EPFO | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈ సీలింగ్ను రూ.21,000కు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే లోక్సభ ఎన్నికల నడుమ ఈ ప్రతిపాదన ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఉద్యోగుల ఓటు బ్యాంకును ఆకట్టుకోవడంలో భాగంగానే మోదీ సర్కారు ఈ దిశగా ఆలోచిస్తున్నదన్న విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈపీఎఫ్వోలో సభ్యత్వం ఉన్న ఉద్యోగులు ఎప్పట్నుంచో వేతన పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక ఎన్నికల ప్రయోజనమే ఉందన్న అభిప్రాయాలు గట్టిగా వస్తున్నాయి. ఉద్యోగుల సామాజిక భద్రతని పైకి సర్కారు చెప్తున్నా.. అంతా వట్టిదేనని అంటున్నారు.
2014లో చివరిసారిగా పీఎఫ్ సాలరీ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. రూ.6,500ల నుంచి రూ.15,000కు మార్చింది. ఇక 1952లో ఈ పథకం మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా మొత్తం 8సార్లు పెంచారు. 1952లో రూ.300గా ఉన్నది. అయితే దీన్ని 1957లో రూ.500కు, 1962లో రూ.1,000కి, 1976లో రూ. 1,600కు, 1985లో రూ.2,500కు, 1990లో రూ.3,500కు, 1994లో రూ.5,000కు, 2001లో రూ.6,500కు, 2014లో రూ.15,000కు సవరించారు.
ఈపీఎఫ్వో వేతన పరిమితి పెరిగితే కంపెనీల యాజమాన్యాలపై భారం పడినా.. ఉద్యోగులకు మాత్రం లాభమే జరుగుతుంది. ఉద్యోగి బేసిక్ సాలరీ, డీఏ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్కు నగదు మొత్తాలు నెలనెలా జమవుతాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, దీనికి సమానంగా యాజమాన్యం ద్వారా మరో 12 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. దీనికి సంబంధించిన వేతన పరిమితే ప్రస్తుతం రూ.15,000గా ఉన్నది. దీన్నే రూ.21,000కు పెంచాలని చూస్తున్నారు. ఇదే పెరిగితే ఇప్పటిదాకా రూ.15,000 ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాకు జమవుతున్న మొత్తాలు.. ఇకపై రూ.21,000 ప్రాతిపదికన జమవుతాయి. దీనివల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్కు నిధులు పెరుగుతాయి. పదవీ విరమణ సమయంలో మరింత ఎక్కువగా నగదును పొందవచ్చు. కాగా, ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు కంపెనీల ద్వారా వెళ్లే 12 శాతంలో 8.33 శాతం సొమ్ము సదరు ఉద్యోగి పెన్షన్ ఖాతాకు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమవుతుంది. ఉద్యోగి నుంచి తీసుకునే మొత్తాలు మాత్రం పూర్తిగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకే వెళ్తాయి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా 1.16 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి వచ్చి చేరుతుంది.