Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) పుట్టినరోజు నాడు.. కటౌట్స్ ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలను యశ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘అభిమానుల మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఇలాంటిది జరుగుతుందని ముందే ఊహించే.. నా పుట్టినరోజు నాడు బ్యానర్లు, కటౌట్లు పెట్టడం మానేయాలని ఎన్నోసార్లు కోరాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే ప్రమాదాలను కొని తెచ్చుకోకండ. ఇకపై ఇలా ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు చేయడం మానేయండి. జీవితంలో సంతోషంగా ఉండండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొందరు బైకులపై వేగంగా నా కారును వెంబడించారు. దయచేసి అలా చేయకండి. ఇలా ప్రమాదాలు జరుగుతుండటంతో నాకు పుట్టినరోజు వస్తోందంటేనే భయమేస్తోంది. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాల బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు.
అనంతరం ఇదే ఘటనలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు యువకులను కూడా యశ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఆయన తాను ఉన్నానన్న భరోసాఇచ్చారు. వారి వైద్య ఖర్చులు మొత్తం యశ్ చెల్లించినట్లు తెలుస్తోంది.
కాగా, యశ్ నిన్న 38వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక (Karnataka)లోని గడగ్ (Gadag) జిల్లాలో కొందరు అభిమానులు నటుడి బ్యానర్ (banner) ఏర్పాటు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సినిమాల విషయానికొస్తే.. యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ (Toxic) అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ లాంటి భారీ హిట్ తర్వాత యశ్ నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read..
White House | అమెరికా అధ్యక్ష భవనం గేటుపైకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి అరెస్ట్
Coronavirus | 4 వేల దిగువకు క్రియాశీల కేసులు.. 24 గంటల్లో 475 మందికి పాజిటివ్
IndiGo | ప్రయాణికులకు షాకిచ్చిన దేశీయ విమానయాన దిగ్గజం.. సీట్ల ఎంపిక ఛార్జీలు భారీగా పెంపు