కొడంగల్, మే 28: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం నిత్య సేవకులను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి, వారికి టీకాలు వేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ దవాఖానలో సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో విధివిధానాలు అమలు చేస్తున్నదన్నారు. లాక్డౌన్ విధించడంతో పాటు ఇంటింటా జ్వర సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నదన్నారు. ప్రతిరోజూ ప్రజలతో మమేకమయ్యే రేషన్ డీలర్లు, సహాయకులు, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసే సిబ్బంది, గ్యాస్ డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది తదితర వారితో పాటు జర్నలిస్టులకు టీకాలు అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. వీరు ప్రజల మధ్యన ఉండే వ్యక్తులు కాబట్టి వీరికి టీకా అందించి రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయా వర్గాల వారిని గుర్తించి ప్రభుత్వం టీకా అందించడంతో సూపర్ స్ప్రెడర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. కరోనా పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్లో ఎటువంటి ఇబ్బందుల లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులకు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని హోంఐసొలేషన్లో ఉంచడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, వెంటనే మందులు అందించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, డా.వీణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మోమిన్పేటలో 35 మందికి వ్యాక్సిన్
మోమిన్పేట, మే 28: మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో 35 మందికి శుక్రవారం కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో విలేకరులు, ఫెర్టిలైజర్లు, పెట్రోల్బంక్లో పని చేస్తున్న సిబ్బందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.