Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. తన పైలట్లను 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు సంస్థ అంతర్గత నివేదికల్లో తేలింది. పైలట్లు 65 ఏండ్ల వరకు ఉద్యోగం చేయడానికి సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అనుమతి ఇస్తున్నది. కానీ ఎయిర్ ఇండియా పైలట్లు 58 ఏండ్లకే రిటైరవుతున్నారు. అత్యధిక విమానయాన సంస్థలు తమ పైలట్లను 65 ఏండ్ల వరకు సర్వీసులో కొనసాగిస్తున్నాయని మహారాజా రూపొందించిన ఆ అంతర్గత నివేదిక వెల్లడించింది. గత నెల 29న ఎయిర్ ఇండియా ఈ నివేదిక రూపొందించినట్లు సమాచారం.
సంస్థను విస్తరించాలన్న ప్రణాళికలు రూపొందిస్తున్నది ఎయిర్ ఇండియా. ఈ నేపథ్యంలో కొత్తగా 200కి పైగా విమానాలు కొనుగోలు చేయాలని టాటా సన్స్ భావిస్తున్నది. ఎయిర్ ఇండియా ప్రస్తుత పైలట్లు 58 ఏండ్లకు రిటైరైనా.. తమ అవసరాలకు అనుగుణంగా కాంట్రాక్ట్ పద్దతిలో ఐదేండ్లు.. అటుపై 65 ఏండ్ల వయస్సు వరకూ కొనసాగిస్తాం అని ఆ నివేదిక తెలిపింది. పైలట్లు 58 ఏండ్లకు రిటైరైన తర్వాత ఐదేండ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటే, వారికి ఒక పరీక్ష పెట్టిన తర్వాత 65 ఏండ్ల వరకూ కాంట్రాక్ట్ పొడిగిస్తారు.
ఎయిర్ ఇండియా టేకోవర్ కోసం గతేడాది అక్టోబర్ 8న టాటా సన్స్ బిడ్ గెలుచుకున్నది. ఈ ఏడాది జనవరి 27న టేకోవర్ చేసింది. కాగా, సంస్థకు నూతనంగా నియమితులైన సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్.. ఎయిర్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఐవోసీసీ) గురించి వివరాలు అడిగారు. దీనిపై తనకే నేరుగా రిపోర్ట్ చేయాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారని సమాచారం.