WHO on Physical Exercise | ఋదయం లేవగానే వాకింగ్.. అటుపై ఆసనాలు.. యోగా చేస్తే చాలా హాయిగా ఉంటుంది. కానీ.. పనిలో పూర్తి అలసిపోయి.. మిగతా రోజంతా నిద్రకు.. సోఫాలు, కుర్చీలకే పరిమితవుతున్నారు. చాలా మంది శారీరక శ్రమపై శ్రద్ధ వహించడం వహించడం లేదు. ఇది యావత్ సమాజానికి, ఆర్థిక రంగానికి ముప్పు అంటున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రదర్శిస్తున్న అలసత్వం వల్ల ప్రపంచానికి రూ.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని హెచ్చరిస్తున్నది.
వివిధ దేశాల్లో ప్రస్తుత దశాబ్ధిలో అంటే 2020-2030 మధ్య సుమారు 50 కోట్ల మంది దీర్ఘకాలిక వ్యాధుల బారీన పడతారని డబ్ల్యూహెచ్వో రిపోర్ట్ పేర్కొంది. శారీరకంగా శ్రమ లేకపోవడంతో వచ్చే కొన్నేండ్లలో గుండె సంబంధ, మధుమేహం, ఊబకాయం తదితర వ్యాధులు ప్రబలుతాయని డబ్ల్యూహెచ్వో అంచనా. ఇందుకోసం వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రతి యేటా రూ.2.22 లక్షల కోట్లు (27 బిలియన్ల డాలర్లు) ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా ఈ వ్యయం 2030 నాటికి రూ.25 లక్షల కోట్లకు (300 బిలియన్ డాలర్లు) చేరుతుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్వో.
మూడేండ్ల క్రితమే అంటే 2019లోనే విడుదల చేసిన గ్లోబల్ యాక్షన్ ప్లాన్లో ప్రజలు శారీరక శ్రమ పెంచాలని డబ్ల్యూహెచ్వో హితవు చెప్పింది. 2019 నాటి నివేదిక అమలుపై 194 దేశాల్లో సంస్థ సర్వే నిర్వహించింది. ప్రజలు శారీరక శ్రమకు దూరం కావడంతో ప్రభుత్వాలకు పెద్ద ఖర్చుగా పరిణమిస్తుందని ఈ సర్వే నివేదిక హెచ్చరించింది.
నడక, సైక్లింగ్, ఆటలు, ఇతర రూపాల్లో శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించడానికి విధానాల అమలు వేగం పెంచాలని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. తత్ఫలితంగా వ్యక్తులు భౌతికంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండటంతోపాటు సమాజానికి, ఎకానమీకి మేలు చేసిన వారవుతారని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ చెప్పారు.
50 శాతం కంటే తక్కువ దేశాల్లో మాత్రమే జాతీయ స్థాయిలో ప్రజల భౌతిక కార్యకలాపాలకు విధానాలు ఉన్నాయి. అందులోనూ 40 శాతం దేశాలు మాత్రమే ఈ విధానాలను అమలు చేస్తున్నాయి. కేవలం 30 శాతం దేశాల్లో మాత్రమే అన్ని వయస్సుల వారికి జాతీయ భౌతిక కార్యకలాపాల మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి.
సుమారు అన్ని దేశాల్లో వయోజనుల వ్యాయామంపై పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నా 75 శాతం మాత్రమే అమల్లో పెడుతున్నాయి. ఐదేండ్ల కంటే తక్కువ వయస్సు గల పిల్లలపై 30 శాతం దేశాలు మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. రవాణా వ్యవస్థలో రోడ్ల వెంబడి సైక్లింగ్, వాకింగ్లకు సేఫ్టీతో కూడిన వసతులను కల్పించాలని డబ్ల్యూహెచ్వో సిఫారసు చేసింది. కానీ 40 శాతం దేశాలే ఈ సిఫారసులు పాటిస్తున్నాయి.