తెలుగు చిత్రసీమలో కొత్తదనానికి పట్టం కట్టే హీరోల్లో నాగార్జున ఒకరు. నూతన దర్శకుల్ని, నవ్యమైన కథాంశాల్ని నమ్మి సినిమాలు చేస్తూ నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ప్రయాణంలో రిస్క్లు ఎదురైనా తన పంథాను మాత్రం మార్చుకోలేదాయన. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకుడు. రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగార్జున పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
మీ కెరీర్లో ఈసినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
ఇందులో నేను విజయ్ వర్మ అనే ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తా. మంచి భర్త, తండ్రి, టీమ్లీడర్గా భిన్న పార్శాలతో నా పాత్ర సాగుతుంది. దేశాన్ని అమితంగా ప్రేమించే అతడు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. స్నేహానికి విలువనిస్తాడు. రియల్లైఫ్లో నా ఆలోచనలకు, అభిప్రాయాలకు కొంత దగ్గరగా ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించా.
ఎన్ఐఏ అధికారి పాత్ర కోసం ఎలాంటి పరిశోధన చేశారు?
ఈ సినిమా కోసం నా కంటే దర్శకుడు అహిషోర్ సాల్మన్ ఎక్కువగా రీసెర్చ్ చేశాడు. నిజమైన ఎన్ఐఏ అధికారులను కలిశాడు. సర్జికల్ స్ట్రైక్స్లో పాల్గొన్న ఆర్మీ మేజర్ మాతో కలిసి సెట్స్లో ఉంటూ టీమ్కు ఎన్నో సలహాలిచ్చారు. దేశంలో బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడిన ఓ ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఆరుగురు ఎన్ఐఏ బృందం సాగించే అన్వేషణతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది.
యాక్షన్ కథల్ని ఎంచుకునే విషయంలో మీ వయసును దృష్టిలో పెట్టుకుంటారా?
ప్రస్తుతం నా వయసు 31 మాత్రమే(నవ్వుతూ). ఫిట్నెస్కు నేను అమితంగా ప్రాధాన్యతనిస్తా. అందుకే యాక్షన్ సినిమా చేయడం కష్టమేమీ కాలేదు. చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఎదురయ్యాయి.
వందో సినిమా కోసం ఎలాంటి కసరత్తు చేస్తున్నారు?
వందో సినిమా కోసం నేను చాలా లెక్కలు వేసుకుంటున్నా. వందో సినిమాగా కేవలం హీరోగా చేసిన సినిమాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలా? అతిథి పాత్రలు చేసినవి కలపాలా అనేది ఆలోచిస్తున్నా. ఏది పెద్ద హిట్ అవుతుందో దానినే వందో సినిమాగా ప్రకటిస్తా(నవ్వుతూ).
లాక్డౌన్ తర్వాత షూటింగ్లో పాల్గొనే సమయంలో భావోద్వేగానికి లోనయ్యానని ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు?
నటుడిగా మారిన తర్వాత ఖాళీగా ఒక్క రోజు కూడా లేను. ప్రతిరోజు ఏదో ఒక పనిచేస్తూనే ఉంటా. కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఎనిమిది నెలల పాటు బందీ అయిపోవాల్సివచ్చింది. లాక్డౌన్ తర్వాత కులుమనాలి షూటింగ్కు వెళ్లగానే ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికిన ఫీలింగ్ కలిగింది. కరోనా పరీక్షలు చేసుకున్న తర్వాత మాస్కులు తీసి పక్కనపెట్టాం. జైలు నుంచి విడుదలైనట్లనిపించింది. ఆ క్షణం కళ్లల్లో నీళ్లు వచ్చాయి. షూటింగ్ పూర్తయిన అక్కడి నుండి రావాలని అనిపించలేదు.
‘శివ’ తరహాలో ఈసినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందని అనుకోవచ్చా?
‘శివ’తో ఈ సినిమాను పోల్చలేను. ‘శివ’ తీస్తున్న సమయంలో ఆ సినిమా సంచలనం సృష్టిస్తుందని మేము అనుకోలేదు. విడుదలకు ముందు ఫలానా సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేరు. కొత్తగా తీయడం వరకే మన బాధ్యత. సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అవన్నీ వర్కవుట్ అయితే సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నా పాత్ర పవర్ఫుల్గా సాగుతుంది. మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటిభాగం చిత్రీకరణ పూర్తయింది. తెలుగులో ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నా. ఈ నెల 7 నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ మొదలుపెట్టే ఆలోచన ఉంది. తనయులు అఖిల్, నాగచైతన్యలతో సినిమాలు చేయాలని ఉంది. నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్లో హీరో వైష్ణవ్తేజ్తో ఓ సినిమా నిర్మించబోతున్నా. కొత్త దర్శకుడు చెప్పిన కథ వైష్ణవ్కు నచ్చింది. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. రాజ్తరుణ్తో చేస్తున్న మరో సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇవి కూడా చదవండి: