KCR : సమైక్య పాలనలో వివక్షకు గురై అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్.. ఆదివారం మధ్యాహ్నం వీణవంక బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి వివరించారు.
‘14, 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ చివరిదశలో ఒక మాట చెప్పిన. హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీకి పోతున్న. ‘కేసీఆర్ మీరు ఢిల్లీకి వెళ్తున్నరు.. ఏం జరుగుతది అనుకుంటున్నరు..?’ అని మీడియా వాళ్లు అడిగిండ్రు. ఒకటే మాట చెప్పిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్న మళ్ల తెలంగాణ రాష్ట్రంలనే అడుగుపెడుత అని చెప్పిన. ఆనాడు నేను ఒక్క మాట మాట్లాడితే ఆడుకుంటున్న ఆంధ్ర మీడియా వాళ్లతోనే ఆ మాట చెప్పిన. ఎంత ధైర్యం, నమ్మకం ఉంటే ఆ మాట చెప్పాలె. మీరందరూ ఇచ్చిన బలం, ధైర్యంతో ఢిల్లీకి పోయిన నేను చెప్పిన మాట ప్రకారం మళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలనే అడుగుపెట్టిన’ అని కేసీఆర్ చెప్పారు.
‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీళ్లు లేక హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షాలు నడిపిన బిడ్డలు, ఫ్లోరైడ్తో నడుములు వంగిన లక్షలాది బాధితులు ఉండె. మంచి నీళ్లు లేవు. కరెంటు రాదు. సాగునీళ్లు లేవు. చాలా దుర్భరమైన పరిస్థితి. అసుంటి రాష్ట్రాన్ని ఒకటి ఒకటి చేసుకుంటూ పొదరిల్లు నిర్మించినట్టు బ్రహ్మాండంగా చేసుకుంటు వచ్చినం. ముందుగా ముసలోళ్ల గోస తీర్చాలని రూ.200గా ఉన్న పెన్షన్ను రూ.1000 చేసిన. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచిన’ అన్నారు.