ప్రస్తుత ప్రపంచ క్రికెట్ రంగంలో బీసీసీఐకి ఓ ప్రత్యేక స్థానం. దాని ఆర్థిక వనరులు… పలుకుబడి.. మరే ఇతర క్రికెట్ బోర్డులకు లేదు. అంతగా ఆర్థిక పుష్టితో బలమైన బోర్డుగా బీసీసీఐ నిలబడింది. కానీ.. మొట్ట మొదటిసారిగా భారత క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిన సమయంలో బీసీసీఐ అంత పెద్దది కాదు. ఆటగాళ్లకు ఇవ్వాల్సిన అలవెన్సులు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. అలాంటి సమయంలో కపిల్ దేవ్ నేతృత్వంలో భారత జట్టు వరల్డ్కప్ గెలుచుకుంది. దీంతో భారతీయులకు, అటు బీసీసీఐకి చెప్పలేనంత ఆనందం. అప్పటికి దేశంలో ఆర్థిక సరళీకృత విధానాలు రాలేదు. దేశంలో డబ్బుల పరిస్థితి అంతంతే. అయినా సరే.. వరల్డ్ కప్ తెచ్చిన జట్టుకు ఏదో ఒకటి చేయాలని అప్పటి క్రీడా మంత్రి ఎన్కేపీ సాల్వే భావించారు. ఇదే ఆలోచనతో బీసీసీఐ దిగ్గజమైన రాజ్సింగ్ డంగార్పూర్ దగ్గరికి వెళ్లారు.
దీంతో రాజ్సింగ్ డంగర్పూర్కు ఓ ఆలోచన తట్టింది. ప్రముఖ గాయనీ, గాన కోకిల లతా మంగేష్కర్తో ఓ కచేరీ పెట్టాలని నిర్ణయించారు. రాజ్సింగ్కు, లతా మంగేష్కర్తో సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయన చొరవ తీసుకొని, ఈ విషయాన్ని అడగ్గా… ఆమె వెంటనే ఒప్పుకున్నారు. లతా మంగేష్కర్కు క్రికెట్ ఆట అంటే వల్లమాలిన అభిమానం. దీంతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరీ నిర్వహించారు. ఇసుక రాలనంత జనం ఈ కచేరీకి హాజరయ్యారు. 2 గంటల పాటు లతా మంగేష్కర్ తన గానంతో ప్రజల్ని మంత్రముగ్ధులు చేసేశారు. లతా మంగేష్కర్ నిర్వహించిన ఈ కచేరీతో బీసీసీఐకి డబ్బులు వచ్చాయి. వరల్డ్కప్ జట్టులో మొత్తం 14మంది ఆటగాళ్లకు లక్ష రూపాయల చొప్పున బీసీసీఐ ఇచ్చింది.