మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగి కూడా మూడు రోజులు అయిపోయింది. అయినా కూడా దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. సెప్టెంబర్ 11న అనారోగ్యంతో మరణించిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు దశదినకర్మ అయిపోయిన తర్వాత సొంతూరు మొగల్తూరు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో కుటుంబ సభ్యులతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు రెబల్ స్టార్ అభిమానులు లక్షలాది మంది హాజరయ్యారు.
ముఖ్యంగా ప్రభాస్ 12 సంవత్సరాల తర్వాత సొంతూరుకి రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి ఎగబడ్డారు. అంత బాధలో కూడా వచ్చిన ప్రతి అభిమానిని భోజనం చేశారా అని ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అడిగిన తీరు చూసిన తర్వాత రాజులు ఎక్కడున్నా రాజులే అబ్బా అంటూ పొగడ్తల వర్షం కురుస్తుంది.
మరోవైపు ఈ వేడుకలో భోజనాల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రాజుల భోజనాలు ఎలా ఉంటాయో పుస్తకాల్లో చదవడం తప్ప బయట తెలియదు అన్న వాళ్లకు.. ఒకసారి కృష్ణంరాజు సంస్మరణ సభలో పెట్టిన భోజనాలు చూస్తే తెలుస్తుంది. మొత్తం నాన్ వెజ్ కలిపి దాదాపు 50 టన్నుల వరకు ఇందులో వడ్డించారు. అంటే 5000 కిలోల మాంసం అనమాట. అందులో చికెన్, మటన్ తో పాటు చేపలు, రొయ్యలు, పీతలు ఇలా అన్నీ ఉన్నాయి. వీటి కోసం దాదాపు 3,000 మంది చెఫ్ లు పనిచేశారు. దాదాపు లక్ష ఇరవై వేల మంది భోజనం చేసినట్టు తెలుస్తోంది.
కేవలం భోజనాల కోసమే 4.7 కోట్లు ప్రభాస్ ఖర్చు చేశాడని.. తన పెదనాన్నకు ఇష్టమైన ప్రతి వంటకాన్ని అభిమానులకు రుచి చూపించాడని సన్నిహితులు చెబుతున్నారు. కేవలం భోజనాల కోసమే 5 కోట్లు ఖర్చు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ అక్కడ ఉన్నది రాజులు కాబట్టి వాళ్ల భోజనాలు కూడా అలాగే ఉంటాయి. మర్యాదలు కూడా అలాగే ఉంటాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణంరాజు సంస్మరణ సభలో కూడా ఇదే జరిగింది. తాజాగా భోజనాల ఖర్చు తెలిసిన తర్వాత అందరూ నోరెళ్ల పెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..