతనమైన యంత్ర పరికరాలతో రోగులు వచ్చిన రోజే పరీక్షలు జరిపి రిపోర్ట్ అందచేసే నూతన విధానానికి రూపకల్పన చేశారు. తొలిసారి ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు.
అవయవ మార్పిడికి ప్రత్యేక కేంద్రాలు : ఆస్పత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచి, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల కిడ్నీ, గుండె , కాలేయ వంటి అవయవ మార్పిడిలు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీవన్ దాన్ ద్వారా ఉచితంగా జరపబడుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో లివర్ మార్పిడికి , ఎం.ఎన్.జే. ఆసుపత్రిలో మూలగ మార్పిడికి, నిమ్స్ లో మూల కణాల చికిత్స కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అవయవ మార్పిడి చికిత్సకు 15 లక్షల వరకు సాయం : గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు రూ.2 లక్షల వరకు మాత్రమే ఖర్చుచేయగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు సాయం అందిస్తున్నది. ప్రైవేటు దవాఖానల్లో అవయవ మార్పిడి చేయించుకున్నవారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు.
పాలిటివ్ కేర్ సెంటర్లు : ఇప్పటికి 8 సెంటర్లు ఉన్నాయి. అన్నిజిల్లాలకు దశలవారీగా విస్తరించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వయోవృద్ధులకు ప్రత్యేక కేంద్రాలు : అన్ని జిల్లా ఆసుపత్రుల్లో వారానికి ఒకరోజు ప్రత్యేకంగా వయోవృద్ధులకు వైద్యసేవలందిస్తున్నారు. అందులో అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలను అందజేస్తున్నారు. మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే సమీపంలోని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు కోటి మందికి పైగా వృద్ధులు ఉంటారు.
మానసిక ఆరోగ్య సేవ కేంద్రాలు : అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య సేవలను దశల వారీగా అందిస్తున్నారు.
సంతాన సాఫల్య కేంద్రాలు : కొత్తగా పెళ్ళైన దంపతులలో 15% సంతాన లేమి కలిగే అవకాశం ఉంటుంది. సంతాన సాఫల్యం కొరకు ప్రైవేట్ ఆసుపత్రులపైనే పైనే ఆధార పడడం వల్ల పేద కుటుంబాలపై ఆర్ధిక భారం పడుతున్నది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించి పేద దంపతులకు అండగా ఉంటున్నది.
ఐసొలేషన్ వార్డులు : ఆసుపత్రుల్లో వైరల్ జ్వరాల నివారణ కొరకు ప్రత్యేక వార్డులను చేశారు. కోరంటి దవాఖానలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేశారు. దీంతో ఎటువంటి ప్రమాదకరమైన అంటువ్యాధులనైనా ( స్వైన్ ఫ్లూ , కరోనా లాంటివి ) ఎదుర్కోవచ్చు.
ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా 300 టీములతో 44.89 లక్షల మంది నవజాత (ముందుగానే జన్మించిన) శిశువులకు చికిత్స అందించారు.
నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి
నిమ్స్ ఆస్పత్రిలో అదనంగా 500 పడకలను ఏర్పాటు చేశారు. ఐసీయూ, డయాలసిస్ వార్డుల్లో కూడా పడకలు పెంచారు. 70 కోట్లతో అధునాతన పరికరాలైన- PET , MRI, CT , Cath lab, షూట్ సిస్టంలను ఏర్పాటు చేశారు. పీజీ వైద్య సీట్లను పెంచారు.
MNJ కాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి
MNJ ఆసుపత్రిని రూ.120 కోట్లతో రీజినల్ కాన్సర్ సెంటర్ (RCC) గా అభివృద్ధి చేశారు. 250 పడకల ఆసుపత్రి నుండి 450 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశారు. ఆసుపత్రి విస్తరణకు అవసరమైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. PET, CT, లినియర్ ఆక్సిలేటర్ లాంటి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. కొత్తగా పీజీ సీట్ల అనుమతికి ప్రతిపాదనలు పంపారు.
ఆసుపత్రి నిర్వహణ సేవలు : ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడానికి, రోగులకు అన్ని సేవందించడానికి ఆసుపత్రిలో ఒక్కో పడకకు రూ. 5000 చొప్పున బడ్జెట్ కేటాయించారు.
మందులకు, పరికరాలకు, నిర్వహణకు నిర్దిష్ట ఖరీదు : ఆసుపత్రులకు అవసరమైన మందులకు, పరికరాలకు, ఆసుపత్రి నిర్వహణ సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచి నిర్దిష్ట ఖరీదు నిర్ణయించారు. దీంతో మళ్ళీ టెండర్లు పిలవకుండానే త్వరగా కావాల్సిన మందులు, పరికరాల కొనుగోలుకు వీలవుతుంది. మందుల కొనుగోలుతోపాటు ఆసుపత్రి నిర్వహణ బాధ్యతల్ని కూడా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకే అప్పగించేలా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. శస్త్రచికిత్సలకు సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1179 కోట్లు ఖర్చు చేసింది. సమైఖ్య పాలనలలో మందుల కొనుగోలుకు రూ.146 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రతీ ఏటా రూ.440 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆస్పత్రుల కోసం ఎమ్మారై, సీటీ స్కాన్, డిజిటల్ రేడియాలజీ, టూడీ ఎకో, అల్ట్రా సౌండ్, ఆటో అనలైజర్ వంటి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ సూచనల మేరకు ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఉండాల్సిన అన్ని పరికరాలను కొనుగోలు చేసింది. దేశంలోనే తొలిసారిగా వ్యాధి నిర్ధారణ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించింది.
ఆసుపత్రి పరికరాల నిర్వహణ : ఆసుపత్రులలో ఉన్న అన్ని పరికరాలను పనిచేసే స్థితిలో ఉంచడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య పరికరాలను బట్టి టెండర్ విధానం ద్వారా ఒక సంస్థను AMC /CMC కొరకు ఎంపిక చేసి సేవలందిస్తున్నారు.
సిబ్బంది నియామకం : నాణ్యమైన వైద్య సేవలందించడానికి నిపుణులైన వైద్య సిబ్బంది అవసరం. వైద్య కళాశాలలకు MCI నిబంధనల ప్రకారంగా సిబ్బందిని నియమించి కొత్తగా 4 వైద్య కళాశాలలకు అనుమతి సాధించి తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 5 వైద్య కళాశాలల్లో కూడా MCI అనుమతితో యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచారు. దవాఖానల అవసరాన్ని బట్టి తాత్కాలిక పద్ధతిన నియామకాలు. న్యూ ప్రొక్యూర్మెంట్ పాలిసీ, హెచ్ఆర్ పాలిసీ అమలు.
డాక్టర్ల నియామకం : దేశంలోనే తొలిసారిగా 108 వైద్యవిధాన పరిషత్ (వీవీపీ) ఆసుపత్రులలో IPHS ప్రకారంగా 4,365 మంది డాక్టర్లను, సిబ్బందిని నియమించారు. దీంతో జిల్లా, తాలూకా స్థాయి ఆసుపత్రుల్లో కూడా స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల సేవలు అందుతున్నాయి.
వైద్య విద్య అభివృద్ధి
తెలంగాణలో గతంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, వాటిని 9కి పెంచింది. తెలంగాణ ఏర్పడక ముందు ప్రభుత్వపరంగా వైద్య కళాశాలల్లో 850 MBBS సీట్లు ఉండేవి. అవి ఇప్పుడు 1640 వరకు పెరిగాయి. అలాగే, పీజీ వైద్య సీట్లు కూడా 2014లో 531 మాత్రమే ఉంటే, 2020లో 835 సీట్ల వరకు పెరిగాయి. వైద్య కళాశాలల్లో సౌకర్యాలు పెంచడం వల్ల ఇది సాధ్యమైంది. అలాగే, సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా 58 నుంచి 86 వరకు పెరిగాయి. వైద్య విధాన పరిషత్ కు చెందిన జిల్లా ఆసుపత్రుల్లో కూడా 43 సీట్లు పెరిగాయి. కొత్తగా ట్రాపికల్ మెడిసిన్, మెడికల్ అంకాలజీ, డీ.ఎన్.బి కోర్సులను ప్రారంభించడానికి ప్రతిపాదనలు కూడా పంపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 7 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
MERIT ( Medical Education and Research in Telangana) : వైద్యకళాశాలలో శాస్త్రీయ ధృక్పథాన్ని ప్రోత్సహించడానికి మెరిట్ పథకం ద్వారా వైద్య విద్యార్థుల, అధ్యాపకుల పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారు.
వాహన సేవల పెంపు
108 వాహనాలు : ఉమ్మడి రాష్ట్రంలో లక్ష జనాభాకు ఒక 108 వాహనం ఉంటే తెలంగాణ ఏర్పడ్డాక 75 వేల జనాభాకు ఒక వాహనం చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో 15 నిమిషాలలోనే వాహనసేవను అందిస్తున్నారు. పాతబడిన 290 వాహనాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేశారు. 108 సేవలకు గాను 2020-21 బడ్జెట్లో రూ.49 కోట్లు కేటాయించారు.
102 వాహనాలు : గ్రామాలు, ఏజెన్సీల నుంచి ఆసుపత్రులకు ప్రసూతికి, మందులకు, ఇతర సేవలకు వెళ్లడానికి 102 వాహనాలు మొత్తం 241 ఏర్పాటు చేశారు. 102 వాహనాల సేవలకు 2020-21 బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించారు.
పరమ పద వాహనాలు : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా, గాంధీ తదితర దవాఖానల్లోని మార్చురీల వద్ద శవాలను తరలించే వాహనాల వారు, దళారులు అడ్డగోలు కిరాయిలతో బాధిత కుటుంబాలను దోచుకునే వారు. ఓవైపు పుట్టెడు దుఖం, కడసారి చూపుకోసం ఇంటివద్ద ఎదురుచూసే కుటుంబ సభ్యులు, ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగానే వుండడం.. ఆ పరిస్థితులనే ఈ దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకునేవారు. వీరి బాధలను అర్ధం చేసుకున్న ప్రభుత్వం దవాఖానల్లోని మార్చురీల్లో పోస్టుమార్టం చేసిన మృతదేహాలను వారి ఇళ్ల వద్దకు ఉచితంగా చేర్చడానికి.. పార్థివ దేహాల అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మృతదేహాల తరలింపు వాహనాల కొనుగోలుకు రూ.10.25 కోట్లను 2017-18 బడ్జెట్లో కేటాయించారు. మార్చురీ నుంచే కాకుండా అనారోగ్యంతో వార్డుల్లో మృతి చెందిన వారి శవాలను సైతం వారి ఇంటివద్దకు చేర్చుతారు. ఈ మేరకు 2016 నవంబర్ 18 గాంధీ దవాఖానలో ప్రభుత్వం ఈ వాహనాలను ప్రారంభించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 వాహనాలను, ఫ్రీజర్ వసతితో ఏర్పాటు చేశారు. 2020 జనవరి వరకు 24 వేల పార్థివ దేహాలను మృతుల ఇళ్లకు చేర్చారు.
బైక్ అంబులెన్సులు : మొత్తం 50 బైక్ లు ఏర్పాటు చేశారు. ఇవి గిరిజన ప్రాంతాల ప్రజలకు, పట్టణాల్లోని బస్తీల ప్రజలకు వైద్య సేవలందజేస్తున్నాయి. 50 టీకా బండ్లను బస్తీల్లో తిప్పుతూ పేదపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ వాహనాలు : ఆహార పదార్థాల కల్తీని కనుక్కోవడానికి, నాణ్యత ప్రమాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫుడ్ సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేశారు.
పాలియేటివ్ కేర్ వాహనాల ద్వారా వైద్య సేవలు:
గ్రామీణప్రాంతాల్లో క్యాన్సర్, కిడ్నీ, హృదయ, శ్వాసకోశ వ్యాధులు, ప్రమాదాల్లో చేతులు, కాళ్లు కోల్పోవడం, వయో సంబంధ వ్యాధులతో ఇండ్ల నుంచి కదలలేని స్థితిలో ఉన్నవారి పరిస్థితి చెప్పనలవికాదు. అలాంటివారికి సేవలందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలియేటివ్ కేర్ (ఆలన) వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది వాహనాల ద్వారా తొమ్మిది జిల్లాలోని 1,033 గ్రామాల్లో 2020 మే వరకు 20వేల మందికి సేవలు అందించింది. గ్రామీణప్రాంతాల్లో తీవ్ర అనారోగ్యంతో మంచంపట్టి ఇండ్లకే పరిమితమైనవారిని ఆశాకార్యకర్తలు గుర్తిస్తారు. పాలియేటివ్ కేర్ వాహనంలో ఉండే వైద్యు డు, నర్సు, నర్సింగ్ సిబ్బంది, ఆశా కార్యకర్త లు ఇండ్లకే వెళ్లి వైద్య సేవలందిస్తారు. పాలియేటివ్కేర్ (ఆత్మీయ చికిత్స)కు మంచి స్పందన వస్తుండటంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మరో 17 జిల్లాల్లో వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, గద్వాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నాగర్కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో పాలియేటివ్కేర్ సేవలందిస్తున్నారు. చేవెళ్ల, మహబూబ్నగర్లలో ఆత్మీయ చికిత్సకేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, డేకేర్, హోమ్ కేర్ వంటి సేవలను అందిస్తున్నారు.
ఆరోగ్య పథకాలు – ఏటా రూ. 2 వేల కోట్ల ఖర్చుతో కోటి మందికి వైద్య సేవలు
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల వైద్యానికి ఏటా సుమారుగా 2 వేల కొట్లను ఖర్చు చేస్తున్నది. ఈ డబ్బును వివిధ ఆరోగ్య పథకాల ద్వారా ఖర్చు చేస్తున్నది. నిరుపేదలు ఏదేని ప్రైవేట్ కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్నప్పటికీ ప్రభుత్వం వారికి సిఎం రిలీఫ్ ఫండ్ కింద గరిష్టంగా రూ.12 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యభద్రత, ఆర్టీసీ, సింగరేణి వంటి ఆరోగ్య సంరక్షణ పథకాలతోపాటు మిగిలిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉచితంగా వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవల ద్వారా ఏటా కోటి మందికిపైగా ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. 2020-21 లో ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం రూ.699.44 కోట్లు కేటాయించింది.
ఆరోగ్య పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారులు – ఖర్చు వివరాలు
పథకం పేరు | లబ్ధిదారులు (లక్షల్లో) | నిర్వహణ సంస్థ | ఖర్చు (కోట్లలో) |
ఆరోగ్యశ్రీ | 77.19 | ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ | 800 |
ఈహెచ్ఎస్ | 5.75 | ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ | 500 |
జేహెచ్ఎస్ | 0.25 | ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ | 20 |
టిఎస్ఆర్టీసీ | 0.75 | ఆర్టీసీ | 75 |
సింగరేణి | 0.60 | ఎస్సీసీఎల్ | 75 |
ఆరోగ్య భద్రత | 0.50 | ఏబీ | 50 |
ఇతర సేవలు | – | – | 570 |
మొత్తం | 85.04 | – | 2090 |
కొత్త పథకాలు
కెసిఆర్ కిట్ పథకం : ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు 96% చేరుకొన్నాయి. ( 30% నుండి 50% వరకు పెరిగాయి). సహజ ప్రసవాలు (65%) పెరిగి సిజేరియన్ ఆపరేషన్లు (45%) తగ్గాయి. శిశు మరణాల సంఖ్య ప్రతి వెయ్యి మందిలో 39 ఉండేది. అది 29 వరకు తగ్గింది. మాతా మరణాల సంఖ్య లక్ష మందిలో 92 ఉండగా 76 వరకు తగ్గించగలిగారు.2024 నాటికి కొత్త హెచ్.ఐ.వి. కేసులను 80శాతం వరకు తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
కేసీఆర్ కిట్స్ లబ్ధిదారులు : (2021 మే 31 నాటికి)
మొత్తం లబ్ధిదారులు : 12,14,429
వారికి అందజేసిన మొత్తం : రూ.1019.88 కోట్లు
ఇచ్చిన కిట్స్ : 9,08,988
కిట్స్ కోసం ఖర్చు చేసినది : 185.68 కోట్లు
కంటి వెలుగు : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 1.54 కోట్ల మందికి అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించారు. 41.06 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారు. 9.30 లక్షల మందిని గుర్తించి, మెరుగైన వైద్య సేవల కోసం సిఫారసు చేశారు. మరో 1.04 లక్షల మందిని కంటి సమస్యలు లేనివారిగా గుర్తించారు.
డయాగ్నస్టిక్ పథకం : తెలంగాణ డయాగ్నస్టిక్ (వ్యాధి నిర్ధారణ పరీక్షల) పథకం అమలు చేస్తూ, వాటికి అవసరమైన పరికరాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. మరింత పటిష్టంగా అభివృద్ధి చేయడానికి 17 CDC (Central DIagnostic Centers)లను HUB కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
బస్తీ దవాఖానాలు : ప్రాథమిక వైద్యశాలలు కూడా అందుబాటులో లేని నిరుపేదలు నివసించే మురికివాడల్లో ప్రభుత్వం 350 బస్తీ దవాఖానాలను (అర్బన్ హెల్త్ క్లీనిక్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 6, 2018లో 17 బస్తీ దవాఖానాలతో వీటిని ప్రారంభించారు. 2020 సెప్టెంబర్ నాటికి జీహెచ్ఎంసీ పరిథిలో వీటి సంఖ్యను 197 కి పెంచింది. ప్రతీ 5 వేల నుంచి 10 వేల మద్య జనాభా కలిగిన బస్తీలో ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దవాఖానాలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తో పాటు ఒక స్టాఫ్ నర్సు, ఒక మెయింటెన్స్ వర్కర్ సేవలందిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేసే ఈ బస్తీ దవాఖానాల్లో లక్షలాది మందికి ఓపీ సేవలు, 135 రకాల వైద్య సేవలందిస్తూ, అన్నిరకాల టీకాలతోపాటు, 145 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారు. సమస్య పెద్దదైతే ఏరియా దవాఖాన, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ వంటి దవాఖానలకు సిఫారసు చేస్తున్నారు.
ఉచిత మందుల బడ్జెట్ మూడింతలు పంపు : బస్తీ దవాఖానాల్లో రోగులకు ఉచితంగా మందులు అందించేందుకు గతంలో రూ.114 కోట్లున్న మందుల బడ్జెట్ మూడింతలు పెంచారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఒకేసారి సరఫరా చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు
ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలు : ఆరోగ్యశ్రీ ద్వారా అందించే శస్త్ర చికిత్సలలో కొన్ని వ్యాధులను అదనంగా చేర్చారు. ట్రాన్స్ ప్లాంటేషన్, సర్జరీలకు సంబంధించి కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. కిడ్నీ, లివర్, గుండె మార్పిడి లను ప్రభుత్వ దవాఖానాల్లో ప్రభుత్వ దరకే చేస్తుండడంతో రోగుల సంఖ్య పెరిగింది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 20% చికిత్సలు మాత్రమే జరిగేవి. మరిన్ని చికిత్సల్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం, ఆస్పత్రుల్లో వసతులు కల్పించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులో రోగుల సంఖ్య 20% నుంచి 40% వరకు పెరిగాయి.
ఉచిత అవయమార్పిడి, మందులు : కిడ్నీ, లివర్ , గుండె , మూలగ వంటి అవయవ మార్పిడులు జరిగాక జీవితాంతం వాళ్లకు మందులు ఇవ్వడంతోపాటు, పరీక్షలు కూడా ఉచితంగానే చేస్తున్నారు.
కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ మిన్న : ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏడేండ్లలో రూ.3,227.57 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం కింద 77.19 లక్షల కుటుంబాలకు సేవలందించారు. 2014 నుంచి 16.88 లక్షల సర్జరీలు జరిగాయి. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏడాదికి 1,336 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి 250 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు.
ఆయుష్ ఆస్పత్రుల అభివృద్ధి : ఉమ్మడి రాష్ట్రంలో ఆయుష్ ఆస్పత్రులను పట్టించుకునే వారు కాదు, కానీ, తెలంగాణ ఏర్పాటయ్యాక ఆయుష్ విభాగానికి ప్రాధాన్యతనిచ్చి 183 ఆయుష్ డాక్టర్ల పోస్టులను భర్తీ చేశారు. మందుల తయారీ, సరఫరాలోనూ ఆయుష్ దేశంలోనే ముందున్నది.
ఆర్థిక సంవత్సరం | ఆపరేషన్లు | నిధులు |
2014-15 | 2,35,949 | 622,15,93,014 |
2015-16 | 2,60,531 | 684,66,04,728 |
2016-17 | 2,76,937 | 713,95,74,434 |
2017-18 | 3,09,821 | 774,81,55,168 |
2018-19 | 2,15,708 | 431,98,24,081 |
ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) : ఉద్యోగులకు, జర్నలిస్టులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా నగదు రహిత సేవలను ప్రారంభించారు. EJHS కింద 2014 నుంచి 2020 జనవరి వరకు 6.33 లక్షల సర్జరీలు చేశారు. ఔట్ పేషంట్ సేవల కోసం 12 వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఆరోగ్య సూచికల్లో గణనీయమైన ప్రగతి
ఒకవైపు పక్కా ప్రణాళికతో బడ్జెట్ కేటాయిస్తూ, మరోవైపు సదుపాయాలు పెంచుతుండటంతో ఆరోగ్య సూచికలలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించింది.
30 పడకల దవాఖానాలు : నలుగురు డాక్టర్లతో మండలస్థాయిలో 30 పడకల దవాఖాన, 125 సీహెచ్సీల్లో 24 గంటల సేవలు.
100 పడకల దవాఖానాలు : పలు నియోజకవర్గ కేంద్రాల్లో వంద పడకల ఏరియా దవాఖానలు, 50 వరకు పీహెచ్సీలు, సీహెచ్సీలు అప్గ్రేడ్.
150 పడకల మాతా, శిశు ఆరోగ్య బ్లాకులు : రాష్ట్రంలో 150 పడకల మాతా, శిశు ఆరోగ్య బ్లాకులు పాత 9 జిల్లాలలో నిర్వహణలో వున్నాయి. కొత్తగా ఏర్పడ్డ మిగతా జిల్లాలన్నింటిలో కూడా మరిన్ని బ్లాకులు ఏర్పాటు చేయనున్నారు.
రోజుకో రంగు బెడ్ షీట్లు : హాస్పిటల్ బెడ్లపైన రోజుకొక రంగు బెడ్ షీట్లు వేస్తున్నారు.
కొత్త పరుపులు : రాష్ట్రంలోని మొత్తం 42 ఏరియా ఆసుపత్రులకు కొత్తగా పరుపులు,
బెడ్ షీట్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేశారు.
క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు : రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే పసిగట్టి, సరైన వైద్యం అందించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతున్నారు.
మందుపూత దోమ తెరల పంపిణీ : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ ముప్పు ఉన్న పల్లెల్లో మందుపూత దోమ తెరలను పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక నుంచి ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని5 ఆగస్టు, 2019న ప్రారంభించింది. దీన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఉచితంగా అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తల్లీ బిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించే కేసీఆర్ కిట్ అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన రూ. 15 వేల విలువైన ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని 2 జూన్, 2017న హైదరాబాద్ పేట్లబుర్జు ప్రసూతి దవాఖానలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం జీ.ఓ.నెం.26ను 1 ఏప్రిల్, 2017న విడుదల చేశారు.
ఈ పథకానికి రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి. ఒకటి… గర్భం దాల్చిన మహిళలు కూలీ పనికి పోకుండా ఇంటి పట్టునే ఉండి ఆరోగ్యం రక్షించుకోవడం. రెండోది.. ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక భారం మోయకుండా ఉండడం. మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటున్నది. పుట్టే శిశువు కూడ ఆరోగ్యంగా ఉండడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ద్వారా గర్భిణులు కూలీ పనులకు వెళ్లలేక కోల్పోయె ఆదాయాన్ని అందిస్తున్నది. వీరికి మూడు విడతలుగా మొత్తం రూ. 12 వేలు అందుతాయి. వారు ఆడపిల్లకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరగాలని, బాలింత మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండాలని, భ్రూణ హత్యలు నిరోధింపబడాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. మూడో సంతానానికి, ఆ పైన జరిగే ప్రసవాలకు ఈ పథకం వర్తించదనే నిబంధన పెట్టడం వల్ల కుటుంబ నియంత్రణ కూడా సాధ్యమవుతున్నది. 2020-21 బడ్జెట్లో ఈ పథకానికి రూ.443 కోట్లు కేటాయించారు.
మొదటి విడత నగదు: పరన భుత్వాసుపత్రిలో గర్భిణీగా పేరు నమోదు చేయించుకుని కనీసం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత రూ. 3 వేలు అందజేస్తారు.
రెండో విడత నగదు: ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన తరువాత ఆడబిడ్డ పుడితే రూ.5వేలు, మగ బిడ్డ పుడితే రూ. 4వేలు అందజేస్తారు.
మూడో విడత నగదు: బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇవ్వవలసిన టీకాలు తీసుకున్న తరువాత రూ.3 వేలు అందిస్తారు.
నాలుగో విడత నగదు: బిడ్డ పుట్టినప్పటి నుంచి 10 నెలల కాలంలో ఇవ్వవలసిన టీకాలు తీసుకున్న తరువాత రూ. 2 వేలు ఇస్తారు. ఈ నాలుగు విడతలుగా ఇచ్చే మొత్తం నగదు బిడ్డ తల్లి పేరుపై ఉన్న బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయి. ప్రసవానంతరం తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో, వారిద్దరి సంరక్షణకు ఉపయోగపడేలా రూ. 2,150 విలువైన 16 వస్తువుల మదర్, బేబీ కిట్ ను ప్రభుత్వం అందజేస్తుంది.
కేసీఆర్ కిట్ లో ఉండే వస్తువులు : బేబీ బెడ్, దోమతెర (రూ.350), మస్కిటో కాయిల్స్ (రూ.90), డ్రెస్సులు రెండు (రూ.200), టవల్స్ రెండు (రూ.100), బేబీ నాప్కిన్స్ 6 (రూ.100), జాన్సన్ బేబీ పౌడర్ 200 గ్రాములు (రూ.120), షాంపూ 100 గ్రాములు (రూ.85), బేబీ ఆయిల్ 200 మిల్లీలీటర్లు (రూ.200), బేబీ సబ్బులు 2 (రూ.90), బేబీ సబ్బు బాక్సు (రూ.25), బేబీ ఆట వస్తువు (రూ.50), మదర్ బస్సు (రూ.40), చీరలు రెండు (రూ.350), కిట్ బ్యాగ్ (రూ.150), ప్లాస్టిక్ బాస్కెట్ (రూ.50).
అమ్మఒడి వాహనంలో ఇంటికి: దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యే మాతా, శిశువులను అమ్మ ఒడి (102 వాహనం) వాహనంలో ఇంటికి తీసుకెళ్తారు. రవాణా ఖర్చే ఒక్కొక్కరికి రూ. 1,000-1,500 వరకు ఉంటుంది. ఈ సౌకర్యం కోసం 24×7 కాల్ సెంటర్ (102) ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కల్పన
మిడ్ వైఫ్ కోర్సు – శిక్షణ
దేశంలో మొదటిసారిగా మిడ్ వైఫ్ కోర్సు ప్రవేశ పెట్టారు. నర్సులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణనిచ్చి, మారుమూల ప్రాంతాల్లో గర్భిణులకు సహకారం, వైద్యం అందిస్తారు. ఇందుకోసం 125 మందిని ఎంపిక చేశారు. రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ నిపుణులతో వీరికి శిక్షణనిప్పిస్తున్నారు. సురక్షిత ప్రసవాలపై జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలోని అందరు డాక్టర్లు, నర్సులకు ఈ శిక్షణ ఇస్తున్నారు.
2020 జనవరి వరకు కేసీఆర్ కిట్స్ లబ్ధిదారులు
2017 జూన్ 2న కేసీఆర్ కిట్స్ పథకం ప్రారంభమైన నాటినుంచి జనవరి, 2020 నాటికి సర్కారు దవాఖానాల్లో 6,86,975 ప్రసవాలు జరిగాయి. వీరిలో 6 లక్షల మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. ఈ పథకం కింద మొత్తం 14,95,476 మంది లబ్ధిపొందారు. ప్రభుత్వం రూ.620.49 కోట్ల నగదును లబ్ధిదారులకు అందించింది.
కేసీఆర్ కిట్ పథకానికి వచ్చిన అవార్డులు, ప్రశంసలు
గర్భిణులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లాలన్నా, ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లాలన్నా అనేక కష్ట నష్టాలకు గురికావాల్సి వస్తోంది. దీంతో గర్భిణులు, ప్రసవం తర్వాత తల్లీ పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు సరిగా లేక బస్సుల్లో ప్రయాణం వారికి ఇబ్బందిగా మారుతోంది. కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యమూ లేని దుస్థితి నెలకొంది. ఇది గమనించిన ప్రభుత్వం గ్రామీణ, మారుమూల ప్రాంతాల గర్భిణులను ప్రసవ సమయానికి ముందు దవాఖానకు చేర్చడం, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను కూడా సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘అమ్మఒడి’ పథకం పేరుతో ఈ వాహనాలను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 28, 2016న మొదటి విడతగా 41 వాహనాలను ప్రవేశ పెట్టారు. 17 జనవరి, 2018న మరో 159 అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో 6 నుంచి 8 వాహనాలు సేవలు అందిస్తాయి. ప్రతీ వాహనం రోజుకు కనిష్టంగా 4 దఫాలుగా సేవలు అందిస్తున్నాయి. ఒక్కో వాహనానికి నెలకు రు. లక్ష చొప్పున మొత్తం వాహనాలకు కలిపి ఏటారూ. 241 లక్షలు ఖర్చు అవుతోంది. ‘102’ కు ఫోన్ చేస్తే ప్రత్యేక సదుపాయాలున్న వాహనం వచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఈ వాహనాలు జీపీఎస్ సిస్టం, పది సీట్ల సామర్థ్యంతో సేవలందిస్తున్నాయి. కూర్చోవడానికి, నీరసంగా ఉంటే పడుకోవడానికి వీలుగా ఈ వాహనాలను రూపొందించారు. గర్భిణులు ప్రతి మూడు నెలలకోసారి చెకప్ల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా ఈ ఉచిత వాహన సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. పథకం ప్రారంభం నుండి నెల రోజుల్లో ఈ వాహనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది గర్భిణులకు లబ్ధి చేకూరింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ సహకారంతో అమ్మఒడి వాహనాలు గర్భిణులకు సేవలు అందిస్తున్నాయి. జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 102 వాహనసేవలను అందిస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వేగంగా పలు సంస్కరణలు తీసుకువచ్చింది. వృద్దుల కోసం, మహిళల కోసం వైద్య శిభిరాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. చిన్నారుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూనే.. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్యేశంతో చిన్నారుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శిశువుల సంరక్షణ కోసం కార్పొరేట్ తరహాలో అధునాతన సౌకర్యాలతో వైద్యం అందిస్తున్నారు. జిల్లా దవాఖానాల్లో నవజాతి శిశువుల సంరక్షణకు ప్రత్యేక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నీలోఫర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. గతంలో తెలంగాణలో కేవలం 22 మాత్రమే న్యూ బార్న్ కేర్ సెంటర్లు ఉండేవి. వాటి సంఖ్యను 42 వరకు పెంచాలని నిర్ణయించింది. కొత్తగా 6 ఏర్పాటు చేశారు. మరో 14 ఏర్పాటు కానున్నాయి. 61 ఎన్.బి.ఎస్.యు, 562 ఎన్.బి.సీసీలను ఏర్పాటు చేశారు. ఎస్.ఎన్.సీ.యూల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎఫ్.బి.ఎన్.సి. శిక్షణ అందించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిన్నారులకు వైద్యం, వసతులు కల్పించారు. 9 దవాఖానాల్లో శిశు సంరక్షణ వైద్యశాలలు నవజాత శిశువులను కాపాడేందుకు ఆయా దవాఖానాల్లో మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్) ప్రత్యేక విభాగాలపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. సర్కారు దవాఖానాల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వసతుల కల్పనతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 9 దవాఖానల్లో ఎంసీహెచ్ విభాగాలను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలకు ప్రభుత్వం ఏటా రూ.93.15 లక్షలు ఖర్చుచేయనున్నది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 పడకల స్థాయిలో 10 మాతాశిశు వైద్యశాలల్ని నెలకొల్పి నవజాత శిశువులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
బలహీన శిశువులకు వార్మ్ బ్లాంకెట్ : హైదరాబాద్ బాచుపల్లిలోని పరిశోధన టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘ఎయిర్ యాక్టివేటెడ్ ఇన్స్టాంట్ వార్మ్ బ్లాంకెట్’ త్వరలో మార్కెట్లోకి రానున్నది. నెలలు నిండకముందు పుట్టిన, లేదా బలహీనంగా ఉన్న నవజాత శిశువును మారుమూల పల్లెప్రాంతాల నుంచి సురక్షితంగా వెచ్చని బ్లాంకెట్లో దవాఖానలకు తీసుకురావడానికి వీలుగా దీనిని రూపొందించారు. నియోవార్మ్ లైఫ్ సేవిం గ్ బ్లాంకెట్ ఇప్పటికే నీలోఫర్ దవాఖానలో వాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో అన్ని ప్రభుత్వ దవాఖానలకు వీటిని సరఫరా చేయనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
మాతాశిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నర్సులు ఇంటింటికీ వెళ్లి సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం రాయితీతో ద్విచక్ర వాహనాలను ఏఎన్ఎంలకు అందించింది. ఇండ్ల వద్ద గర్భిణుల పేర్ల నమోదు, పిల్లలకు టీకాలు, ఇతర వైద్యసేవలకు వీలుగా ఈ వాహనాలను సమకూరుస్తున్నారు. మొత్తం 6,500 రెక్కల వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతగా 30 వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎ.ఎన్.ఎంలకు అందజేశారు. ఒక్కో వాహనానికి రూ. 55 వేలు ఖర్చు చేశారు.
తెలంగాణ టీకా వాహనాలు : మిషన్ ‘ఇంధ్రధనుస్సు’లో భాగంగా ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని 2017 మే 6న, హైదరాబాద్ కోఠి పీహెచ్ఎంసీ ఆస్పత్రిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శిబిరాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించారు. ప్రజలందరికీ అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, ఆ ప్రొఫైల్ ఆధారంగా తెలంగాణ హెల్త్ స్టేటస్ కూడా తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ఉచితంగా వినికిడి యంత్రాలు
ప్రతీ లక్ష మందిలో 291 మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. తెలంగాణలో జనాభా ప్రకారం 1.20 లక్షల మంది తీవ్రమైన వినికిడి లోపంతో బాధ పడుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వినికిడి లోపమున్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఈ వినికిడి యంత్రాలను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకుండా.. అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా ‘కంటి వెలుగు’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నేత్ర శిబిరాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.106.83 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అంచనాలు రూపొందించగా, 2018-19 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.84 కోట్లు కేటాయించింది. మిగిలిన మొత్తానికి రూ.22.82 కోట్లు జాతీయ ఆరోగ్య పథకం నిధులనుంచి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటి వెలుగు వైద్యశిబిరాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.42 కోట్లు విడుదల చేసింది.
ఈ పథకాన్ని 15 ఆగస్టు 2018 రోజున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. 33 జిల్లాల పరిధిలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో కంటి వెలుగు నేత్ర వైద్య శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 557 వైద్య బృందాలు, పట్టణ ప్రాంతాల్లో 267 వైద్య బృందాలు కలిపి మొత్తం 824 బృందాలు ఈ కార్యక్రమంలో ప్రజలకు కంటి వైద్య సేవలందించాయి. ప్రతి శిబిరంలో వైద్యాధికారి, ఆప్రోమెట్రిస్ట్, ఏఎన్ఎంలు, సూపర్ వైజర్లు, ఆశావర్కర్లు, 8మంది సహాయక సిబ్బంది బృందంగా ఏర్పడి పనిచేశారు. ట్రయల్ లెన్స్ సెట్, ఆటో రిప్రాక్టర్, దృష్టి, స్నెల్లెన్ చార్టులు, కంటి అద్దాలు, సాధారణ అద్దాలు, మందులు, రెండు టాబ్లెట్ ఫోన్లు, టేపు, టార్చ్ లైటు, సమాచారం, ఐఈసీ సామగ్రిని ముందస్తుగానే చేరవేయడంతో రాష్ట్రంలో ఎక్కడా ఆటంకం లేకుండా కంటి వైద్య శిబిరాలు జరిగాయి.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లోని మొత్తం 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు టిఎస్పిఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న ప్రభుత్వం.. నియామక ప్రక్రియల్లో న్యాయవివాదాలు వస్తున్న కారణంగా, ప్రక్రియ వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డును (ఎం.హెచ్.ఎస్.ఆర్.బి) ఏర్పాటు చేసింది. దీనికి చైర్మణ్ గా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని నియమించింది. బోర్డులో సిబ్బందిని కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ నియామక బోర్డు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్ మెంట్ బోర్డులను ఇదివరకే ఏర్పాటుచేసింది. విద్యుత్ సంస్థలు మొదటి నుంచీ సొంతంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటైంది. ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఈ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ 2016 జనవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్ గా డాక్టర్ రవీంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ గా డాక్టర్ వి.రాజలింగం నియమితులయ్యారు. ఎథిక్స్ కమిటీ (నైతిక ప్రమాణాల సంఘం), ఎగ్జిక్యూటివ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక నుంచి తెలంగాణలో వైద్యసేవలు అందించాలనుకునే వారెవరైనా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఎంబీబీఎస్ పూర్తయ్యాక రిజిస్టర్ చేసుకుంటేనే వారికి ప్రాక్టీసు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. వైద్య వృత్తికీ, ప్రభుత్వానికీ మధ్య మెడికల్ కౌన్సిల్ అనుసంధానంగా, నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. రాష్ట్ర వైద్య మండలి ప్రధాన కర్తవ్యం వైద్యుల పేర్ల నమోదుతోపాటు వైద్యులంతా నియమ నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా చూడటం. చికిత్సలో నిర్లక్ష్యం మూలంగా తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించి ఎవరికి ఫిర్యాదు చేసినా.. మెడికల్ కౌన్సిలే దీనికి పరిష్కారం చూపుతుంది. ఈ బాధ్యతను దేశంలో ఎంసీఐ చూసుకుంటే.. రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.
ఎవరైనా వైద్యులు తప్పు చేసినట్లు రుజువైతే చర్య తీసుకునే అధికారం కూడా దీనికి ఉంటుంది. ఎవరైనా వైద్యుల నిర్లక్ష్యం మూలంగా తమకు చికిత్సలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే అది ముందుగా వైద్య మండలి చైర్మన్కు అందుతుంది. ఆయన దాన్ని నైతిక ప్రమాణాల కమిటీకి పంపిస్తారు. ఎతిక్స్ కమిటీలో సభ్యులు ఇద్దరు మినహా అందరూ వైద్యమండలికి చెందిన వారే ఉంటారు. ఆ ఇద్దరినీ పేరు పొందిన నిపుణుల సూచన మేరకు ఎంపిక చేసి నియమిస్తారు. ఫిర్యాదును పరిశీలించాక ఆ కమిటీ దానిపై అభిప్రాయాన్ని అందిస్తుంది. ఫిర్యాదుపై సందేహాలుంటే ఆ కమిటీ ఇతర నిపుణుల సలహాలను కూడా తీసుకుంటుంది. నైతిక కమిటీ అభిప్రాయంపై వైద్య మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరిగి చర్చిస్తుంది. అనంతరం సర్వసభ్య బృందం కూడా దాన్ని పరిశీలిస్తుంది. ఫిర్యాదు అందాక ఫిర్యాదు చేసినవారిని, వైద్యుడిని పిలిచి మండలి ప్రశ్నిస్తుంది. వివరణ కోరుతుంది.
క్యాన్సర్ బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం, టాటా ట్రస్ట్ 2018 మార్చి 1న సంతకాలు చేశాయి. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ కార్యక్రమం కింద టాటా ట్రస్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. మూడంచెల విధానంలో విద్య, పరిశోధన సామర్థ్యాలను పెంచడం ద్వారా అత్యంత నాణ్యమైన క్యాన్సర్ కేర్ అందించనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ ను క్లిష్టమైన క్యాన్సర్ కేసులకు చికిత్స అందించేలా అభివృద్ధిచేస్తారు. క్యాన్సర్ వ్యాధి పరీక్షలు, చికిత్స విషయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ మెడికల్ కాలేజీలను బలోపేతంచేస్తారు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లా హాస్పిటళ్ల క్యాన్సర్ వ్యాధి పరీక్షలు, డేకేర్ కీమోథెరపీ సదుపాయాలు కల్పిస్తారు. తద్వారా రాష్ట్రమంతటా కేన్సర్ కేర్ నెట్వర్క్ ను నెలకొల్పుతారు. దీని ఫలితంగా క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప ప్రతీ విషయంలో హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి తప్పుతుంది.
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానను ఆసియాలోనే నంబర్ వన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అత్యాధునిక చికిత్స అందించేందుకు కొత్తగా క్యాన్సర్ పరిశోధనా కేంద్రంతోపాటు మహిళా రోగుల కోసం ప్రత్యేక భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దవాఖానాలో కార్పొరేట్ తరహాలో ట్రూభీమ్ వంటి యంత్రాలతో రేడియేషన్ థెరపీ అందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కేంద్రాల్లో పడకల సామర్థ్యాన్ని 250 పకడల నుంచి 450 వరకు పెంచారు. దీంతో రోగులు కార్పొరేట్కు బదులు ఎంఎన్జే వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో ఔట్ పేషంట్ల సంఖ్య 300 వరకు ఉండగా ఇప్పుడు 500 దాటుతున్నది. దవాఖానలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 600 వరకు ఉన్నది. హైదరాబాద్ రెడ్హిల్స్ లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన పక్కనే ఉన్న మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లో కొత్త భవన సముదాయాన్ని నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన కార్పొరేట్కు ధీటుగా వైద్యసేవలు అందిస్తున్నది. దీనిని అదనంగా దాదాపు 4.2 ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల్లో కార్పొరేట్ హంగులతో 2 బ్లాకులుగా నిర్మించనున్నారు. ఈ భవనాల్లో ఎయిమ్స్ తరహాలో అత్యాధునిక వైద్యపరికరాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.100 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. నూతన భవనాలను రెండు బ్లాక్లుగా నిర్మిస్తుండగా.. బ్లాక్-ఏలో జన్యు పరిశోధనాకేంద్రం, బోన్మ్యారో, స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ (మూలకణాల మార్పిడి), పీడియాట్రిక్ ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ, పాలియేటివ్ కేర్ తదితర విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. బ్లాక్-బీని మహిళా రోగుల కోసం కేటాయించనున్నారు. మహిళలకు అన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు, చికిత్సను ఈ బ్లాక్లోనే అందించనున్నారు. పాత, కొత్త భవనాలను కలుపుతూ వంతెన ఏర్పాటు చేయనున్నారు. 2020-21 బడ్జెట్లో ఈ దవాఖానాకు రూ.20 కోట్లు కేటాయించారు.
భువనగిరి జిల్లాలోని బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు 19 మే, 2018 న కేంద్రం ప్రకటన చేసింది. 17 డిసెంబర్, 2018 న ఎయిమ్స్ ఏర్పాటుకు అనుమతి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చూపించిన స్థలాన్నే కేంద్రం ఖరారు చేసింది. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పీఎంఎ్సఎ్సవై) పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎయిమ్స్ ను ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ కు కేంద్ర ప్రభుత్వం రూ.1,028 కోట్లు ఖర్చు చేసింది. ఈ కళాశాలను 27 ఆగస్టు, 2019న ప్రారంభించారు. ఎయిమ్స్ కు 200 ఎకరాలు అవసరం అయ్యింది. బీబీ నగర్ సమీపంలోని నిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. నిమ్స్ కు ప్రభుత్వ స్థలం 160 ఎకరాలు ఉంది. మరో 50 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ప్రభుత్వం 49 ఎకరాల భూమిని 27 మంది రైతుల నుంచి ఒక్కో ఎకరానికి రూ.48 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. ఎయిమ్స్ తో బోధన, బోధనేతర సిబ్బంది కలిసి దాదాపు మూడు వేల మందికి ఉపాధి లభించనుంది. సౌకర్యాలు, సేవలు, షాపింగ్ సెంటర్లు, క్యాంటీన్ల ద్వారా పరోక్షంగా మరింతమందికి ఉపాధి దక్కనుంది. ఎయిమ్స్ కేవలం వైద్య విద్య, శిక్షణకు మాత్రమే ఉపయోగపడటం కాకుండా తెలంగాణ ప్రాంతంలో వైద్య ఆరోగ్య రంగంలో నిపుణుల కొరతను తీర్చనుంది. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే కాకుండా ప్రాథమిక వైద్య సేవలు కూడా అందించడానికి డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
పట్టణ ప్రాంతాల్లోని 92 అర్బన్ హెల్త్ సెంటర్లను పీహెచ్ సీల స్థాయికి అప్గ్రేడ్ చేయాలని 2016 జనవరి 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల పైబడిన జనాభా గల నగరాలు, పట్టణాలను గుర్తించి వీటిని అమలు పరిచారు. 2018 మే 25 నాటికి రాష్ట్రంలో మొత్తం 222 అర్బన్ హెల్త్ సెంటర్లను పి.హెచ్.సి.ల స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఒక్క పీహెచ్.సీ కూడా ఎన్.క్యూ.ఏ.ఎస్. గుర్తింపు కలిగిలేదు. కానీ, 2020 జనవరి నాటికి తెలంగాణలోని 84 పీహెచ్ సిలు ఎన్.క్యూ.ఏ.ఎస్. స్థాయిని పొందడంతో మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంది.
తెలంగాణలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(ఎన్.సి.డి.సి.)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా 2019 డిసెంబరులో ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయం ఆవరణలో ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక భవనం కేటాయించింది. రూ.25 కోట్లతో ఇక్కడ ప్రయోగశాల నిర్మిస్తారు.
ప్రఖ్యాత ఉస్మానియా దవాఖాన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ పురాతన భవనం శిథిలావస్థకు చేరింది. ఓపీ బ్లాక్లు రోగులకు సరిపోకపోవడంతో నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 100 కోట్ల వ్యయంతో 800-1000 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య విభాగాలు, మాడ్యులర్ ఆపరేషన్ థియే టర్లు, సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్ తదితర వసతులతో ఏడు అంతస్తుల (జీ+7) భవనాన్ని నిర్మించనున్నారు.
ఉస్మానియా ఆస్పత్రిని కూల్చవద్దని కోర్టుకు…
ఉస్మానియా ఆస్పత్రి పురాతన భవనాన్ని కూల్చవద్దని పర్యావరణ పరిరక్షణ సంస్థలతోపాటు, కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉస్మానియా భవనం వారసత్వ సంపద అని అలాంటి వారసత్వ సంపదను పరిరక్షించాలే తప్ప కూల్చివేయవద్దని వారు ఆ పిటిషన్లలో కోర్టును కోరారు.
ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి కొత్త భవనం కట్టాలి : మెడికల్ జేఏసీ
ఉస్మానియా ఆస్పత్రి పురాతన భవనాన్ని కూల్చి, కొత్త భవనాన్ని కట్టాలని తెలంగాణ మెడికల్ జేఏసీ, ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ మోస్ట్ బ్యాక్ వర్డ్ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పురాతన భవనాన్ని కూల్చేందుకు ఎవరైనా అడ్డుపడితే వారిని ఎదుర్కొంటామని, ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆ సంఘాలు పేర్కొన్నాయి.
కాన్యర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించటం వల్ల దాన్ని నిరోధించడానికి వీలవుతుంది. చాలా మంది కాన్సర్ కణతులను ప్రారంభ దశలో గుర్తించలేరు. వీటిని గుర్తించడానికి స్కానింగ్ చేయించాలన్నా ప్రయివేటు ఆసుపత్రుల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. దీంతో పేద, మద్య తరగతి ప్రజలు ఈ స్కానింగ్ చేయించుకోటానికి సుముఖత చూపరు. ప్రాథమిక దశలోనే కాన్సర్ ను గుర్తించక పోవటంతో చాలా మంది ఈ వ్యాది తో మరణించినవారు వున్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఆధునికి ‘పెట్ స్కాన్’ యంత్రాన్ని హైదరాబాద్ లోని ఎంఎస్జే లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యంత్రాన్ని రూ.13 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. ఆసుపత్రిలో పేద ప్రజలకు ఉచితంగా స్కానింగ్ చేస్తున్నారు. ఇతరులకు 50-60 శాతం తక్కువ ధరకు పరీక్ష చేస్తారు. ఈ యంత్రంతో ఒక సెం.మీ. పరిమాణం కంటే తక్కువ పరిమాణం ఉన్న కణతులను, ఇన్ఫెక్షన్లను కూడా గుర్తించవచ్చు.
డెంగీ లాంటి విష జ్వరాల సమయంలో రోగులకు ప్లేట్ లెట్స్ పడిపోతాయి.అలాంటి సందర్భంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ప్లేట్ లెట్స్ ఎక్కించడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెల్లలేని నిరుపేదలు అనేక సందర్భాల్లో మృత్యువాత పడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ (ఎస్డీపీ) యంత్రాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులోకి తెస్తున్నది. ఈ యంత్రం ద్వారా పేదలకు ఉచితంగా ప్లేట్ లెట్స్ ను అందించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 5వేల ప్లేట్లెట్లకు రూ. 13 వేల వరకు చార్జి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన తొలి గంట(గోల్డెన్ అవర్)లో సంభవిస్తున్న 35శాతం మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందుతున్నది. రోడ్డు ప్రమాద బాధితులను తగ్గించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గోల్డెన్ అవర్ను అమలులోకి తీసుకురానున్నది. నూతన చట్టాన్ని అనుసరిస్తూ తెలంగాణలో గోల్డెన్ అవర్కు భరోసా ఇవ్వనున్నారు. రాష్ట్రం లో పేదల కోసం అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీని గోల్డెన్ అవర్కు లింక్ చేయాలని రవాణాశాఖ ప్రతిపాదించింది.
తమిళనాడు విధానంపై అధ్యయనం..
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమిళనాడులో విజయవంతమైన ‘యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఇన్సియేటివ్’ విధానంపైనా తెలంగాణ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమాణాలు, పరిశుభ్రత విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) 4 సెప్టెంబర్, 2019న వెల్లడించింది. రాష్ట్రంలోని 35 ఆస్పత్రులు ఎన్ క్యాష్ ధ్రువీకరణ పత్రాలు పొందాయి. వీటిలో ఖమ్మం, భద్రాచలం, బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రులు, పలు పీహెచ్సీలు ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు ఒక్కో పడకకు ఏడాది రూ.10 వేల చొప్పున మూడేళ్ల పాటు కేంద్రం నిధులు ఇస్తుంది. పీహెచ్సీలకు పడకలతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.2 లక్షలు, 24 గంటల పాటు సేవలందిస్తే ఏడాదికి రూ.3 లక్షలు ఇస్తారు. వైద్య సేవలు, మందుల లభ్యత, శుభ్రత ఆధారంగా ఎన్క్యాష్ సర్టిఫికెట్లు ఇస్తారు.
ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన చికిత్సకు గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో ఆయా రాష్ర్టాల్లో వైద్య ఆరోగ్యసేవలు అందించడంలో నీతి ఆయోగ్ -2019 జనవరిలో రూపొందించిన నివేదికలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. వైద్య ఆరోగ్యరంగంలో వివిధ అంశాల ఆధారంగా 65 కి పైగా పాయింట్లు సాధించిన రాష్ర్టాలను అత్యుత్తమ సేవలందిస్తున్నవిగా గుర్తించారు. 92 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో, 77 పాయింట్లతో తమిళనాడు రెండోస్థానంలో ఉండగా.. 73 పాయింట్లతో తెలంగాణ మూడోస్థానంలో నిలించింది.
అవయవదానంలో తెలంగాణ ప్రజలు 160 మంది అవయవదానాలతో తమ గొప్ప మనసును చాటుకొని.. రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపారు. రెండోస్థానంలో తమిళనాడు (140 అవయవదానాలు), మూడోస్థానంలో మహారాష్ట్ర (135 అవయవ దానాలు), నాలుగో స్థానంలో కర్ణాటక (90 అవయవదానాలు) నిలిచాయని టైమ్స్ ఆఫ్ ఇండియా 2018 సర్వే వెల్లడించింది.
ప్రమాద సందర్భాల్లో సత్వర సాయమందించేందుకు తోడ్పడే ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జనవరి 17, 2017న 50 వాహనాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి అందజేశారు. టూ వీలర్ అంబులెన్సుల ద్వారా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యంత రద్దీ, ఇరుకైన ప్రాంతాల్లో సేవలను ఉచితంగా అందజేస్తారు. ఎమర్జెన్సీ సమయంలో వైద్యం చేయడంలో శిక్షణ పొందిన వ్యక్తి ఈ వాహనాలను నడిపిస్తారు. అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాలకు, ఇరుకు మార్గాల్లోకి వెళ్లి అత్యవసర సేవలు అందించేందుకు వీటిని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, జీవీకే ఈఎంఆర్ఐ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా ఈ బైక్ అంబులెన్సులను ప్రవేశపెట్టింది. తొలుత హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, ప్రస్తుతం అన్ని జిల్లాలకు ఈ వాహనాలకు సమకూర్చారు. ఐటీడీఏ పరిధిలలో 10 వాహనాలను ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఈ వాహనాల ద్వారా మంచి సేవలందుతుండడంతో రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచాలని సర్కారు యోచిస్తున్నది. ఈ వాహనాల్లో ఆక్సిజన్ సిలిండర్, మెడ పట్టీలతోపాటు తేలికపాటి గాయాలకు ప్రాథమిక చికిత్స చేయడానికి పరికరాలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, అగ్ని ప్రమాదాలు, ఈ వాహనాల ద్వారా నీటిలో మునగడం, గుండెనొప్పి, పక్షవాతం, బీపీ, షుగర్, విషం తీసుకోవడం, వడదెబ్బ, ఆత్మహత్యా యత్నం, గర్భిణులకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బీపీ, షుగర్, జ్వరానికి సంబంధించిన పరికరాలు, మందులు, విషపు పురుగు విరుగుడుకు మందులు నెబులైజర్, ఇంజక్షన్లు, టానిక్లు, ట్యాబ్లెట్లు ఉంటాయి.
ఈ వాహనాలను జీపీఎస్ సిస్టం, మొబైల్ అప్లికేషన్ లకు అనుసంధానించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారు.
ఆకస్మికంగా గుండెపోటు వస్తే తక్షణం వైద్యం అందక రాష్ట్రంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. 108 అత్యవసర అంబులెన్సులున్నా వాటిల్లో అత్యాధునిక సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాల రేటు అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితికి అధిగమించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ‘స్టెమీ’ అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్టెమీ అంబులెన్సులు ఆకస్మిక గుండె పోటును నివారించేందుకు ఉపయోగపడతాయి. అందులో కేతలాబ్లో ఉండే అన్ని రకాల అత్యాధునిక వసతులు ఉంటాయి. ఈసీజీ రికార్డు చేయడం, గుండె చికిత్సకు అవసరమైన ప్రొటోకాల్ వ్యవస్థ ఉంటుంది. అడ్వాన్స్ లైఫ్ సపోర్టుతో వైద్యం అందుతుంది. ఈ అంబులెన్సులను ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన వారి కోసమే పంపుతారు. 108 అత్యవసర వాహనాలకు స్టెమీని అంబులెన్సులను అనుసంధానం చేస్తారు. స్టెమీ అంబులెన్సులతో పాటు ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కేతలాబ్ను ఏర్పాటు చేస్తారు. దానివల్ల రోగిని ఏదో ఆసుపత్రికి కాకుండా కేత్ లాబ్కే తీసుకెళ్లడానికి వీలుంటుంది.
కరోనాకు తీసుకుంటున్న జాగ్రత్తలతో పరోక్షంగా క్షయవ్యాప్తికి అడ్డుకట్ట పడింది. నిత్యం మాస్కు ధరించి ఉండటంతో క్షయరోగుల నుంచి మిగతావారికి సోకడం లేదు. 2019 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 12.55 లక్షల టీబీ కేసులను గుర్తించగా, ఈ ఏడాది 9.15లక్షల కేసులనే గుర్తించారు. ఈ లెక్కన సగటున 3.4 లక్షల టీబీ కేసులు తగ్గిపోయాయని ఇటీవల జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం విడుదల చేసిన నివేదిక చెప్తున్నది. దేశవ్యాప్తంగా 2019లో మొత్తంగా 24 లక్షల మంది రోగులను గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 72,655 మంది క్షయ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ‘డాట్ (డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ)’ద్వారా క్షయవ్యాధిగ్రస్థులు 95% కోలుకుంటున్నారు. ప్రతి లక్ష మందిలో 199 మంది టీబీ బారిన పడుతున్నారని ఓ అంచనా.
ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు జాతీయ పురస్కారం (28 డిసెంబర్ 2020)
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ వైద్య, విజ్ఞాన సంస్థకు ప్రతిష్టాత్మకమైన సరోజిని త్రిలోక్ నాథ్ జాతీయ పురస్కారం లభించింది. ఈ అవార్డును 28 డిసెంబర్ 2020న ఎల్వీపీఈఐ విజన్ అధిపతి డాక్టర్ బూల్యా క్రిస్టీ వర్చువల్ విధానంలో అందుకున్నారు.
వరంగల్ లో రూ.120 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన సిద్ధం (4 డిసెంబర్ 2020)
పేదలకు కార్పొరేట్స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వరంగల్లో అత్యాధునిక హంగులతో కార్పొరేట్స్థాయి వైద్యం అందించేలా సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించింది. రూ.120 కోట్లతో 250 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దవాఖాన ప్రారంభమైతే పెద్ద రోగాలకు వైద్యం కోసం పేదలు హైదరాబాద్కు వెళ్లే ఇబ్బందులు తప్పనున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల మేరకు 2014 డిసెంబర్లో వరంగల్కు ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరైంది. అన్ని అనుమతులు సాధించిన తర్వాత 2015 సెప్టెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఆరు అంతస్తులు, రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పద్ధతిలో దీనిని నిర్మించారు. సాధారణ వైద్య సేవలతోపాటు ఆపరేషన్లు (సర్జరీలు) అందుబాటులోకి రానున్నాయి. గుండె, మూత్రపిండాలు, నరాల వ్యాధులు, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వైద్యసేవలు పేదలకు ఉచితంగా అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) నిధులు కలిపి ఈ దవాఖానను నిర్మించారు. వైద్యసేవల పరంగా పది డిపార్టుమెంట్లకు 20 పడకల చొప్పున 200 పడకలను కేటాయించారు. అత్యవసర వైద్యసేవల కోసం 50 పడకలను అందుబాటులో ఉంచారు. 13 కిలోమీటర్ల పైప్లైన్ సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటుచేశారు. ఏడు ఏడు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్లు, క్యాథలాబ్ ఉన్నాయి. కార్డియాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్టీ, ట్రామా కేర్ సేవలకు అనుగుణంగా యంత్రపరికరాలున్నాయి. వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ, సెమినార్ హాళ్లను నిర్మించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వైద్య కేంద్రంగా ఉంటున్న వరంగల్లో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుతో వైద్యరంగంలో ప్రతిష్ట మరింత పెరుగనున్నది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని పేదలకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సిద్దిపేటలో 960 పడకల దవాఖాన, ఐటీ టవర్ (10 డిసెంబర్ 2020)
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు డిసెంబర్ 10న శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు. సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణానికి కూడా భూమిపూజ చేయనున్నారు. నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబరులోని 3 ఎకరాల్లో రూ.45 కోట్లతో జీప్లస్ 5 అంతస్తులతో ఐటీ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. సిద్దిపేటలోని నర్సపురం వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 144 మంది లబ్ధ్దిదారులకు సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు ఇండ్లను అప్పగిస్తారు. తర్వాత రూ.278 కోట్లతో సిద్దిపేట పట్టణంలో చింతల్ చెరువు వద్ద నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ జలాశయం మధ్యలో రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
వ్యాక్సినేషన్లో తెలంగాణ బెస్ట్ (19 జనవరి 2021)
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ అమలుతీరుపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ సమర్థంగా నిర్వహిస్తున్నదని కితాబిచ్చింది. తెలంగాణలో వ్యాక్సినేషన్పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సంతృప్తి వ్యక్తంచేశారని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు.
ఆరోగ్యశ్రీలో అవయవ మార్పిడి ఆపరేషన్లు (8.2.2021)
ఆరోగ్యశ్రీ పథకం కింద నిరుపేదలకు ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలను కూడా అందులో చేర్చింది. రూ.30 లక్షలు ఖర్చయ్యే ఈ అవయవ మార్పిడి ఆపరేషన్లను ఉచితంగా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గాంధీ ఆస్పత్రిలో దాదాపు 90 కోట్లతో అధునాతన ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, హబ్.లను గాంధీ ఆస్పత్రిలో నిర్మించనున్నారు.
తెలంగాణలో అవయవదానాల వివరాలు :
తెలంగాణలో 2020 డిసెంబర్ వరకు 3,064 అవయవదానాలు జరిగాయి. ఇందులో కిడ్నీ – 1254, లివర్ -765, హార్ట్ – 112, హార్ట్ వాల్వ్స్ – 170, కండ్లు – 709, లంగ్స్ – 44, పాంక్రీయస్ (క్లోమం)- 10 ఉన్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లో 780 మంది అవయవదానం చేయగా, నిమ్స్ లో 20 మంది, ఉస్మానియా హాస్పిటల్లో 8 మంది అవయవాలను దానం చేశారు.
వంద శాతం నల్లా కనెక్షన్లతో తెలంగాణ టాప్
కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభినందనలు (20 జనవరి 2021)
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అభినందనలు తెలిపింది. వందశాతం ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్ రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు 20 జనవరి 2021 ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఇప్పటివరకు వంద శాతం ఎఫ్హెచ్టీసీ పూర్తి చేసిన రాష్ట్రాలుగా గోవా, తెలంగాణ నిలిచాయన్నారు. మొత్తం 54,06,070 గృహాలకు ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. భారతదేశ గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్లు ఉండేలా చూడడానికి తాము దగ్గరగా ఉన్నామన్నారు. హర్ ఘర్ జల్ అనే తమ ఆలోచన త్వరలోనే నిజమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు.
2013 నుంచి 2020 వరకు..
2013లో 41 మంది 189 అవయవాలను దానం చేయగా, 2014లో 51 మంది 233 అవయవాలను, 2015లో 89 మంది 364 అవయవాలను, 2016లో 106 మంది 411 అవయవాలను, 2017లో 150 మంది 563 అవయవాలను, 2018లో 160 మంది 573 అవయవాలను, 2019లో 134 మంది 469 అవయవాలను, 2020లో 75 మంది 257 అవయవాలను దానం చేశారు.
దివ్య జన ఔషధీ.. తెలంగాణపై ప్రధాని మోదీ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనలో సాధించిన పురోగతిని పీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్-161 లోని సంగారెడ్డి–అకోలా– నాందేడ్ సెక్షన్కు చెందిన నాలుగు లేనింగ్ విషయంలో సాధించిన పురోగతిని పీఎం మోదీ అభినందించారు. భూసేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పురోగతి సాధించిందని కేంద్ర రవాణా కార్యదర్శి ఎ.గిరిధర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ , ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ సంచాలకులు డా.ప్రీతి మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్
2013-14 : 17,000
2019-20 : 23,450
(పెరుగుదల 6,450, పెరిగిన శాతం 38)
ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్స్
2013-14 : 254
2019-20 : 11,758
(పెరుగుదల 11,504, పెరిగిన శాతం 4529)
వెంటిలేటర్ బెడ్స్
2013-14 : 100
2019-20 : 1484
(పెరుగుదల 1,384, పెరిగిన శాతం 1384)
డయాలసిస్ సెంటర్లు
2013-14 : 3
2019-20 : 49
(పెరుగుదల 46, పెరిగిన శాతం 1533)
ఐ.సి.యు.లు
2013-14 : 4
2019-20 : 29
(పెరుగుదల 25, పెరిగిన శాతం 625)
డయాగ్నస్టిక్ సెంటర్లు
2013-14 : 0
2019-20 : 25
శిశు మరణాల రేటు (ప్రతీ వెయ్యి మందికి)
2013-14 : 39
2019-20 : 26.4
(తగ్గుదల రేటు 12.6 )
మాతా మరణాల రేటు (ప్రతీ లక్ష జననాలకు)
2013-14 : 92
2019-20 : 63
(తగ్గుదల రేటు 29)
ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్ పేషంట్ల శాతం
2013-14 : 20
2019-20 : 40
(పెరుగుదల 100 శాతం)
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి ప్రసవాలు
2013-14 : 91 శాతం
2019-20 : 97 శాతం
(పెరుగుదల 6 శాతం)
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం
2013-14 : 25 శాతం
2019-20 : 50 శాతం
(పెరుగుదల 100 శాతం)
వ్యాధి నిరోధక టీకాలు
2013-14 : 68 శాతం
2019-20 : 96 శాతం
(పెరుగుదల 28 శాతం)
ఎస్.ఎన్.సి.యు.(సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్)
2013-14 : 18
2019-20 : 42
(పెరుగుదల 24, పెరిగిన శాతం 133)
బ్లడ్ బ్యాంకులు
2013-14 : 18
2019-20 : 31
(పెరుగుదల 13, పెరిగిన శాతం 72)
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటు సెంటర్లు
2013-14 : 2
2019-20 : 3
(పెరుగుదల 1, పెరిగిన శాతం 50)
లివర్ ట్రాన్స్ ప్లాంటు సెంటర్లు
2013-14 : 0
2019-20 : 2
హార్ట్ ట్రాన్స్ ప్లాంటు సెంటర్లు
2013-14 : 1
2019-20 : 2
(పెరుగుదల 1, పెరిగిన శాతం 100)
వైరాలజీ లాబ్స్
2013-14 : 0
2019-20 : 22
మెడికల్ కాలేజీలు
2013-14 : 4
2019-20 : 10
(పెరుగుదల 6, పెరిగిన శాతం 150)
ఎంబిబిఎస్ సీట్లు
2013-14 : 850
2019-20 : 1640
(పెరుగుదల 790, పెరిగిన శాతం 93)
పిజి సీట్లు
2013-14 : 531
2019-20 : 835
(పెరుగుదల 304, పెరిగిన శాతం 57)
సూపర్ స్పెషాలిటీ సీట్లు
2013-14 : 58
2019-20 : 86
(పెరుగుదల 28, పెరిగిన శాతం 48)
102 (అమ్మఒడి) వాహనాలు
2013-14 : 0
2019-20 : 300
పరమపద వాహనాలు
2013-14 : 0
2019-20 : 50