By Maduri Mattaiah
chandrabose special interview | 27 ఏళ్ల పాటల ప్రస్థానంలో అన్ని రకాల చిత్రాలకు సాహిత్యం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తొలిపాట నుండి ఇప్పటి వరకు ప్రతి పాటను ఎంతో అంకితభావంతో, ప్రేమతో రచించాను అన్నారు ప్రఖ్యాత గేయ రచయిత చంద్రబోస్..ఆయన సాహిత్యాన్ని సమకూర్చిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో అన్ని పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించడం విశేషం. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చంద్రబోస్తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది..
దర్శకుడు సుకుమార్ చిత్రాలకు మీరు అందించే సాహిత్యం ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకని?
సుకుమార్లో గొప్ప కవిహృదయం ఉంది. ఆయన సినిమాకు పాటలు రాయడం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆర్య సినిమా నుంచి సుకుమార్తో నాకు మంచి అనుబంధం ఉంది. మిగిలిన దర్శకులతో పనిచేయడం వేరు.. సుకుమార్తో పనిచేయడం వేరు. ఎందుకంటే సుకుమార్ గారే ఓ సాహిత్య గని. ఆయన్ను సంతృప్తి పరచడం అంత ఈజీ కాదు. నేను మాత్రం సుక్కును ప్రతి పాటతో మెప్పించే ప్రయత్నం చేస్తుంటా
పుష్పలో దాక్కో దాక్కో మేకకు పాటకు ప్రేరణ ఏమైనా ఉందా?
ప్రేక్షకులు ఊహకు అందని సందర్భాలెన్నో పుష్ప సినిమాలో ఉన్నాయి. సమాజంలోని ప్రతి వ్యక్తికి తనదైన జీవితం, జీవన సంగీతం ఉంటాయి. వారి జీవితాల్ని స్పృశిస్తూ సంగీతాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఇందులో పుష్పరాజ్ గమ్యాన్ని, జీవితాన్ని అతడి కోణంలో చూపిస్తూ పాటలను రాశా. తాను జీవితాన్ని ఏ విధంగా దర్శిస్తున్నాడో దాక్కో దాక్కో మేక పాటలో చూపించాను. ఆహారపు గొలుసుకు ఆధ్మాత్మిక తత్వాన్ని జోడిస్తూ నవ్య ఆలోచనతో రాసిన పాట ఇది. పదిహేను రోజులు కష్టపడి పాట పూర్తిచేశా. పల్లవి వినిపించగానే నావైపు అభినందనపూర్వకంగా దర్శకుడు సుకుమార్ చూశారు. ఆ చూపులతోనే ఆయనకు పాట నచ్చిందని అర్థమైంది. ఈ సినిమాలోని సందర్భాలు కొత్తవి కావడంతో పాటలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకున్నది.
శ్రీవల్లి పాటలో కథానాయిక పట్ల హీరో తనకున్న ఆరాధనను అందంగా మీ పాట రూపంలో వ్యక్తీకరించారు? ఇది మీ ఆలోచనా? లేక సుకుమార్ గారి సలహానా?
సుకుమార్ ఇచ్చిన సన్నివేశానికి.. హీరో పాత్ర ఔచిత్య అనుగుణంగా ఈ పాటను రాశాను. హీరో ఆత్మాభిమానంతో పాటు కథానాయిక పట్ల అతడికి ఉన్న ఆరాధనను వర్ణిస్తూ శ్రీవల్లి పాట సాగుతుంది. పలుకేబంగారమాయనే అనే కీర్తన స్ఫూర్తితో ప్రేయసి చూపుల్లో తాను పడాలని తపించే ప్రేమికుడి భావాలను పొందుపరుస్తూ రాసిన పాట ఇది. చూపే బంగారామాయనే పదం తర్వాత యువతి పేరు ఉంటే బాగుంటుందని శ్రీవల్లి అని జోడించా. కథానాయిక పేరు ఈ పాట నుంచే పుట్టింది. శ్రీవల్లి పాట బాగుందని విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చెబుతుండటం ఆనందంగా ఉంది.
సామీ.. సామీ పాట పూర్తిగా చిత్తూరు యాసలో రచించారు? ఈ పాటకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి కదా?
సుకుమార్ గారి గత చిత్రాల్లో కూడా నేను పాటలు రాసినప్పటికీ.. ఈ సినిమాకు రాయటం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా స్లాంగ్లో నడుస్తుంది. అందుకే పాటల్లో కూడా ఆ ప్రాంత యాసను, పదాలను వాడాల్సి వచ్చింది. ముందు ఒకింత ఆలోచనలో పడ్డాను. అయితే సుకుమార్ , అల్లు అర్జున్ చిత్తూరు యాసను కష్టపడి ఒంట బట్టించుకుని, అందులో లీనమైపోయిన విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నేను కూడా ఆ స్లాంగ్, ఆ ప్రాంత నేటివిటీకి సంబంధించిన పదాలను పట్టుకోవటంలో తీవ్రంగా కృషి చేశాను. దాని ఫలితమే ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న పాటలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్కే చాలెంజ్ విసిరాయి. . ఇందులోని కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో సెప్పకుంటే దాని విలువ సున్న కదా సామీ అనే పంక్తులు నాకు చాలా ఇష్టం.
సుకుమార్ సినిమాలో ఐటెంసాంగ్కు ఓ ప్రత్యేకత ఉంటుంది? ఈ చిత్రంలో ఉండే ప్రత్యేక గీతంలో సమంత నర్తించబోతుంది. ఈ సాంగ్ ఎలా ఉంటుంది?
సుకుమార్, దేవిశ్రీప్రసాద్ , నా కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల్లానే ఇందులో కూడా ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. ప్రేక్షకుల అంచనాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. రంగస్థలం పాటల విషయంలో కూడా నేటివిటీ బేస్ ఎక్కువగానే ఉంటుంది. అయితే అందులోని రాంబాబు.. ఇందులోని పుష్పరాజ్ వ్యక్తిత్వాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలను బలపరుస్తూనే పాటల రచన సాగింది. ఈ సినిమాలో నేను రాసిన ఊ అంటావా ఉహూ అంటావా అనే ప్రత్యేక గీతం శుక్రవారం విడుదల కానుంది. సమాజంలోని ఓ అంశాన్ని కథగా మలిచి రాసిన పాట ఇది. ఈ పాటకు సమంత అందం, అభినయం, నాట్యకౌశలం చక్కగా కుదిరాయి. సుకుమార్తో నా కలయికలో వచ్చిన జిగేల్ రాణి, డియ్యాలో డియ్యాలో, రింగ రింగ తరహాలో ఈ ప్రత్యేక గీతం శ్రోతల ఆదరణ పొందుతున్నదని నమ్ముతున్నా.
గాయనీ గాయకుల ఎంపిక విషయంలో మీ సలహాలు తీసుకుంటారా?
గాయనీగాయకుల ఎంపిక విషయంలో సంగీత దర్శకులు అడిగితేనే సలహాలిస్తా. సామీ సామీ పాటను ఎవరితో పాడిస్తే బాగుంటుందో చెప్పమని దేవిశ్రీప్రసాద్ నన్ను అడిగారు. నలుగురు ఫోక్ సింగర్స్ పేర్లు చెప్పాను. వారిలో నుంచి మౌనిక యాదవ్ను ఆయనే ఎంపిక చేసుకున్నారు. స్థానికతకు ప్రాధాన్యతనిచ్చే కథాంశాల వల్ల జానపద గాయనీగాయకులకు అవకాశాలు పెరుగుతున్నాయి.
సుకుమార్, చంద్రబోస్ కాంబినేషన్ ఇలా కొనసాగుతుందా?
సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో పాటలు రాశా. రంగస్థలం సినిమా తర్వాత మా కలయికకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా కోసం కాగితంపై కలం పెట్టి ఒక్క అక్షరం రాయలేదు. పాట సందర్భాల్ని సుకుమార్ వర్ణిస్తూ ఉంటే అలవోకగా నేను చెప్పిన పదాలను పాటలుగా దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. ఇరవై ఏడేళ్ల నా సినీ ప్రయాణంలో అదొక మధురమైన అనుభూతిగా నిలిచింది
ఆర్ఆర్ఆర్లో నాటు నాటు సాంగ్కు వస్తున్న స్పందన ఎలా ఉంది?
ఎంతో ఆనందంగా వుంది.. ఊహించిన దాని కంటే అద్భుతమైన స్పందన వస్తుంది..
-Maduri Mattaiah
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఉ అంటావా.. ఊ అంటావా.. పుష్పలో సమంత సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
పుష్ప సినిమాలో అనసూయ సంచలన పాత్ర.. దాక్షాయణి ఎలా ఉండబోతుందంటే..?
Rashmika surprise gift | అల్లు అర్జున్కు రష్మిక ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..?