గోల్కొండ పత్రికను విలువలతో నడిపారు
సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్
ఘనంగా సురవరం ప్రతాప్రెడ్డి జయంతి ఉత్సవాలు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 4: తెలంగాణ ఆధునిక సమాజానికి సురవరం ఓ మార్గదర్శి, ఆయనను స్ఫూర్తిగా తీసుకుందామని ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ, కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హాలులో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం టీయూడబ్ల్యూజే, మెప్మా, సురవరం ప్రతాప్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిజంలో నాటి-నేటి విలువలపై సదస్సు నిర్వహించారు. సమావేశానికి జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా దేశపతి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ సీతారామారావు, సురవరం ప్రతాప్రెడ్డి ట్రస్ట్ సభ్యురాలు పుష్పలత, శాంత నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మంత్రి శ్రీనివాస్గౌడ్ కూతురు శ్రీహిత, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ నిజాం పాలనలో తెలుగు మాట్లాడడం చదవడం నేరంగా పరగణించే రోజుల్లో తెగించి సురవరం ప్రతాప్రెడ్డి గోల్కొండ పత్రికను స్థాపించి నిజాంకు వ్యతిరేఖంగా వార్తలు, సంపాదకీయాలు రాశారని గుర్తుచేశారు. రామాయణం లాంటి మహావ్యాసంపై కూడా ఆయన విమర్శనాత్మక చర్చకు దారి తీసేలా రచనలు కొనసాగించాడన్నారు. తాను రెడ్డి కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కులరహిత సమాజం కోసం పోరాడాడని కొనియాడారు. న్యాయవాదిగా, కవిగా, కథకునిగా, సంపాదకునిగా అనేక సేవలు అందించారన్నారు. అలాంటి మహనీయుడు మహబూబ్నగర్ జిల్లా వాసి కావడం జిల్లాకే గర్వకారణమని చెప్పారు. ప్రస్తుతం పత్రికలు పెట్టుబడిదారుల గుప్పిట్లోపడి నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాయితీ కలిగిన జర్నలిస్టులు ఉన్నప్పటికీ పత్రికా యాజమాన్యాలను ఎదురించి రచనలు చేయలేరన్నారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిజంలో నిబద్ధత, నీతి, నిజాయితీ, విలువలు వంటి సమస్తం కలిపితే సురవరం ప్రతాప్రెడ్డి అని కొనియాడారు. స్వతంత్ర ప్రతిపత్తితో గోల్కొండ పత్రికను ప్రభుత్వమే నడిపించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. కట్టా శేఖర్రెడ్డి మాట్లాడుతూ సురవరం నేటి జర్నలిజానికి ఆదర్శ ప్రాయుడని చెప్పారు. సదస్సులో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు దత్తేందర్, ఉపాధ్యక్షుడు బీజీ రామాంజనేయులు, సీనియర్ రిపోర్టర్లు బాషా, నారాయణరెడ్డి, రఘ, రాములు, శ్యాం పాల్గొన్నారు.