గంగాధర, జూన్ 3 : తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని, తాటతీస్తామని జనసేన అధినేత పవన్కళ్యాణ్ను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. తెలంగాణ బరాబర్ మా జాగీరేనని, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమికొడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదకొండు రోజులు అన్నం తినలేదని చెప్పిన ఆయన, ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉన్నట్టు నటించడం విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణ మీద పవన్ కళ్యాణ్కు ఉన్నది ప్రేమ కాదని, కేవలం డ్రామా మాత్రమేనని విమర్శించారు. ఆయన డ్రామాలు ఆంధ్రా ప్రజలకు వినసొంపుగా ఉండొచ్చని, తెలంగాణ ప్రజలకు కాదని చెప్పారు. డ్రామాలు సినిమాలో చెసుకోవాలని, ఇక్కడ కాదని హితవు పలికారు.