జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత పాలకవర్గం హయాంలో నిధుల దారి మళ్లింపు వ్యవహారం కలకలం రేపుతోంది. గత పాలకవర్గ హయాంలో జరిగిన పలు అవకతవకలపై ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 118వ మహాజన సభలో వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర సహకార బ్యాంకులో నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం నివేదికను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పంపించింది. ఈ నేపథ్యంలో నివేదికలోని పలు అంశాలపై చర్చ జరిగింది.
ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర సహకార బ్యాంకులో నిధుల మళ్లింపు అంశంపై అడిషనల్ రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని మహాజన సభ తీర్మానం చేసింది. ఉన్నతాధికారుల నుంచి అందిన నివేదిక ఆధారంగా గత పాలకసంస్థలో చైర్మన్గా ఉన్న మువ్వా విజయ్బాబు, పాలకమండలి సభ్యులు, సీఈవో ఆధ్వర్యంలో రూ.7,32,65,443లు రైతులకు సంబంధించిన సొమ్ము దారి మళ్లించారని, రైతుసంక్షేమ నిధి ఆసుపత్రి కోసం రూ.6,13,51,148 సేకరించారని, దీనివల్ల సహకార రంగంలోని సభ్యులకు నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. ఇక పాలకవర్గం వివిధ రూపాల్లో అనవసరపు ఖర్చులు చేసిందని నివేదికలో పేర్కొన్నారు. బహుమతుల పేరుతో రూ.63,15,443లు, విజ్ఞాన యాత్రలతో రూ.55,98,847లు బ్యాంకు సొమ్ము ఖర్చు చేశారని నివేదికలో పేర్కొన్నారు. గత పాలకవర్గం కేంద్ర సహకార బ్యాంకు విధి, విధానాలను అమలు చేయడం.. నియమావళిని పాటించడంలోనూ నిర్లక్ష్యం వహించిందని, రోజువారీ కార్యకలాపాల్లోనూ బ్యాంకు అధ్యక్షుడు జోక్యం ఉండకూడదన్న నిబంధనలూ ఉల్లంఘించారని పేర్కొంది.
నిధులురాబట్టాలని డిమాండ్
ఖమ్మంలో సహకార రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు పేరుతో నియమించిన కమిటీలో వైద్యరంగంలో అనుభవంలేని వారిని ఎలా నియమిస్తారని నివేదికలో ప్రశ్నించారు. గత పాలకవర్గం కేరళ పర్యటన సందర్భంలో అక్కడి ఆసుపత్రుల నిర్వహణను పరిశీలించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఎలాంటి నివేదికలు పొందుపర్చకపోవడాన్ని నివేదిక తప్పుపట్టింది. ఖమ్మంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని గత పాలకమండలి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిందని, ఇందుకు విధి, విధానాలు, బైలా సవరణ ద్వారా ఆసుపత్రి ఏర్పాటును పొందుపర్చాల్సి ఉన్నా.. అలాంటి పద్ధతులకు తిలోదకాలు ఇచ్చిందని నివేదికలో ఉంది. గత పాలకవర్గంలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో అమలు చేసి నిధులు రాబట్టాలని, నిధులు కేంద్ర సహకార బ్యాంకులో జమ చేయాలని జిల్లా కేంద్ర సహకార సంఘం అధ్యక్షుడు కూరాకుల నాగభూషయ్య మహాజన సభలో డిమాండ్ చేశారు.
ప్రస్తుత పాలకవర్గం ఆగ్రహం
పేద రైతుల కోసం ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని రూపొందించి వారికి లబ్ధి చేకూరిస్తే.. పేద రైతుల నుంచి ఆసుపత్రి కోసం వాటా సేకరించారని నివేదికలో పేర్కొన్నారు. దీంతో రైతుసంక్షేమ నిధికి, బ్యాంకుకు మధ్య సంబంధం, సమన్వయం లేకుండా పోయిందన్నారు. రైతులు సంక్షేమ నిధికి సంబంధించిన రూ.6,15,51,148 బ్యాంకుకు, ట్రస్టుకు లేకుండా ఉన్నాయని నివేదికలో ఉంది. గత పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన నిధుల దారి మళ్లింపు, అవకతవకల వ్యవహారంపై ప్రస్తుత పాలకవర్గం సీరియస్గా స్పందించింది.
నిబంధనలకు వ్యతిరేకం..
ఇక బహుమతుల కోసం రూ.63లక్షలు వినియోగించడం సహకార నిబంధనలకు వ్యతిరేకమని, ఇది సహకార చట్ట నిబంధనల ఉల్లంఘించడమేనని నివేదికలో పేర్కొన్నారు. నిధుల దారి మళ్లింపు, బహుమతుల పేరుతో ఖర్చు, సహకార సంఘాల సభ్యుల ద్వారా సేకరించిన నిధులు సహకార చట్టం పరిధిలోని ట్రస్టులకు బదిలీ చేయడాన్ని నివేదిక తప్పుపట్టింది. కారణాలు తెలియాలని డిమాండ్ చేసింది.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
గత పాలకమండలి సేకరించిన రూ.7,32,65,443లను సభ్యుల నుంచి అనధికారికంగా సేకరించినప్పటికీ సహకార సంఘానికి సంబంధంలేని సంస్థకు మళ్లించడాన్ని నిధుల దుర్వినియోగంగానే భావిస్తున్నట్లు ప్రస్తుత పాలకమండలి స్పష్టం చేసింది. గత పాలకమండలి అధ్యక్షులతోపాటు పాలకవర్గసభ్యులు, బ్యాంకు కార్యనిర్వహణాధికారిని ఇందుకు బాధ్యులుగా భావించి చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి రూపొందించిన నివేదికను మహాజనసభలో ప్రవేశపెట్టి పలు అంశాలపై చర్చ జరిపారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని, సహకార స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రస్తుత పాలకవర్గం పేర్కొంది. ట్రస్టు పేరుతో రైతుల నుంచి సేకరించిన సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది.