Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ మెజారిటీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే కదులుతున్నారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,289.46 పాయింట్లు పెరిగి 80,501.99 వద్ద స్థిరపడింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 307.35 పాయింట్లు అందిపుచ్చుకొని 24,346.70 దగ్గర ముగిసింది. ఇక ఈ వారం విషయానికొస్తే.. భారత్-పాక్ అంశాలు, జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై సూచీల కదలికలు అధికంగా ఆధారపడి ఉండనున్నాయి.
అలాగే రాబోయే జీడీపీ గణాంకాలు, అమెరికా-చైనా మధ్య ట్రేడ్వార్ పరిణామాలూ మార్కెట్ కదలికలకు కీలకమే. కాగా, ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,600-24,800 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.