Keerthy Suresh | మహానటితో ఆకాశమంత క్రేజ్ తెచ్చుకుంది కీర్తిసురేశ్. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిని చూసిన ప్రేక్షకులు ఆమెను వేరే పాత్రలో చూడలేకపోయారు. దీంతో చాలాకాలం పాటు పరాజయాలను ఎదుర్కొంది. ఎలాగైనా మళ్లీ ఫామ్లోకి రావాలని భావించిన కీర్తి.. తన రూట్ మార్చి గ్లామర్ షోకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ రోల్తో హిట్ అందుకుంది. ఆ తర్వాత నాని దసరా సినిమాతో కూడా బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. మొత్తానికి చాలా ఏండ్ల తర్వాత ఫామ్లోకి వచ్చిన కీర్తి సురేశ్కు తాజాగా బాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చినట్లు తెలుస్తోంది.
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్లో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ కాలిస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా దక్షిణాది భామను ఎంపిక చేయాలని మేకర్స్ భావించారు. అందుకే సౌత్లో ఇప్పుడు ఫామ్లో ఉన్న కీర్తి సురేశ్ను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కీర్తిని మేకర్స్ కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. కీర్తి సురేశ్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తుందనే న్యూస్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నిజానికి కీర్తి సురేశ్ బాలీవుడ్కి ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సింది. 2019లోనే ముంబై నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన మైదాన్ సినిమాకు కీర్తి సురేశ్ను ఎంపిక చేశారు. కానీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఆమెను తప్పించారు. మైదాన్ సినిమాలో కీర్తి సురేశ్తో పలు సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. అయితే తీరా ఆ సన్నివేశాలు చూశాక సీనియర్ హీరో అయిన అజయ్ దేవగణ్ పక్కన.. కీర్తి సురేశ్ చిన్న పిల్లల ఉందని.. హీరోయిన్గా సెట్ కాదనే ఉద్దేశంతోనే ఆమెను తప్పించారని వార్తలు వచ్చాయి. కీర్తి తప్పుకోవడంతో ఆ పాత్రకు ప్రియమణిని ఎంపిక చేశారు. దీంతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ అప్పుడు వాయిదా పడింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమెకు అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అన్నట్టు కీర్తి సురేశ్ మిస్ చేసుకున్న మైదాన్ సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడం గమనార్హం.