కష్టమొచ్చినప్పుడల్లా తామున్నామనే భరోసా ఇస్తూ ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు కొందరు సినీ సెలబ్రిటీస్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ఈ పోరులో మేము భాగం అవుతామంటూ విరాళాలు అందిస్తున్నారు. కొందరు ఆక్సిజన్, మందులు వంటివి సాయం చేస్తున్నారు. తాజాగా అమితాబ్ వచ్చన్ రూ. 2 కోట్లు విరాళమిచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కోవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దీనికి ఆయన రూ. 2 కోట్లు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ వెల్లడించారు.
300 పడకలు గల ఈ కేంద్రం నేటి నుండి ప్రారంభం కానుండగా, ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలను కూడా తెప్పిస్తానని అమితాబ్ బచ్చన్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. బిగ్ బీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఈ కేంద్రానికి అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీస్తున్నారట. రానున్న రోజుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మాటిచ్చారన్నారు మజిందర్ సింగ్.