Peddi | రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల ముంగిట నిజామాబాద్లోని ప్రముఖ ‘నటరాజ్ థియేటర్’ కేటాయింపు వ్యవహారం టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ థియేటర్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) అధినేతల మధ్య మరికాసేపట్లో ఒక కీలక సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ రెడ్డిల సొంత ఊరు కావడంతో, ఈ థియేటర్ వ్యవహారం ఇరు వర్గాలకూ ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఈ అంతర్గత చర్చల్లో సమస్య సామరస్యంగా పరిష్కారమైతే, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం నిజామాబాద్లోని ఎస్వీసీ (SVC) గ్రూప్నకు చెందిన థియేటర్లలో కూడా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు మార్గం సుగమం కానుంది.