న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశీయంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 28 శాతం పెరిగి రూ.42, 270 కోట్లకు చేరాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. 2021-22లో రూ.32,934 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, 2022-23లో రూ.42, 470 కోట్లకు ఎగిశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కారద్ తెలిపారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.6,087 కోట్లుగా ఉన్నాయి. పదేండ్లు అంతకుమించి ఉన్న డిపాజిట్లను ఆర్బీఐకి చెందిన డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. మరోవైపు, బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ తగ్గింది. మార్చి 31, 2019 నాటికి రూ.9,33,778 కోట్లుగా ఉంటే.. మార్చి 31, 2021 నాటికి రూ.8,35,051 కోట్లకు తగ్గాయి. ఇదే క్రమంలో మార్చి 31, 2023 నాటికి రూ.5,71,544 కోట్లకు తగ్గాయి.