Lata Mangeshkar | కోకిల కలకూజితం ఆమని ఆగమనానికి సంకేతంలా.. గానకోకిల లతామంగేష్కర్ స్వరప్రస్థానం భారతీయ సంగీత జగత్తులో ఓ నవ్య శకానికి నాందివాచకం పలికింది. ఆమె సరిగమల ప్రయాణం బిందువు సింధువులా మారిన వైనాన్ని స్ఫురణకు తెస్తుంది. ఏడు దశాబ్దాల సంగీత ప్రయాణం..వేవేల గీతాలు..ప్రతి పాట తేనెలూరించిన ఓ రసగుళిక. ఆ గళంలో లాలిత్యం ప్రణవనాదమై ఎన్నెన్నో ప్రణయగీతాలకు జీవం పోసింది. ఆమె గాత్రంలోని మార్దవం పొలబారిన హృదయాల్లో తడిఆశల్ని చిగురింపజేసింది. ‘ఏ మేరె వతన్ కీ లోగో..’ అంటూ ఆర్థ్రరసపూరిత దేశభక్తి గీతంలా..‘దీదీ తేరా దేవర్ దీవానా..’ అంటూ సరస భావవీచికలా సంగీతప్రియుల హృదయాలపై గానామృతాన్ని వర్షించింది. ‘అజీబ్ దాస్తా హై యే..కహా షురూ, కహా ఖతమ్’…అనే పాట భావంలా ఆమె అద్భుత అసాధారణ గాథను ఎక్కడ మొదలుపెట్టాలి..ఎక్కడ ఆపాలి?. లతామంగేష్కర్ గానం ఆద్యంతాలులేని ఓ అమృతవాహిని. కోట్లాది భారతీయ హృదయాల్లో..అనంత సంగీత దిగంతాల్లో ఆమె గళం అమరగానమై వినిపిస్తూనే ఉంటుంది.
1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దీనానాథ్ మంగేష్కర్, శేవంతి మంగేష్కర్ దంపతులకు లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్కు రంగస్థల కళాకారుడిగా, సంగీతకారుడిగా మంచిపేరు ఉండేది. లతకు తండ్రి తొలుత హేమ అనే పేరు పెట్టారు. అది నచ్చకపోవడంతో తాను రాసిన ‘భవబంధన్’ అనే నాటకంలోని ‘లతిక’ అనే పాత్ర ఆధారంగా ఆమె పేరును లతగా మర్చారు. అయిదవ ఏట నుంచే తండ్రి వద్ద లతామంగేష్కర్ సంగీతంలో శిక్షణ తీసుకోవడం ఆరంభించింది. తండ్రి నాటకాల్లో సంగీతప్రధానమైనవి ఉన్నప్పుడు వాటిలో లతా నటించడమే కాకుండా పాటలు కూడా పాడేది. ఐదేళ్ల వయసు నుంచే సంగీతంపట్ల శ్రద్ధాసక్తులు కనబరిచేది లతామంగేష్కర్. పాఠశాలలో తన సహచర విద్యార్థులకు పాటలు ఎలా పాడాలో నేర్పించేది. పిల్లలు పాఠాలు నేర్చుకోకుండా పాటలు పాడిస్తుందనే నెపంతో చిన్నారి లతా మంగేష్కర్ను స్కూల్కు రావొద్దని చెప్పారు. దీంతో పాఠశాల చదువుకు స్వస్తిపలికి సంగీతాన్నే జీవన సాధనగా ఎంచుకుంది. రాగాలతోనే సహవాసం చేసింది. శృతి, లయలే ఉఛ్వాసనిశ్వాసలుగా స్వరగంగా ప్రవాహమై సాగిపోయింది.
13ఏటనే తండ్రి మరణం…
లతా మంగేష్కర్ పదమూడేళ్లు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. దాంతో కుటుంబభారం మొత్తం ఆమెపై పడింది. చెల్లెల్లు మీనా, ఆశా, ఉషా..తమ్ముడు హృదయనాథ్ అందరూ చిన్నపిల్లలే. ఓ వైపు కుటుంబాన్ని షోషించడం..మరోవైపు తన సంగీతసాధన నడుమ లతామంగేష్కర్ సతమతమైంది. ఈ క్రమంలో తొలుత నటిగా కెరీర్ను ఆరంభించింది. మరాఠీ చిత్రం ‘పహ్లా మంగళ గౌర్’లో కథానాయిక చెల్లెలుగా నటించడంతో పాటు రెండు పాటలు పాడింది. అనంతరం ‘చిముక్లా సుసార్’ (1943), గజెభావు (1944), జీవన్యాత్ర (1946), మందిర్ (1948) వంటి చిత్రాల్లో నటించింది. తండ్రి చనిపోయిన ఐదేళ్ల వరకు నటనతో పాటు పాటలు పాడుతూ జీవితాన్ని లాక్కొచ్చింది లతామంగేష్కర్. దిగ్గజ గాయనీమణులు నూర్జహాన్, షమ్షాద్బేగం తెరను ఏలుతున్న రోజులవి. ఖంగునమ్రోగే వారి స్వరవిన్యాసాల నడుమ లతా మంగేష్కర్ గళం కాస్త పీలగా అనిపించేది. దాంతో కెరీర్ ఆరంభంలో ఆమె ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నారు.
గాయనిగా ప్రస్థానం మొదలైందిలా..
గానకోకిలగా భారతీయ సంగీతప్రియుల్ని ఏడు దశాబ్దాల పాటు ఓలలాడించిన లతామంగేష్కర్ తొలుత ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నారు. శశిధర్ ముఖర్జీ అనే దర్శకుడు లతా మంగేష్కర్ గొంతు పాటలు పాటడానికి పనికిరాదని పీలగా ఉందని విమర్శించారు. అనంతరకాలంలో తనను తిరస్కరించిన నోళ్లతోనే కీర్తించేలా ఎదిగారు లతా మంగేష్కర్. 1942లో వచ్చిన మరాఠీ చిత్రం ‘కిటీ హాసల్’లో లతామంగేష్కర్ తొలి గీతాలాపన చేశారు. అయితే ఈ పాటను అనుకోని కారణాలతో సినిమా నుంచి తొలగించారు. 1945లో తండ్రి స్నేహితుడు, నవయుగ చిత్రపట్ కంపెనీ ఓనర్ అయిన వినాయక్ దామోదర్ సహకారంతో లతామంగేష్కర్ ముంబయిలో అడుగుపెట్టింది. లతామంగేష్కర్ పాడిన తొలి హిందీ పాట ‘మాతా ఏక్ సపూట్ కి దునియా బదల్ దేతూ..’ మరాఠీ చిత్రం ‘గజెభావు’లోనిది కావడం విశేషం. ‘మహల్’ (1949) చిత్రంలో ‘ఆయేగా ఆనేవాలే..’ అనే గీతంతో లతామంగేష్కర్ దశ తిరిగింది. ఇక అక్కడ నుంచి తిరుగులేని గానప్రస్థానంతో భారతీయ సంగీతయవనికనై వెలుగులీనింది.
‘భారతరత్న’ అవార్డు వరకు సాగిన ప్రస్థానం..
దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో లతా మంగేష్కర్ 36 భారతీయ భాషల్లో యాభై వేలకుపైగా గీతాల్ని ఆలపించారు. 1942 నుంచి భారతీయ సినీ సంగీతానికి మకుటం లేని మహారాణిలా విరాజిల్లింది లతామంగేష్కర్. భాషాంతరాల్ని చెరిపివేస్తూ సంగీత, సాంస్కృతిక వారధిగా చెలామణి అయింది. ఆర్థ్రత, లాలిత్యం కలబోసిన కోకిల వంటి కంఠస్వరంతో పాటకు సరికొత్త సొబగులద్దింది. చక్కటి శబ్దమాధుర్యం, భావావేశంతో ఆమె సంగీతగానఝరి అనంతంగా సాగిపోయింది. నాటి మధుబాల నుంచి నేటి ప్రియాంకచోప్రా వరకు ఆమె ఎందరో ప్రముఖ తారలకు నేపథ్యగానాన్ని అందించారు. 1948-78 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో పేరు సంపాదించుకుంది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కీర్తి గడించిన లతామంగేష్కర్ భారత సినీరంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ (2001) వరించింది. 1987లో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుంది. పద్మ భూషణ్ (1969), పద్మవిభూషణ్(1999)తో పాటు అనేకమైన జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ప్రఖ్యాత గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఎక్కువ పురస్కారాలు అందుకున్న గాయకురాలిగా లతామంగేష్కర్ కీర్తిని పొందింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ‘లీజియన్ ఆఫ్ హానర్’ను లతామంగేష్కర్ 2007లో స్వీకరించింది. పరిచయమ్, కోరాకాగజ్, లేకిన్ చిత్రాలకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాల్ని దక్కించుకున్నారు. ‘లేకిన్’ చిత్రానికి గాను 61 ఏళ్ల వయసులో జాతీయ పురస్కారాన్ని దక్కించుకొని చరిత్రను సృష్టించారు. ఏడు ఫిలింఫేర్లతో పాటు పలు రాష్ట్ర అవార్డులు, పలు విదేశీ గౌరవ పురస్కారాల్ని అందుకున్నారు లతా మంగేష్కర్.
సంగీత దర్శకురాలిగా…
నేపథ్య గాయనిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా చిత్రసీమలో తనదైన ముద్రను వేశారు లతా మంగేష్కర్. రామ్రామ్ పవ్హనే, మరాఠా తితుక మెలవ్వవా, మెహిత్యంచి మంజుల, సాధి మనసే, తుంబడి మత.. వంటి మరాఠీ చిత్రాలకు స్వరకర్తగా పనిచేశారు. ఈ సినిమాలన్నింటికి ఆనందఘన్ అనే మారుపేరుతో లతా మంగేష్కర్ సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ‘సాధి మనసే’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు.
రెండు జడల గాత్రం.. చిలిపి గీతం
లతా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజులవి. ఓ రోజు బాంబే టాకీస్ స్టూడియోకు వెళ్లడానికి గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కింది. తర్వాతి స్టేషన్లో ఓ కుర్రాడు అదే రైలు, అదే బోగీ ఎక్కాడు. లత వంక చూస్తూ ఆమె వెనుక సీట్లో కూర్చున్నాడు. ‘ఎవరీ తింగరి?’ అనుకుంటూ చికాకుగా ముఖం పెట్టింది లత. వెనుక సీట్లో కూర్చున్న ఆ యువకుడు కూనిరాగాలు తీయడం మొదలుపెట్టాడు. లత చిరాగ్గా, తల వెనక్కి పంకించి కోపంగా చూసింది. తన రెండు జడలనూ ముందుకు వేసుకుంది. రైలు మాలాడ్ స్టేషన్లో ఆగింది. లత దిగింది. అతగాడూ దిగాడు. ఆమె నడిచింది. వెనకే అతనూ నడిచాడు. ఆమె గుర్రం బగ్గీ ఎక్కింది. ఆ కుర్రాడూ దాన్నే ఫాలో అవుతూ నడిచాడు. బండి బాంబే టాకీస్ స్టూడియో ఎదుట ఆగింది. వెనక్కి తిరిగి చూసింది లత. కనుచూపుమేరలోనే కనిపించాడా కుర్రాడు. కోపం నషాలానికి ఎక్కింది. దగ్గరికి వస్తే కడిగి పారేద్దాం అనుకుంది. అరక్షణంలోనే సమీపించాడతను. ఎందుకొచ్చిన గొడవ అనుకొని చరచరా స్టూడియోలోకి వెళ్లింది లత. ఆమె వెంటే అతనూ వెళ్లాడు. నేరుగా సంగీత దర్శకుడు ఖేమ్చంద్ ప్రకాశ్ దగ్గరికి వెళ్లింది లత. మరు నిమిషంలో ఆ ఉంగరాల జుట్టున్న కొంటె నవ్వులవాడూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘దాదా! చూడండి, ఇతగాడెవ్వడో! అప్పట్నుంచి నన్నే వెంబడిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేసింది లతాదీదీ. ఆ యువకుణ్ని చూసిన ఖేమ్చంద్ పగలబడి నవ్వాడు. ఆ కుర్రాడు మరింత చిలిపిగా నవ్వాడు. ‘బేటీ! ఇతను ఎవరనుకున్నావ్, కిషోర్ కుమార్. మన హీరో అశోక్ కుమార్ తమ్ముడు. ఇతనూ మంచి గాయకుడే’ అని పరిచయం చేశాడు ఖేమ్చంద్. లతకు నవ్వు ఆగలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరూ వందలాది డ్యూయెట్లు కలిసి పాడారు. ఆ పాటలన్నీ జనాన్ని అలరించినవే!
నాలుగేళ్లకు రఫీతో కలిసి
మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కాంబినేషన్ సూపర్హిట్. ఇద్దరూ కలిసి వందలాది డ్యూయెట్లు పాడారు. లతాదీదీ, రఫీసాబ్ని ‘భయ్యా’ అని సంబోధించేది. రఫీ కూడా అంతే ఆప్యాయంగా ఆమెను పలకరించేవాడు. మ్యూజిక్ రికార్డింగ్ సంస్థలు సంగీత దర్శకులతోపాటు గాయకులకూ రాయల్టీ ఇవ్వాలనే చర్చ ఒకసారి తెరపైకి వచ్చింది. ఆ చర్చను లేవనెత్తింది లతాదీదీనే. ఈ విషయంలో లత అభిప్రాయంతో విభేదించాడు రఫీ. ఒకసారి పాడిన తర్వాత ఆ పాటతో గాయకులకు సంబంధం లేదన్నది రఫీసాబ్ వాదన. పాట విజయవంతం కావడంలో భాగమైన గాయకులకు రాయల్టీ రావడం ధర్మమని లతా నిశ్చితాభిప్రాయం. ఇదే విషయమై ఇద్దరి మధ్యా పేచీ ముదిరింది. 1963లో ఓనాడు ఇక ఇద్దరం కలిసి పాడేది లేదని తేల్చేశారు. ఇద్దరి మధ్యా రాజీ యత్నాలు చాలా రోజులు సాగాయి. ఎవరూ బెట్టు వీడలేదు. నాలుగేండ్ల వరకూ కలిసి పాడలేదు ఇద్దరు. ఇక లాభం లేదనుకొని ఇద్దరితో మళ్లీ పాడించాలని నిర్ణయించుకున్నాడు సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. 1967లో ఓ సంగీతవిభావరిలో ఒకేసారి ఇద్దరినీ వేదికపై పిలిచాడు. ‘లత, రఫీ కలిసి పాడే పాట మీ కోసం’ అని ప్రకటించాడు.
నెహ్రూను కంటతడి పెట్టించిన లతా పాట…
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా వినిపించే పాటల్లో ‘ఏ మేరి వతన్ కే లోగో’ పాట ముందువరుసలో ఉంటుంది. దేశభక్తి భావాల్ని ఉప్పొంగించే ఈ పాటను 1962 ఇండో-చైనా యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల స్మ్రత్యర్థం ఆలపించారు. హిందీ కవి ప్రదీప్ రాసిన ఈ గీతాన్ని లతా మంగేష్కర్ ఆలపించారు. సి.రామచంద్ర స్వరరచన చేశారు. 1963 రిపబ్లిక్ డే రోజున న్యూఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణా, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో లతా మంగేష్కర్ ఆలపించారు. ఆర్థ్రత, ఆవేదనభరితమైన గళంతో లతా మంగేష్కర్ ఆలపించిన ఈ పాట వేడుకకు హాజరైన అందరి హృదయాల్ని భావోద్వేగానికి గురిచేసింది. ఈ పాట విన్న నెహ్రూ ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ‘ఈ పాటను విని స్ఫూర్తి పొందని వారు భారతీయులని పిలిపించుకోవడానికి అనర్హులు’అని వ్యాఖ్యానించారంటే ఆ పాట ఆయన్ని ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాట ద్వారా వచ్చిన రెండులక్షల రూపాయల్ని (ఇప్పటి విలువలో దాదాపు కోటిన్నర) సైనిక సంక్షేమ నిధికి అందజేశారు.
దిగ్గజ సంగీత దర్శకులతో
లతా మంగేష్కర్ తన కెరీర్లో దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేశారు. సంగీత దర్శకులు నౌషాద్, మదన్ మోహన్, ఆర్డీ బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ..మొదలు ఏఆర్ రెహమాన్ దాకా అద్భుతమైన పాటలు ఆలపించారు. నౌషాద్ సంగీతంలో ‘మదర్ఇండియా’ చిత్రంలో ‘నగరి నగరి’, ‘మొఘల్ ఏ అజమ్’ సినిమాలో ‘ప్యార్ కియా తో డర్నా క్యా ’ పాటలు ఎవర్గ్రీన్ హిట్గా నిలిచాయి. లతా మంగేష్కర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయం సుమధుర గీతాలతో సంగీత ప్రియుల్ని ఓలలాడించారు. లక్ష్మీకాంత్ సంగీత దర్శకత్వంలో 700 కు పైగా పాటల్ని పాడారు లతా మంగేష్కర్. వీరి కలయికలో వచ్చిన ‘దో రాసే’్త చిత్రంలో బిందియా, ‘బాబీ’ చిత్రంలోని ‘హమ్ తుమ్ ఏక్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ నుంచి ‘హమ్ కో తుమ్సే’, ‘ఏక్ దుజే కే లియే’ సినిమాలో ‘తేరే మేరే బీజ్ మే..’ వంటి పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందడమే కాకుండా పలు అవార్దులు సాధించాయి. మదన్మోహన్ సంగీత దర్శకత్వంలో ‘అన్పధ్’ చిత్రంలోని ‘అప్ కీ నజరో..’, ‘కౌన్ థీ’ సినిమా నుంచి ‘లగ్ జా’ పాటలు సంగీత ప్రియుల్ని అలరించాయి. శంకర్జైకిషన్ సంగీతాన్నందించిన ‘శ్రీ420’ చిత్రంలో ‘ప్యార్ హువా..’, ‘అనారి’ సినిమాలోని ‘దిల్ కి నజర్ సే, వో చాంద్’, ‘దిల్ ఆప్నా ఔర్ ప్రీత్ పరారి’ చిత్రంలోని ‘అందాజ్ మేరా, మేరా దిల్’ వంటి పాటలన్నీ లతాకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఆర్.డి బర్మన్ స్వరకల్పనలో ‘యాదోంకీ బారాత్’ సినిమాలోని ‘యాదోంకీ బారాత్..’, ‘షోలే’ చిత్రంలోని హా జబ్ తక్, హోలీ కె దిన్, ‘మెహబూబా’ సినిమాలోని మేరే నైనా, ఛలో రి ఛలో రి.. గీతాలన్ని విజయవంతమయ్యాయి. ఎస్.డి బర్మన్ సంగీత దర్శకత్వంలో టాక్సీ డ్రైవర్, అభిమాన్, గైడ్, ఆరాధన, ప్రేమ్నగర్ చిత్రాల్లో పాటలు పాడారు లతా మంగేష్కర్. నేటితరంలో బప్పీలహరి ‘చల్తే చల్తే’ చిత్రంలోని చల్తే చలే, ఏ.ఆర్ రెహమాన్ ‘దిల్ సే’ సినిమాలోని జియా జలే, ‘రంగ్ దే బసంతి’ సినిమాల్లో శ్రావ్యమైన పాటల్ని ఆలపించారు లతా మంగేష్కర్. సలీల్ చౌదరి, కల్యాణ్జీ ఆనంద్జీ, రాజేష్ రోషన్, జగ్జీత్ సింగ్, హృదయనాథ్ మంగేష్కర్, ఆనంద్ మిలింద్, నదీమ్ శ్రావణ్, జతిన్ లలిత్, అనుమాలిక్ వంటి బాలీవుడ్లోని సంగీత దర్శకులందరి సినిమాల్లో పాటల్ని పాడిన ఏకైక గాయని లతా మంగేష్కర్. కిషోర్కుమార్, మహ్మద్ఫ్రీ, ఎస్.సి.బాలసుబ్రహ్మణ్యం, అశాభోంస్లే, ముఖేష్, కవితా కృష్ణమూర్తి, అమిత్కుమార్, ఏసుదాస్, భూపిందర్సింగ్, జతిన్సింగ్, హరిహరన్ ఇలా ఎంతో మంది గాయకులతో పోటీపడి పాటల్ని ఆలపించారు. తరం ఏదైనా, నాయికలు ఎవరైనా స్వరం మాత్రం లతా మంగేష్కర్దే వినిపించేది. కాలం మారినా చెక్కు చెదరని గాత్రం ఆమెది.
విష ప్రయోగం తాలూకు భయంకర రోజులు
అరవైయ్యవ దశకం తొలినాళ్లలో లతామంగేష్కర్ కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. సుమధుర గాత్ర మాధుర్యంతో యావత్ సంగీతప్రియుల్ని ఓలలాడిస్తున్న తరుణంలో లతామంగేష్కర్పై అనూహ్యంగా విషప్రయోగం జరగడం సంచలనం రేపింది. 1963లో లతామంగేష్కర్పై ఆహారం ద్వారా విషప్రయోగం జరిగింది. తీవ్రమైన వాంతులతో అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెకు ఎవరో ఆహారంలో విషం కలిపి ఇచ్చారని వైద్యులు ధృవీకరించారు. విషప్రయోగం నుంచి కోలుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. ఆ తర్వాత కూడా ఆమె కొన్ని వారాల పాటు నీరసంగా ఉండిపోయారట. ఆమెకు స్వాంతన చేకూర్చడానికి నాటి గేయ రచయిత సుల్తాన్ ప్రతి రోజు లతా మంగేష్కర్ ఇంటికి వెళ్లి కవితలు, హాస్యకథలు చెబుతూ ఊరడించేవారట. ఆమె తినే ఆహారపదార్థాలను కూడా ఆయనే తనిఖీ చేసేవారట. సుల్తాన్ ప్రోత్సాహంతో విషప్రయోగం తాలూకు భయంకర ఘటన నుంచి లతామంగేష్కర్ కోలుకుంది. లతామంగేష్కర్ ఉన్నతిని ఓర్వలేని సంగీతరంగ ప్రత్యర్థులే వంటవాళ్లతో ఆమెపై విష ప్రయోగం చేయించారని తెలిసింది.
తెలుగులో రెండు సినిమాలు..
లతా మంగేష్కర్ గొంతు పలకని భాష లేదు. భారతీయ భాషలన్నింటిలో ఆమె పాటల్ని పాడారు. హిందీతో పాటు మరాఠీ, తమిళం, మలయాళం, ఒడియా, అస్సామీ, పంజాబీ, బెంగాలీతో పాటు విదేశీ భాషల్లో పాటలు పాడి చరిత్రను సృష్టించారు. తెలుగులో సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తిపై ఉన్న అభిమానంతో తొలిసారిగా ‘సంతానం’ సినిమాలో ‘నిదురపోరా తమ్ముడా..’ అనే జోల పాటను ఆలపించారు. ఈ గీతం అప్పట్లో విశేషాదరణను చూరగొన్నది. ఆ తర్వాత ఇళయరాజా స్వరసారథ్యంలో వచ్చిన ‘ఆఖరిపోరాటం’ చిత్రంలో ‘తెల్లచీరకు తకధిమి’ అనే పాటను పాడారు లతా. సలీల్ చౌదరి కోరిక మేరకు మలయాళంలో ‘నెల్లు’ చిత్రంలో ‘కడలి..’అనే గీతాన్ని ఆలపించారు. తమిళంలో నౌషద్ స్వరనిర్దేశంలో మురట్టు అడియల్తో పాటు ఇళయరాజా సంగీతంలో ఆనంద్, సత్య, ఎన్ జీవన్ పడుతూ చిత్రాల్లో పాటల్ని పాడారు.
భారత కోకిల, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఇక లేరంటే గుండె పగిలిపోతున్నది. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు తీర్చలేనిది. లతాజీది అసాధారణ జీవితం. సంగీతం ఉన్నంతవరకు ఆమె పాట మనతోనే ఉంటుంది. లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలి.
– మెగాస్టార్ చిరంజీవి
భారతీయ సినీ సంగీతంలో ధృవతారగా వెలిగిన గానకోకిల లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారనే వార్త తీవ్ర ఆవేదన కలిగించింది. లతాజీ పాటకు భాషా బేధం లేదు. ఆమె ప్రతి పాటా మంత్రముగ్ధులను చేసింది. లతాజీ స్వరం దైవదత్తం. ఆమెకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నా. లతాజీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– పవన్ కళ్యాణ్
లతా మంగేష్కర్ మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది. దేశం గర్వించదగిన ముద్దుబిడ్డ ఆమె. లతాజీ పాట వినిపించని ఇల్లు లేదు, ఆమె పాటను ఇష్టపడని వ్యక్తి లేరు. తను పొందని పురస్కారాలు లేవు. లతాజీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
– బాలకృష్ణ
లతాజీ ఇక లేరన్న వార్తతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆమె మృతి దేశానికి పూడ్చలేని లోటు. ఆ పాటల రాణి మన హృదయాల్లో చిరకాలం నిలిచిఉంటారు. తరతరాల గాయనీ గాయకులకు స్పూర్తిని పంచుతూనే ఉంటారు.
– ఎన్టీఆర్
భారతీయ సంగీతాన్ని తరాలుగా నిర్వచించారు లతాజీ. ఆమె సాధించిన ఘనత, ఖ్యాతి అనితరసాధ్యం. మరొక లతాజీని ఊహించలేం. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– మహేష్ బాబు
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
1950ల్లో ఒక్కో పాటకు లతాజీ ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు..?
లతా మంగేష్కర్ పెండ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి.. ఒంటరిగా ఎందుకు ఉండిపోయారు..?
పాట పాడుతూ కింద పడిపోయిన లతా మంగేష్కర్.. ఈ సంఘటన గురించి తెలుసా..?
Lata Mangeshkar | సినీ అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే లతా మంగేష్కర్ పాటలు ఇవే
Lata Mangeshkar | తెలుగులో మూడే పాటలు పాడిన లతా మంగేష్కర్.. కారణం ఏంటో తెలుసా?
Lata Mangeshkar | వరల్డ్ కప్ గెలిచిన జట్టును లత ఎలా ఆదుకున్నారంటే…
Latha didi: ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం లతాజీ..