Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నారు. ప్రభుత్వం అందించే డబ్బును సమాజంలో గొప్పగా ఎదిగేందుకు ఉపయోగించాలని, ఉపాధిని వెతుక్కొని సగర్వంగా జీవించాలని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఈ మేరకు లబ్ధిదారులకు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తున్నారు.
ఆ సందేశం ఇదే..
‘‘చిన్న విత్తు నుంచే మహా వృక్షం ఎదిగి వికసిస్తుంది. మంచి ఆలోచనతోనే మహాద్భుతం సాధ్యమవుతుంది.
మిత్రులారా.. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా మీ SBI ఖాతా xxxxలో రూ.9,90,000/-, రక్షణ నిధిలో రూ.10 వేలు జమ చేసింది. ఈ మొత్తాన్ని మీకు నచ్చిన పనికి పెట్టుబడిగా వాడుకోవచ్చు. మీకు వచ్చిన పనిని ప్రారంభించి అభివృద్ధి సాధించవచ్చు. స్వయం ఉపాధితో మీరు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు అభినందనలు.’’
జై భీం – జై తెలంగాణ – జై హింద్
మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,
ముఖ్యమంత్రి