మంచిర్యాల : వివిధ ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, సర్జికల్ షాపులో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం మంచిర్యాలలో చోటుచేసుకుంది. అధిక ధరలకు కొవిడ్ -19 టెస్ట్ కిట్లను విక్రయించిన ఆరోపణలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 1.15 లక్షల విలువైన 460 కిట్లను స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. నిందితులు కమనీ శ్రీనివాస్, హెల్త్కేర్ ల్యాబ్కు చెందిన బి సాగర్, పద్మావతి డయాగ్నోస్టిక్కు చెందిన ఎండి అజీజ్, ఎండి నజీమ్, అమరావతి సర్జికల్స్కు చెందిన ఎ. ప్రశాంత్, గుడికందుల రాజేందర్ అని తెలిపారు. అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా కిట్లను విక్రయించినట్లు గుర్తించడంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈజీ మనీ కోసం నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. కిట్లను రూ.15,00 నుండి 2 వేల మధ్య అమ్ముతున్నట్లు వెల్లడించారు.
ఐసిఎంఆర్ నిర్ణయించిన దానికంటే ఎక్కువ రేటుకు కిట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎకె మహేందర్, మంచిర్యాల ఇన్స్పెక్టర్ ఎంఎల్ ముత్తిలింగయ్య, ఇతర బృంద సభ్యులు పాల్గొన్నారు.