Rinky Chakma | మాజీ మిస్ ఇండియా త్రిపుర (Miss India Tripura) రింకీ చక్మా (Rinky Chakma) కన్నుమూశారు. గత రెండేళ్లుగా క్యాన్సర్ (Cancer)తో పోరాడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం రింకీ వయసు 28 ఏళ్లు.
త్రిపురకు చెందిన రింకీ చక్మా.. 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచారు. రెండేళ్ల క్రితం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. అందుకోసం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. మొదట తగ్గినప్పటికీ.. ఆతర్వాత మళ్లీ పెరగడం ప్రారంభించింది. వ్యాధి క్రమంగా ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 22న తీవ్ర అస్వస్థతకు గురైన రింకీని కుటుంబ సభ్యులు హుటాహుటిని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
2022 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న రింకీ చక్మా.. ఎప్పుడూ దాని గురించి బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, చికిత్సకు డబ్బుల కోసం ఆ విషయాన్ని బయటికి చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కొన్నివారాల క్రితం సోషల్ మీడియా వేదికగా తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వెల్లడించింది. ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటూ సుదీర్ఘ పోస్టు పెట్టింది. తాను రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది. దీంతో ఆమె స్నేహితులు తోటి మిస్ ఇండియా పోటీ సహచరులు నిధులు కూడా సేకరించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలను నిలపలేకపోయారు. ఆరోగ్యం క్షీణించి రింకీ ప్రాణాలు కోల్పోయింది.
రింకీ చక్మా క్యాన్సర్తో మరణించిన విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ధ్రువీకరించింది. 2017 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న రింకీ చక్మా.. మిస్ బ్యూటీ విత్ పర్పస్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ ఏడాది హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు.
Also Read..
Mamata banerjee | మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తే వంటగ్యాస్ రూ.2 వేలకు పెరగొచ్చు : మమతా బెనర్జీ
Lok Sabha | వంద మందితో బీజేపీ తొలి లిస్ట్.. నేడు ఏక్షణమైనా రిలీజ్ కావొచ్చు