‘గతంలో తెలుగు తెరపై వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. నవ్విస్తూనే ఆద్యంతం భయపెడుతుంది’ అని అన్నారు మోనీష్ పత్తిపాటి. ఎంపీ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘కథ కంచికి మనం ఇంటికి’. అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించారు. చాణక్య చిన్న దర్శకుడు. ఈ సినిమా విశేషాల్ని నిర్మాత మోనీష్ పత్తిపాటి తెలియజేస్తూ ‘మా తాతయ్య పోకూరి బాబురావు, పెదనాన్న భీమనేని శ్రీనివాసరావు ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించారు. వారి వల్లే నాకు సినిమాలపై ఆసక్తి మొదలైంది. మంచి సినిమా తీయాలనే ప్రయత్నంలో ఉండగా కొరియోగ్రాఫర్ చాణక్య చెప్పిన పాయింట్ నన్ను ఆకట్టుకుంది. హారర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా చేశాం. అదిత్, పూజిత పాత్రలు వినూత్నంగా ఉంటాయి. కొందరు యువతీయువకుల కథ ఎలా కంచికి చేరిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్కు చక్కటి స్పందన లభిస్తోంది. గ్రాఫిక్స్తో పాటు యాక్షన్ అంశాలకు ప్రాధాన్యముంటుంది. జూన్ 11న సినిమాను విడుదలచేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హేమంత్, గెటప్శ్రీను పాత్రలకు ప్రాధాన్యముంటుంది. ప్రియమణి కథానాయికగా ప్రసన్నకుమార్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నా. ఉగాదికి ఈ సినిమా వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆ క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి