మొదటి మేజర్కూ నీళ్లివ్వలేకపోయిన జానా
వరద కాల్వను రెండేండ్లలోనే పూర్తి చేసినం
రాజవరం, సూరేపల్లి, ముదిమాణిక్యం చివరి భూములు సస్యశ్యామలం
ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి
అభివృద్ధికి చిరునామా తెలంగాణ : మంత్రి శ్రీనివాస్గౌడ్
హాలియాలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం
మైనార్టీలతో హోంమంత్రి మహమూద్ అలీ ఆత్మీయ సమావేశాలు
గుర్రంపోడు, ఏప్రిల్ 4 : ‘నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లున్నా.. కాంగ్రెస్ హయాంలో జానారెడ్డి మంత్రిగా ఉండి కూడా ఎడమ కాల్వ ఆయకట్టుకు ఎన్నడూ సరిగ్గా నీళ్లు ఇవ్వలేకపోయారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రాజవరం, సూరేపల్లి, ముదిమాణిక్యం మేజర్ల చివరి భూములకు నీళ్లందుతున్నాయి. 15 ఏండ్లు నత్తనడకన సాగిన వరద కాల్వ పనులను రెండేండ్లలో పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య ఎనలేని కృషి చేశారు. ఆయన కుమారుడు భగత్ను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి సాగర్ నియోజకవర్గంలో ఆదివారం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రులు మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్ వివిధ మండలాల్లో ప్రచారాలు నిర్వహించారు.
“పని చేయని నాయకులను గెలిపిస్తే ఒరిగేది శూన్యం.. 7సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన జానారెడ్డి 11శాఖలకు మంత్రిగా చేసినా ఇప్పటికీ ఆయకట్టులో లక్ష ఎకరాలు బీడు పడింది.. కాంగ్రెస్ పార్టీ, జానారెడ్డే ఇందుకు కారణం.. ప్రజలు ఆలోచించాలి… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి పంపిన నోముల భగత్ను గెలిపించండి.. మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం..” అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గుర్రంపోడు మండలం తానేదార్పల్లి, జిన్నాయిచింత, పల్లిపహాడ్, బ్రాహ్మణగూడెం, కోనాయిగూడెం, గుర్రంపోడు, చేపూర్, తేరాటిగూడెం, కొత్తలాపురం, మొసంగి గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
ఇంటింటికీ సంక్షేమం..
60ఏండ్ల పరాయి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆకలి కేకలు, ఆత్మహత్యల నిలయంగా మారిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకతో బీళ్లకు నీళ్లు పారుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నది టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ధరల భారం మోపుతున్నదని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నదని మంత్రి విమర్శించారు. నోముల నర్సింహయ్యను గెలిపించినట్లుగానే భగత్ను కూడా ఆశీర్వదించాలని, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఉప ఎన్నికల మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, చకిలం అనిల్కుమార్, పాశం గోపాల్రెడ్డి, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్రావు, సయ్యద్మియా, ధనంజయ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
హెయిర్సెలూన్లు, దోభీఘాట్లకూ ఉచిత విద్యుత్
గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ యూసేజీ అంత వీజీకాదు.. ఎందుకంటే!
ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ఇస్తే సరి.. పీఎఫ్ ఖాతా వివరాలు రెడీ