గ్రామాల్లో జోరుగా నిర్మాణాలు
భూగర్భజలాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు
జిల్లాలో పూర్తయినవి 43,188, వివిధ దశల్లో ఉన్నవి10,259..
నర్సంపేట రూరల్, మార్చి28: భూమిపై ఉన్న ప్రాణకోటికి నీరే జీవనాధారం.. అలాంటి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. ప్రతి ఇంట్లో నిత్యం దైనందిన కార్యక్రమాలు, అవసరాలకు ఉపయోగించే నీటికన్నా వృథాగా పోయే నీరే ఎక్కువ. ఈ క్రమంలో వృథా నీటిని ఒక చోటికి చేర్చితే భవిష్యత్ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. భవిష్యత్లో రానున్న నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ఆర్థిక సాయం అందిస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 43,188 నిర్మాణాలు పూర్తికాగా మరో 10,259 వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే పెద్ద మొత్తంలో భూగర్భ జలాలు పెరుగుతాయని, వరుస కరువులో కూడా బావులు, బోర్లలో నీరు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 500 నుంచి 600 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా నీటి చుక్క కనిపించని పరిస్థితి. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడుగుంత ఉండాల్సిందే.
ఇంకుడు గుంతతో లాభాలెన్నో..
ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. ప్రతి వర్షపు చుక్క భూమిలో ఇంకే విధంగా ఉపయోగపడుతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి. బావులు, బోర్లలో నీరు నిల్వ ఉంటుంది. భవిష్యత్ తరాలకు నీటి సమస్య ఉండదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంకుడు గుంతలే ఇంటికో చెరువులా కన్పిస్తున్నాయి.
నిర్మాణం ఇలా..
వర్షపు నీరు ఒకచోటికి చేరే ప్రాంతంలోనే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి. ప్రతి గుంత 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్ల లోతు కలిగి ఉండాలి. అడుగుభాగంలో ఫీటున్నర మందం బెందడురాళ్లు, దానిపైన 40ఎంఎం ఫీటున్నర కంకర, వాటిపైన 3ఫీట్ల రింగ్ను అమర్చాలి. పైన మూత ఏర్పాటు చేసి 5 మీటర్ల పైపును భిగించాలి. డ్రమ్ము పక్కన ఖాళీ స్థలంలో ఇరుపక్కల 20ఎంఎం కంకర నింపాలి. మొదట గుంత తవ్వగా వచ్చిన మట్టిని నీటి ప్రవాహానికి అడ్డంగా, అవతలి భాగంలో కట్ట రూపంగా పోయాలి. ఇంకుడు గుంత చుట్టూ సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తే గుంత పూడిపోకుండా ఉంటుంది. ప్రతి ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.4,096లు అందిస్తున్నది. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఇంకుడు గుంతలను ఉత్సాహంగా నిర్మించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఇంకుడుగుంతల నిర్మాణాలు 43,188 పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 10,259 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.