హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్స్, విద్యుత్వాహన రంగంలో వచ్చే నాలుగేండ్లలో 3 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకొన్నామని వెల్లడించారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రాధాన్యరంగంగా పరిగణిస్తున్నదని తెలిపారు. తెలంగాణను ప్రపంచానికే ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో గమ్యస్థానంగా మార్చటానికి కృషి చేస్తున్నామన్నారు. విద్యుత్తు వాహనాలు, ఇంధన నిల్వల కోసం దివిటిపల్లి, చందన్వెల్లిలో మరో రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, విద్యుత్వాహన రంగాల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందంతోపాటు స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేశామని చెప్పారు.
ఆరేండ్లలో రూ.23 వేలకోట్ల పెట్టుబడులు
టాస్క్ ద్వారా ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం)లో యువతకు శిక్షణ ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 60 వేలమందికి శిక్షణ ఇవ్వగా.. వారిలో 30 వేలమందికి ఉపాధి కల్పించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీరంగంలో గత ఆరేండ్లలో సుమారు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుముందు ఈ రంగంలో కేవలం 50 వేల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు 2.10 లక్షలకు పెరిగాయని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత 1.60 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించామని వివరించారు. కరోనా భయం ఉన్నప్పటికీ గడిచిన ఒక సంవత్సర కాలంలోనే ఈ రంగంలో 40 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో మూలధన సబ్సిడీ రూపంలో రూ.2 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు, జీఎస్టీ రీయింబర్స్మెంట్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, విద్యుత్తు సబ్సిడీలు ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల కోసం పాలసీలో ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లలో 40 కంపెనీల స్థాపనకు అనుమతి ఇచ్చామని, వాటి ద్వారా సుమారు 40 వేలమందికి ఉపాధి లభించనున్నదని వివరించారు.
టీఎస్ బీపాస్ ద్వారా 12,943 భవనాలకు అనుమతి
భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతతోపాటు తొందరగా అనుమతులు జారీచేసేందుకు ప్రభుత్వం టీఎస్ బీపాస్ను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విధానం ద్వారా 100 రోజుల్లోనే 12,943 భవన నిర్మాణాలకు అనుమతులు జారీచేసినట్టు చెప్పారు. టీఎస్ బీపాస్లో 600 గజాల వరకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందవచ్చని వెల్లడించారు. 21 రోజుల్లో అనుమతులు రాకపోతే ఆ తర్వాత అనుమతి వచ్చినట్టుగానే పరిగణిస్తామని తెలిపారు. కేపీహెచ్బీ కాలనీలో ఇండ్ల పునర్నిర్మాణానికి ఉచితంగా అనుమతులు జారీ చేయాలన్న ఎమ్మెల్యే కృష్ణారావు విజ్ఞప్తిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. టౌన్ప్లానింగ్ విభాగంలో ఇప్పటికే 200 పైగా పోస్టులు మంజూరు చేసి టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఈ పోస్టుల భర్తీ తర్వాత భవన నిర్మాణ అనుమతులు మరింత వేగంగా లభిస్తాయని వెల్లడించారు.