కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి సీనియర్ నటుడు చిరంజీవి ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం రోజున కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లను తరలించారు. బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున అందజేశారు. అలాగే ఖమ్మం, కరీంనగర్లో బుధవారం ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున తెలుగు రాష్ర్టాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.