CM Mamata Benerjee | కోల్కతా, మే 4: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ఖాలీ ఉదంతం ఒక పెద్ద కుట్ర అని టీఎంసీ ఆరోపించింది. కేవలం బెంగాల్పై ద్వేషం, అధికార కాంక్షతో బీజేపీ ఈ క్రూరమైన చర్యకు పాల్పడిందని విమర్శించింది. సందేశ్ఖాలీ కుట్రపై బీజేపీ నేత ఒకరు మాట్లాడిన వీడియోను ఆ పార్టీ శనివారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల వేళ టీఎంసీ ప్రతిష్ట దిగజార్చడానికి ఇది బీజేపీ పన్నిన కుట్రగా పేర్కొంది. సందేశ్ఖాలీలో స్థానిక టీఎంసీ నేతలు మహిళలను లైంగికంగా వేధించడమే కాక, వారి భూములను బలవంతంగా లాక్కున్నారంటూ వచ్చిన ఆరోపణలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.
కాగా, శనివారం విడుదల చేసిన వీడియోలో సందేశ్ఖాలీ బీజేపీ మండల అధ్యక్షుడిగా పేర్కొంటున్న ఒక వ్యక్తి ఈ మొత్తం కుట్రకు బెంగాల్ అసెంబ్లీ విపక్ష బీజేపీ నేత సువేందు అధికారే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. సందేశ్ఖాలీకి చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ సహా స్థానికంగా ఉన్న నేతలు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ముగ్గురు నలుగురు మహిళలు ఆరోపించేలా చేయమంటూ తనకు, మరికొంత మంది నేతలకు సువేందు అధికారి ఆదేశాలు ఇచ్చారన్నారు. అలాగే నందిగ్రామ్ శాసన సభ్యుడైన సువేందు అధికారి స్వయంగా సందేశ్ఖాలీలోని ఒక ఇంట్లో తుపాకులు ఉంచారని, వాటినే తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడిలో స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు.
సందేశ్ఖాలీపై వెల్లడైన నిజాలు షాకింగ్కు గురి చేశాయని, ఈ విషయంలో బీజేపీ ఎంత లోతుగా వ్యవహరించిందో బట్టబయలైందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. శనివారం ఆమె పలు ఎన్నికల సభలలో మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ధి, సంస్కృతిని చూసి ద్వేషం పెంచుకున్న ఈ బెంగాలీ విరోధులు రాష్ర్టాన్ని అన్ని విధాల దిగజార్చడానికి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక రాష్ట్రంలోని ప్రజలందరిపై గతంలో ఎన్నడూ ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇలాంటి క్రూరమైన ఆలోచన చేయలేదన్నారు.
‘సందేశ్ఖాలీ వెనుక జరిగిన కుట్ర స్ట్రింగ్ వీడియోలో బయటపడింది. అది నిజంగా షాక్ కలిగించింది. అభివృద్ధి బాటలో ఉన్న బెంగాల్పై ద్వేషం, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వారు జరిపిన కుట్ర బయటపడింది. ఈ అసహ్యకరమైన చర్య చరిత్రలో అత్యంత ఘోరమైన అధికార దుర్వినియోగాన్ని సూచిస్తుంది’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఇది బీజేపీ సిగ్గుమాలిన చర్య అని మండపడ్డారు. టీఎంసీ ఆరోపణలపై బీజేపీ అధికారి ప్రతినిధి శంకుదేబ్ పాండే మాట్లాడుతూ సందేశ్ఖాలీ ఉదంతంతో ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో దాని నుంచి బయటపడటానికి మరో మార్గం లేక టీఎంసీ ఇలాంటి వీడియోలు సృష్టించిందన్నారు.