న్యూఢిల్లీ, మే 9: రమేశ్ ఓ బ్యాంకు ఉద్యోగి. వయస్సు 30 ఏండ్ల పైనే. కొవిన్లో కరోనా టీకా స్లాట్ కోసం అనేక సార్లు ప్రయత్నించాడు. నిమిషాల వ్యవధిలోనే స్లాట్లు అయిపోవడంతో స్లాట్ బుక్ చేసుకోలేక విసిగిపోయాడు. అదే సమయంలో ఆయనకు.. టీకా స్లాట్ ఉన్నప్పుడు అలర్ట్ మెసేజ్ వచ్చే ఓ సాఫ్ట్వేర్ గురించి తెలిసింది. సబ్స్ర్కైబ్ చేసుకొన్నాడు. అలర్ట్ రాగానే టీకా కోసం స్లాట్ బుక్ చేసుకొన్నాడు. టీకాల కొరత నేపథ్యంలో భారత టెకీలు తెలివి మీరిపోయారు. ప్రత్యేకంగా కోడ్ రాసి దానిని కొవిన్ వెబ్సైట్తో అనుసంధానం చేసి స్లాట్ ఖాళీ ఉన్నప్పుడు మెసేజ్ వచ్చేలా ప్రోగ్రాం రూపొందించారు. వీరు టెలిగ్రామ్లో గ్రూపులు క్రియేట్ చేసి స్లాట్లు ఉన్నప్పుడు ఆ గ్రూపులో సమాచారం ఇస్తున్నారు. ఇంకా కొందరైతే ముందే పేర్లు, ఫోను నెంబర్లు ఇచ్చి ఎప్పుడు స్లాట్ ఖాళీ ఉంటే అప్పుడు బుక్ అయ్యేలా కోడింగ్ చేశారు. చెన్నైకి చెందిన బెర్టీ థామస్ ఇలాంటి వారిలో ఒకరు. తాను ఏప్రిల్ 29న టీకా స్లాట్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యానని, అప్పుడే కోడింగ్ ఆలోచన వచ్చిందని చెప్పారు. తాము పలు నగరాలకు సంబంధించి టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేశామని, స్లాట్ల సమాచారం తెలియజేస్తున్నామని తెలిపారు. అయితే కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ దీనిని కొట్టిపారేశారు.