ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటున్నాయి. అందుకే, పేద, మధ్యతరగతి జీవులు పైసా, పైసా కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకొన్న సొమ్ము.. ఎగవేతదార్ల జేబుల్లోకిపోతున్నది. ఏటేటా జరుగుతున్న లోన్ రైటాఫ్ల్లో కార్పొరేట్ల మొండి బకాయిలు ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం.
Bank Loans | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్లు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. 2014 నుంచి గడిచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ చేశాయి ప్రభుత్వరంగ బ్యాంకులు. ఇందులో కార్పొరేట్లకు సంబంధించినవే రూ. 7,40,968 కోట్లు ఉండటం విశేషం.
ఈ మేరకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్కు సోమవారం వెల్లడించింది. ఖాతా పుస్తకాల బరువును తగ్గించుకొని, ఇచ్చిన రుణాలను తర్వాత వసూలు చేసుకుంటామంటూ ముందుగా రైటాఫ్లకు దిగుతున్న బ్యాంకులు.. ఆ తర్వాత రికవరీ చేస్తున్న మొత్తాలు అత్యంత తక్కువగా ఉంటున్నాయి. గడిచిన తొమ్మిదేండ్లలో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేసిన బ్యాంకులు.. వసూలు చేసింది మాత్రం రూ. 2,04,668 కోట్లే. అంటే రికవరీ రేటు కేవలం 14 శాతంగానే ఉన్నది.
పది రెట్లు పెరిగారు
అప్పును తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే రుణాలను ఎగ్గొట్టే విల్ఫుల్ డిఫాల్ట్ల సంఖ్య (ఉద్దేశపూర్వక ఎగవేతలు) బీజేపీ హయాంలో ఏకంగా పది రెట్లు పెరిగింది. 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 16,044గా ఉన్నట్టు పలు బ్యాంకులు ఇచ్చిన నివేదికలను బట్టి తెలుస్తున్నది. మొత్తంగా వీళ్లు రూ. 3,46,479 కోట్ల రుణాలను కావాలనే ఎగ్గొట్టినట్టు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు విల్ఫుల్ డిఫాల్టర్లేనని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్కు ప్రభుత్వమే బదులిచ్చింది. ఇదే విషయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలోనూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దీన్నిబట్టి సామాన్యులు కష్టపడి బ్యాంకుల్లో దాచుకొన్న సొమ్ము.. పరోక్షంగా ఎగవేతదారుల జేబుల్లోకి వెళ్తున్నట్టు అర్థమవుతున్నది.