గాన కోకిల ‘భారతరత్న’ లతా మంగేష్కర్.. త్యాగం, అంకితభావం, పోరాటానికి మారుపేరుగా నిలిచారు. ఆమె జీవితంపై నాలుగైదు భాగాల్లో సినిమాలు తీసేందుకు కావల్సినంత సమాచారం ఆమె జీవితంతో పెనవేసుకున్నది. ఈ బయోపిక్ తీసేందుకు స్క్రిప్ట్లో ఎలాంటి నాటకీయత సిద్ధం చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. తండ్రి మరణంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్రపరిశ్రమలోకి రావాల్సి వచ్చిన లతాజీ.. ఎన్నో ఒడిదొడుకులను.. మరెన్నో పోరాటాలను ఎదుర్కొని తలెత్తుకుని నిలిచారు.
పెద్ద సంగీత దర్శకులతో, నిర్మాతలతో గొడవ పడ్డారు. అయినప్పటికీ తన సహజ సూత్రాల్లో ముఖ్యమైనదైన వ్యక్తిత్వాన్ని ఏనాడూ వదులుకోలేదు. యుక్తవయసులో మరాఠీ సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో పెండ్లి చేసేందుకు తల్లి ఆలోచించగా.. తన బాధ్యతలను విస్మరించి పెండ్లి చేసుకుని మరో ఇంటికి పోవడం ధర్మం కాదు అని పెండ్లిని నిరాకరించింది. 18 ఏండ్ల వయసులో ఆమెను సినిమా నిర్మాత శశిధర్ ముఖర్జీకి సంగీతకారుడైన గులాం హైదర్ పరిచయం చేశాడు. అయితే, ఆమె గొంతు చాలా పల్చగా ఉన్నదని, సినిమాల్లో పనికిరాదని ఆమె ముఖంపైనే ముఖర్జీ చెప్పారు. ఆ సమయంలో అనుకోకుండా ముఖేశ్తో కలిసి ‘మజ్బూర్’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో లతాజీ మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడంతో తన తప్పును తెల్సుకున్న ముఖర్జీ.. లతాజీని క్షమించమని కోరి తన తదుపరి సినిమాలు ‘అనార్కలి’, ‘జిద్ది’ సినిమాల్లో అవకాశం ఇచ్చాడు.
‘మిస్ ఇండియా’ సినిమా కోసం 1957 లో లతాజీ ఎస్డీ బర్మన్తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఒక పాట సరిగా రాలేదని చెప్పిన ఎస్డీ బర్మన్.. మరోసారి రికార్డ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, వారం రోజుల వరకు తన డేట్స్ ఖాళీ లేకపోవడంతో రాలేనని కరాఖండిగా చెప్పింది. దాంతో ఆగ్రహించిన ఎస్డీ బర్మన్.. ‘తో ఇకపై పాటలు పాడించను’ అని అన్నారు. దాంతో ‘మీరేమీ ఇబ్బంది పడక్కరలేదు. నేనే స్వయంగా మీకు పాటలు పాడను’ అని ముఖంపైనే చెప్పేసింది. ఈ ఘటన అనంతరం ఆమె దాదాపు 3 ఏండ్ల వరకు ఎస్డీ బర్మన్ సంగీతదర్శకత్వంలో పాటలు పాడలేదు. 1961 లో ‘మాయా’ సినిమా కోసం ‘తస్వీర్ తేరీ దిల్ మే’ అనే పాటను మహ్మద్ రఫీతో పాడేందుకు లతాజీ ఒప్పందం చేసుకున్నారు. అయితే, రాయల్టీ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దాంతో కోపానికొచ్చిన రఫీజీ.. ‘ఇక మీతో కలిసి పని చేయలేను’ అని చెప్పారు. దాంతో ఇద్దరు కలిసి దాదాపు 4 ఏండ్ల పాటు పాడలేదంటే.. ఎంత ఆత్మాభిమానంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించిన లతాజీ.. సినిమాల్లో ద్వంద్వార్థాలు వచ్చే పాటలు పాడేందుకు నిరాకరించేవారు. లతాజీ మొండికేయడంతో ఎన్నో పాటలను రాయిటర్స్ మార్చాల్సి వచ్చింది. 1964 లో ‘సంగం’ సినిమా కోసం ‘మై కా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గయా’ పాట విషయంలో ప్రముఖ హీరో రాజ్కపూర్తో గంటన్నరకు పైగా వాగ్వాదం పెట్టుకున్నారు. పాటలో సాహిత్యం చాలా బాగున్నదని గంటకు పైగా నచ్చజెప్పినా వినలేదు. చివరకు ‘పాటను మనసు పెట్టి పాడలేదు’ అని చల్లగా చెప్పి అక్కడున్న వారినందరికీ కోపం తెప్పించారు.
తొలి పాటకు రూ.25 తీసుకున్న లతాజీ.. తుదిశ్వాస విడిచేనాటికి రూ.370 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నది. 92 ఏండ్ల వయసున్న లతాజీ.. 36 భాషల్లో వేయికి పైగా సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ ఆమె తన పాటల ద్వారా రాయల్టీ రూపంలో నెలకు రూ.40 లక్షలు అందుకుంటున్నారు. తన సినిమా జీవితంలో 1991 లో కాఫ్ సిరప్ అనే ఒకే ఒక్క వాణిజ్య ప్రకటనలో నటించారు.