న్యూఢిల్లీ, మే 9: కరోనా కాటుకు చిక్కి శల్యమవుతున్న భారత్కు దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల చేసిన ఉద్దీపన ప్రకటనలు ఊరటనిస్తున్నాయి. వ్యాపార విస్తరణ, వార్షిక టర్నోవర్లపైనే కార్పొరేట్ సంస్థలు ఎప్పుడూ దృష్టిసారిస్తాయన్న అపవాదును చెరిపివేస్తూ.. కష్టకాలంలో ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అండగా ఉండేందుకు వెనుకాడబోమని ఆయా సంస్థలు నిరూపిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టాటా గ్రూప్, రిలయన్స్, అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, సిప్లా, ఎస్బీఐ, టెక్ మహీంద్రా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
విరాళం.. ప్రాణవాయువు సాయం
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ వంతు సాయంగా 1.8 కోట్ల డాలర్లు (రూ.132 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు. దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ముందుకొచ్చింది. రోజుకు 1,000 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ను (దేశంలోని మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో 11 శాతం) సరఫరా చేస్తామని ప్రకటించింది. ఆక్సిజన్ ఉత్పత్తికి తమ ప్లాంట్లలో స్టీల్ ఉత్పత్తులను కొంతమేర నిలిపివేస్తున్నట్టు ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ జేఎస్డబ్ల్యూ ప్రకటించింది. వివిధ రాష్ర్టాలకు రోజుకు 900 టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు టాటా గ్రూప్ 1,000 క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకున్నది.
దవాఖానల ఏర్పాటు
పుణెలోని తమ సాఫ్ట్వేర్ సంస్థను 430 పడకల కొవిడ్ దవాఖానగా విప్రో సంస్థ మార్చింది. పేదలకు కొవిడ్-19 వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు నారాయణ హెల్త్ సాయంతో ఇన్ఫోసిస్ సంస్థ బెంగళూరులో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో కొవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు సిప్లా సంస్థ సాయాన్ని అందించింది. ఢిల్లీలో వేదాంత గ్రూప్, గుజరాత్లో అదానీ గ్రూప్ కొవిడ్ దవాఖానలు ఏర్పాటు చేశాయి. అహ్మదాబాద్లోని అదానీ విద్యామందిర్ స్కూల్లో ఎమర్జెన్సీ కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. టాటా గ్రూప్ బెంగాల్లో 200 పడకలతో కొవిడ్ దవాఖానను ఏర్పాటు చేయడమే గాకుండా.. వివిధ దవాఖానల్లో మరో 5,000 పడకలను సమకూర్చింది.
దాతృత్వంలో మరికొన్ని సంస్థలుఅమెజాన్-1,000 మెడ్ట్రానిక్ వెంటిలేటర్లు
మైక్రోసాఫ్ట్-1,000 వెంటిలేటర్లు, 25,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డివైజ్లు
ఎస్బీఐ-దేశవ్యాప్తంగా దవాఖానల్లో 2,000 పడకల ఏర్పాటు, 250 ఐసీయూ బెడ్లు
కోల్ ఇండియా-దవాఖానల్లో 2,000 పడకల ఏర్పాటు, 750 ఆక్సిజన్ బెడ్లు, 70 ఐసీయూ బెడ్లు
టెక్ మహీంద్రా-20కి పైగా దవాఖానలకు వెంటిలేటర్లు, వైద్య సామగ్రి
ఎల్&టీ-22 ఆక్సిజన్ జనరేటర్లు
వాల్మార్ట్-20 ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు, మరో 20 క్రయోజెనిక్ కంటైనర్లు
కోల్ ఇండియా- రెండు ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు