ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కె.వి.ఆనంద్ శుక్రవారం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించారాయన. తొలుత ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్గా ఆనంద్ తన ప్రయాణాన్ని ఆరంభించారు. అనంతరం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీశ్రీరామ్ వద్ద అసిస్టెంట్గా చేరిన ఆనంద్ ‘తేవార్మగన్’, ‘తిరుడా తిరుడి’ సహా పలు సినిమాలకు పనిచేశారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్లాల్, శోభన జంటగా రూపొందిన మలయాళ చిత్రం ‘తెన్మావిన్ కోంబత్’ సినిమాతో సినిమాటోగ్రాఫర్గా ఆనంద్ కెరీర్ మొదలైంది. తొలి సినిమాతోనే జాతీయ పురస్కారాన్ని అందుకొని ప్రతిభను చాటుకున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘కాదల్ దేశం(ప్రేమదేశం), ‘ముదావలన్'(ఒకే ఒక్కడు), ‘బాయ్స్’, ‘శివాజీ’, ‘నాయక్’ చిత్రాలు కెమెరామెన్గా ఆనంద్కు ఎనలేని పేరుప్రఖ్యాతుల్ని తీసుకొచ్చాయి. బాలీవుడ్లో కెమెరామెన్గా తనదైన ముద్రవేసిన ఆనంద్ ..షారుఖ్ఖాన్ హీరోగా నటించిన ‘జోష్’తో పాటు ‘డోలీ సజా కె రఖ్నా’, ‘ది లెజెండ్ ఆఫ్ భగత్సింగ్’, ‘ఖాకీ’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగులో మోహన్బాబు నటించిన ‘పుణ్యభూమి నా దేశం’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
విలక్షణ దర్శకుడిగా..
దర్శకత్వంపై మక్కువతో 2005లో మెగాఫోన్ పట్టిన కె.వి.ఆనంద్ ‘కన కండేన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో ప్రశంసల్ని అందుకున్నారు. హీరో సూర్యతో రూపొందించిన ‘అయాన్’ (వీడొక్కడే), జీవా ‘కో’(రంగం) చిత్రాలతో కమర్షియల్గా పెద్ద విజయాల్ని అందుకున్నారాయన. ఉత్కంఠను రేకెత్తించే కథ, కథనాలతో ఊహకందని మలుపులతో ఈ సినిమాల్ని రూపొందించిన ఆనంద్ అవార్డులు సొంతంచేసుకున్నారు. సూర్య హీరోగా అవిభక్త కవలల కథాంశంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ‘మ్యాట్రన్’తో పాటు అనేగన్, కావన్ వంటి విభిన్న సినిమాలతో దర్శకుడిగా వైవిధ్యతను చాటుకున్నారు. సూర్య, మోహన్లాల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కాప్పాన్’ దర్శకుడిగా ఆనంద్ చివరి చిత్రం. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమాలు తెలుగులో అనువాదమై పెద్ద విజయాల్ని సాధించాయి. కె.వి.ఆనంద్ మరణంతో తమిళ చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ‘కె.వి.ఆనంద్ మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం నన్ను బాధించింది’ అని అగ్ర హీరో రజనీకాంత్ సంతాపం ప్రకటించారు. ఆనంద్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, స్వీయ ప్రతిభ, సంకల్పంతో ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నారని కమల్హాసన్ పేర్కొన్నారు. ఆనంద్ భార్యతో పాటు కూతురు రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఉదయం ఆనంద్కు శ్వాససంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనే స్వయంగా కారులో ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆనంద్ మృతిచెందారు.