KCR | రైతుబంధు సాయం విషయంలో సీఎం రేవంత్పై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి ప్రశ్నలు సంధించారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ మళ్లీ మర్లవడ్డది. తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే. మొన్న ముఖ్యమంత్రి రైతుబంధు 9వ తారీఖు వరకు వేస్తా అంటున్నడు. పంటలు వచ్చి జోకుతున్నరు ఓ దిక్కు. నాటేటప్పుడు ఇస్తరా ? జోకేటప్పుడు ఇస్తరా? ఎంతపాటి పరిపాలన’ అంటూ విమర్శించారు.
‘జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి రాష్ట్రం గౌరవం పెంచినం. ఐటీ, పరిశ్రమల రంగంలో బ్రహ్మాండంగా తెలంగాణకు పెట్టుబడులు వస్తుండే. నరేంద్ర మోదీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తుండే. ఇవాళ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతున్నది. రోజుకు ఐదారుసార్లు ట్రిప్ అవుతున్నది. మధ్యలో పని ఆగిపోయి పెదవి విరుస్తున్నరు. ఇగ తెలంగాణలో లాభంలో లేదు వెళ్లిపోవాలనుకుంటున్నారని పేపర్లలో వార్త వచ్చింది. నాకు చాలా దుఃఖం కలిగింది. నాలుగైదు నెలల్లో దుర్మార్గులు ఎంత పని చేసిరి. ఎంతమంచిగున్న తెలంగాణ ఎట్ల ఆగమైపాయే. ఇది ఎట్లా అని చాలా బాధపడ్డ. ఈ బాధ నివారణ కావాలి’ అన్నారు.
‘2001లో తెలంగాణ జెండా ఎత్తిన నాడు హుజూరాబాద్ గడ్డ. ఆ నాడు పెద్ద నాయకులు లేకపోయినా జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్ గడ్డ. 2001 ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందున్నది. మన బాధ్యత పూర్తవలేదు. అందుకోసం అందరినీ కోరేది ఒకటే. నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం.. కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండోది వందశాతం నేను మీకు చెబుతున్నా.. నా మాటమీద విశ్వాసం ఉంచండి. మళ్లీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా మధ్యలో వచ్చినా.. చివరకు వచ్చినా ఎప్పుడు వచ్చిన మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందులో ఎవరికీ అనుమానం లేదు. వందశాతం వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది’ అన్నారు.