డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్ దంపతులు ఆమెను లీగల్ నోటీసులు పంపించారు. తమిళనాడు ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో ఏనుగుల సంరక్షకులుగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల యథార్థ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా తీసే సమయంలో తమకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పిన దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ అనంతరం మాట తప్పారని బెల్లీ, బొమ్మన్ దంపతులు నోటీస్లో పేర్కొన్నారు. ‘ఇల్లుతో పాటు చిత్ర వసూళ్లలో కొంత భాగం, మా మనవరాలి చదువుకు కావాల్సిన సాయాన్ని కూడా అందిస్తామని మాటిచ్చి మోసం చేశారు. అయితే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ విషయాలను మేము వెల్లడించలేం’ అని బెల్లీ, బొమ్మన్ దంపతులు తెలిపారు. అయితే వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలని చిత్ర నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. భారత్ నుంచి ఆస్కార్ గెలుచుకున్న ఓ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.