Lata Mangeshkar | గాన కోకిల, మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఇక లేరు.. అనే విషయాన్ని భారత సినీ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 92 ఏళ్ల వయసులో తను తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.
లతా మంగేష్కర్కు భారతీయ సంగీతంతో ఎనలేని సంబంధం ఉంది. దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా లతా మంగేష్కర్ పాటలు పాడారు. తను ఎక్కువగా హిందీ పాటలు పాడారు. అందులోనూ ఎక్కువగా మెలోడీ సాంగ్స్ పాడటంతో తను దిట్ట.
కాకపోతే తెలుగులో మాత్రం లతా మంగేష్కర్ కేవలం మూడే పాటలు పాడారు. తన తొలి తెలుగు పాట నిదురపోరా తమ్ముడా. ఆ పాట.. సంతానం సినిమాలోనిది. 1955లో రిలీజ్ అయిన ఆ సినిమాలో ఏఎన్నార్, సావిత్ర జంటగా నటించారు. సుసర్ల దక్షిణమూర్తి ఆ సినిమాకు సంగీతం అందించారు. దక్షిణమూర్తితో ఉన్న సాన్నిహిత్యం వల్ల లతా మంగేష్కర్ తొలిసారి తెలుగు సినిమాలో పాట పాడారు.
ఆ తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిన దొరికితే దొంగలు అనే సినిమాలో శ్రీవెంకటేశా అనే పాటను పాడారు. ఇక.. మూడో పాట 1988లో వచ్చిన ఆఖరి పోరాటం సినిమాలోనిది. ఆ సినిమాలో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించారు. ఆ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. అందులో తెల్ల చీరకు అనే పాటను లతా మంగేష్కర్ ఆలపించారు.
అయితే.. తెలుగులో కేవలం మూడే పాటలు పాడటానికి.. ఎక్కువ పాటలు పాడకపోవడానికి కారణం.. తనకు హిందీలో ఉన్న బిజీయే. అప్పట్లో తను రోజుకు కనీసం 7 నుంచి 8 పాటలు పాడాల్సి వచ్చేదట. అందుకే సౌత్ ఇండస్ట్రీలో పాటలు పాడే సమయం లతా మంగేష్కర్కు దొరకలేదు. కేవలం మూడు పాటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.