న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్స్పై చార్జీల వసూలు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐలకు లేఖ రాశమాని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. దేశంలో అత్యధిక జనాభా యూపీఐ ద్వారా చెల్లింపులు చేపడుతూ అత్యధిక డిజిటల్ చెల్లింపులు చేపడుతున్న దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకున్నదని సీటీఐ పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ ఊపందుకుంటున్న తరుణంలో వీటిపై చార్జీల వసూలుకు సిద్ధమైన ఆర్బీఐ ఈ అంశంపై ప్రజాభిప్రాయం కోరడం పట్ల సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ పేమెంట్స్ చేపట్టాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో డిజిటల్ పేమెంట్స్పై చార్జీలు వసూలు చేయడం సరైంది కాదని సీటీఐ భావిస్తోందని బ్రిజేష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భీమ్ యూపీఐ యాప్ను ప్రారంభించారని గోయల్ గుర్తు చేశారు. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి పలు కంపెనీలు యూపీఐ సేవలను ప్రారంభించాయని గుర్తు చేశారు. ప్రజలు ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లడం లేదని అన్నారు. డిజిటల్ పేమెంట్స్పై చార్జీల విధింపు ప్రతిపాదనను గోయల్ వ్యతిరేకించారు.
డిజిటల్ పేమెంట్స్పై చార్జీలు వసూలు చేస్తే డిజిటల్ లావాదేవీలు దెబ్బతినడంతో పాటు ప్రజలు తిరిగి ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట బారులు తీరుతారని హెచ్చరించారు. వ్యాపారులు సైతం యూపీఐ, డిజిటల్ రూపంలో చెల్లింపులను ఆమోదిస్తున్నారని, రోజుకు లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని సీటీఐ ప్రధాన కార్యదర్శి విష్ణు భార్గవ పేర్కొ్నారు. డిజిటల్ చెల్లింపులపై చార్జీలు విధిస్తే తాము తిరిగి పాత పద్ధతిలో నగదు లావాదేవీలకు తిరిగి వెళ్లాల్సివస్తుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సీటీఐ ప్రధాన కార్యదర్శి విఘ్ణు భార్గవ పేర్కొన్నారు.