న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, నూతన దంపతులు అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వివాహం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తవడం, ఇవాళే హోలీ పండుగ కావడంతో ఇన్స్టాగ్రామ్లో వారి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. సేమ్ పోస్టును ఇద్దరూ జాయింట్గా షేర్ చేస్తూ ‘హ్యాప్పీ హోలీ ఫ్రమ్ మి అండ్ మై లవ్ టు యూ అండ్ యువర్స్ (నా తరఫున, నా లవ్ తరఫున మీకు, మీ లవ్కు హోలీ పండుగ శుభాకాంక్షలు)’ అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఆ పోస్టులో అభిమానులు మునుపెన్నడూ చూడని మూడు అరుదైన ఫొటోలు ఉన్నాయి. అ ఫొటోల్లో పీచ్ సూట్ సెట్లో కియారా చాలా అందంగా మెరిసిపోతున్నది. సిద్ధార్థ్ కాషాయం కుర్తా ధరించి ఉన్నాడు. కియారా ఫ్లోరల్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ వేసుకుంది. మొదటి ఫొటోలో ఇద్దరూ ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూస్తున్నారు. రెండో ఫొటోలో ఇద్దరూ ముఖాలకు పసుపు రాసుకుని ఫొటోకు ఫోజిచ్చారు. మూడో ఫొటోలో సిద్ధార్థ్ ముఖంపై ఎక్కువగా అంటిన పసుపును కియారా తుడుస్తున్నది.
కాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం గత నెల 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో, అనంతరం ముంబైలో వారు తమ దగ్గరి బంధువులు, స్నేహితులకు విందు ఇచ్చారు. ఈ జంట 2021లో విడుదలైన షేర్షా సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..