టాలీవుడ్ హీరో రాజశేఖర్ (Rajashekar) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు శేఖర్ (shekar). జీవితారాజశేఖర్ (Jeevitha Rajashekar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టు మే 20న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ..శేఖర్ సినిమాకు ముందు నేను ఆస్తులు కొనుగోలు చేశా. కానీ ఇపుడు ఆస్తులు కోల్పోయా. ఈ సినిమా వర్కవుట్ కాకపోతే మళ్లీ మిగిలేవన్నీ అప్పులే. శేఖర్ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నా. ప్రేక్షకులు కేవలం థియేటర్లలోకి వచ్చి సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. మిమ్మల్ని నిరాశపరచనని హామీనిస్తున్నానన్నాడు. .
‘ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు కోవిడ్ 19తో ఆస్పత్రిలో చేరాడు రాజశేఖర్. ఇదే విషయం గురించి మాట్లాడుతూ..ఇక నేను అయిపోయాననుకున్నా. జోసెఫ్ తెలుగు రీమేక్ రైట్స్ అమ్మమని నా భార్య జీవితకు చెప్పా. మళ్లీ నేను పూర్తిగా కోలుకోలేనని ఆమెకు చెప్పా. ఇంతకుముందు లాగా నటించలేనని చెప్పా. నేను మళ్లీ సాధారణ జీవితంలోకి చేరుకుని, మునుపటిలా నటిస్తానని జీవితా నాకు భరోసానిచ్చింది. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి నా ఫ్యామిలీ, ప్రత్యేకించి నా కూతుళ్లు శివాని, శివాత్మిక చాలా సపోర్టుగా ఉన్నారని’ చెప్పుకొచ్చాడు.
రాజశేఖర్ 91వ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.